పంటల్లో అధిక దిగుబడులు సాధించడానికి రసాయల ఎరువులు మోతాదుకు మించి వాడటం వల్ల భూసారం దెబ్బతింటున్నది. పర్యావరణ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. కాబట్టి రైతులు సేంద్రియ ఎరువులును తమస్థాయిలోనే తయారు చేసుకోవచ్చు. వాటిద్వారా పండించే పంటలకు మార్కెట్లో కూడా మంచి డిమాండు ఉన్నది. సేంద్రియ ఎరువులు తయారు చేసుకునే విధానాల గురించి తెలుసుకుందాం.
కంపోస్టు ఎరువు
మిగిలిపోయిన వ్యవసాయ వ్యర్థాలతో ఈ ఎరువు తయారుచేసుకోవచ్చు. ఎత్తయిన ప్రదేశంలో 1 మీ. లోతు, 2 మీ. వెడల్పు, అవసరమైనంత పొడవు గొయ్యి తవ్వాలి. వ్యర్థాలను 30 సెం.మీ. మందం పొరలుగా పేరుస్తూ, మధ్య మధ్యలో పేడ కలిపిన నీళ్లను, 8-10 కి. సూపర్ ఫాస్పేట్ చొప్పున ఒక్కొక్క పొరలో వేస్తూ నేల మట్టానికి అరమీటరు ఎత్తువరకు నింపాలి. పైన పేడ మట్టితో అలకాలి. 3-4 నెలల్లో వ్యర్థాలు చివికి కంపోస్టు తయారవుతుంది. పట్టణ వ్యర్థాలతోనూ కంపోస్టు చేయవచ్చు. గ్రామీణ కంపోస్టులో కన్నా పట్టణ కంపోస్టులో అధిక పోషకాలుంటాయి.
బయోగ్యాస్
చిక్కగా తయారుచేసిన పేడ ద్రావణాన్ని కొన్ని రోజులపాటు ట్యాంకుల్లో గాలి తగులకుండా మురగబెట్టి నప్పుడు సూక్ష్మజీవుల చర్య ఫలితంగా వెలువడే ఇంధన వాయువును బయోగ్యాస్ (గోబర్ గ్యాస్) అంటారు. దీనిలో 50-60 శాతం మీథేన్ 30-40 శాతం, బొగ్గుపులుసు వాయువు, 10 శాతం హైడ్రోజన్ ఉంటాయి. ఇంధనంగా వాడుకోగా మిగిలిపోయిన పేడ సారవంతమైన సేంద్రియ ఎరువుగా తోడ్పడుతుంది.
పశువుల పేడ ఎరువు
పశువుల సంఖ్యను బట్టి కొట్టాల వద్ద అవసరమైనంత పొడవు, వెడల్పుతో 3 అడుగుల లోతు గుంతను తవ్వుకోవాలి. పశువుల పేడ, మూత్రంతో తడిసిన చెత్త, పశువులు తినగా మిగిలిన గడ్డిని గోతిలో 6 అంగుళాల ఎత్తు వరకు నింపి దాని పైన నీటిని చిలకరించి, 2-3 కి. సూపర్ఫాస్పేట్ వేసి మట్టితోగాని, బురదతోగాని కప్పాలి. ఇలాగే భూమట్టానికి 1-1.5 అడుగుల ఎత్తువరకు గోతినంతా నింపుతూ మట్టితో/ బురదతో కప్పాలి. 3-4 నెలల్లో బాగా కుళ్లి నేలలో వేయటానికి తయారవుతుంది.
జీవాల ఎరువు
పశువుల ఎరువు మాదిరి మేకలు/గొర్రెల దొడ్లో వచ్చే ఎరువును భద్రపరిచి వాడుకోవచ్చు. ఎండాకాలంలో రాత్రిపూట వీటిని నేరుగా పొలాల్లో మంద కట్టడంవల్ల వీటి మల, మూత్రాలు నేరుగా పొలంలో పడి మంచి ఎరువుగా ఉపయోగపడుతాయి.
కోళ్ల ఎరువు
40 కోళ్ల నుంచి ఒక సంవత్సరంలో టన్ను ఎరువు తయారవుతుంది. కేజెస్ కన్నా డీప్లిట్టర్ ఎరువులో పోషకాలు ఎక్కువ. కేజెస్ ఎరువులో తేమ తగ్గేకొద్దీ పోషక శాతం పెరుగుతుంది. షెడ్ నుంచి తీసిన తర్వాత టన్ను కోడి ఎరువుకు 5-10 కి. సూపర్ ఫాస్పేట్ కలిపి కొన్నిరోజుల పాటు గొయ్యిలో/ కుప్పలుగా పోసి వాడటంవల్ల పోషకాలు పెరుగుతాయి. ఎకరాకు సాధారణ పంటలన్నింటికి 2 టన్నులు, చెరకుకు 3 టన్నుల చొప్పున కోళ్ళ ఎరువు వేయవచ్చు. నీటి వసతిగల పొలాల్లో ఈ ఎరువు బాగా పనిచేస్తుంది. దీనిలో సూక్ష్మపోషకాలు కూడా ఉంటాయి.
పచ్చిరొట్ట ఎరువులు
జీలుగ, జనుము, అలసంద, పిల్లి పెసర, పెసర, మినుము, అవిసె వగైరా పచ్చిరొట్ట పైర్లను పెంచి పూత దశలో నేలలో కలియదున్నాలి. ఇవి నేలలో సేంద్రియ పదార్థాన్ని చేరుస్తాయి. వేర్ల బుడిపెల్లోని సూక్ష్మజీవులు నత్రజనిని అందిస్తాయి. ఎకరానికి జనుము 20-25 కిలోలు, జీలుగ 12-15 కిలోలు, పిల్లి పెసర 5-6 కిలోలు, అలసంద 14-15 కిలోలు, పెసర, మినుము 6-7 కిలోలు. విత్తనం వాడాలి.