సాగు సులభం.. ఆదాయం అధికం!
వాణిజ్యపరంగా సాగుచేసే పూలలో ‘బంతి’ ముఖ్యమైనది. పండుగలు, శుభకార్యాల సమయంలో వీటికి మంచి గిరాకీ ఉంటుంది. బంతిపూల పంటకాలం 120రోజులు కాగా, నాటిన 55 రోజుల నుంచే దిగుబడి మొదలవుతుంది. అంతేకాకుండా, వీటిని ఏడాది పొడవునా సాగుచేసే అవకాశం ఉన్నది. అందుకే.. ఏయేటి కాయేడు ‘బంతి’ సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ ఆదాయాన్ని అందిస్తున్నది. రైతన్న ఇంటికి లాభాల పూలబాట వేస్తున్నది.
బంతిపూలను ఏడాది మొత్తం సాగు చేసుకోవచ్చు. అయితే, వర్షాలు, ఎండలు లేని సమయంలో దిగుబడి వచ్చేలా చూసుకోవాలి. భారీ వర్షాలు, వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల పూల నాణ్యత దెబ్బతినే అవకాశం ఉన్నది. ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, జూలై మొదటి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు మొక్కలు నాటుకోవాలి. దీంతో, అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు మంచి దిగుబడులు వస్తాయి.
అనుకూల నేలలు
ఇసుక నేలలు, నీరు త్వరగా ఇంకిపోయే నేలల్లో బంతిని సాగు చేయవచ్చు. సారవంతమైన గరప నేలలు బంతికి అత్యంత అనుకూలంగా ఉంటాయి. అయితే, ఉదజని సూచిక 7.0 – 7.5 మధ్య ఉండే నేలలనే ఎంచుకోవాలి. సాగుచేసే ప్రదేశంలో నీడ ఉండకుండా చూసుకోవాలి.
రకాలు
ఆఫ్రికన్ బంతి : ఈరకం మొక్కలు ఎత్తుగా, దృఢంగా పెరుగుతాయి. పూలు ఒంటి రెక్క, ముద్దగా పూస్తాయి. నిమ్మ పసుపు, పసుపుతోపాటు బంగారు, నారింజ రంగు వరకూ అనేక వర్ణాల్లో ఉంటాయి.
ఫ్రెంచ్ మేరీగోల్డ్ : ఈమొక్కలు పొట్టిగా, గుబురుగా పెరుగుతాయి. ఇందులోనూ ఒంటి రెక్క, ముద్ద పూలు పూస్తాయి. పసుపు, నారింజ, ఎరుపు, గోధుమ, బంగారు పసుపుతోపాటు వివిధ రంగులు మిళితమై కూడా ఉంటాయి. వ్యాపారపరంగా ఫ్రెంచ్ మేరీగోల్డ్ రకాలకు డిమాండ్ ఎక్కువ. వీటితోపాటు పూసా, నారింగ గేందా, పూసా బసంతి గేందా, యండీయూ-1 రకాలు కూడా సాగు చేస్తారు.
నారు పెంపకం..
ఎకరానికి సరిపడా నారు పెంచడానికి 800 గ్రా. నుంచి కిలో విత్తనాలు అవసరం అవుతాయి. నారు కోసం ఎత్తుమడులు తయారు చేసుకోవాలి. ఈ మడుల్లో 8 నుంచి 10కిలోల బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి. విత్తనాలు వేయడానికి ముందే ఫాలిడాల్ పొడి చల్లుకొంటే.. చీమలు, చెదల బాధ తప్పుతుంది. 5 నుంచి 7 రోజుల్లో మొలకలు వస్తాయి.\
కత్తిరింపులు
కొన్ని బంతి రకాలను కాండపు మొక్కలను నాటి ప్రవర్ధనం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఈ రకాల్లో విత్తనం ఏర్పడదు. ఇందుకోసం కొమ్మల చివర ఒకటి లేక రెండు జతల ఆకులు గల మృదువైన 10 సెం.మీ. పొడవుగల భాగాన్ని కత్తిరించి, తేమ ఉండే ఇసుకలో (కుండీ లేక మడుల్లో) నాటాలి. అంతకుముందే కత్తిరింపుల మొదటి భాగాన్ని సెరాడిక్ బీ లేదా రూటెక్స్ హార్మోన్ పొడిలో ముంచాలి. దీనివల్ల వేళ్లు బాగా వస్తాయి. నాటిన వెంటనే కుండలను నీడలోకి మార్చాలి. ఒకవేళ మడిలో నాటితే, మొక్కలకు నీడ కల్పించాలి. ఇసుకలో చెమ్మ ఆరిపోకుండా క్రమం తప్పకుండా నీరు అందించాలి.
నాటే విధానం
3-4 ఆకులు ఉండి, నెల వయసు ఉన్న మొక్కలే ప్రధాన పొలంలో నాటడానికి అనుకూలం. నారును సాయంకాలం పూట నాటుకుంటే బాగా పాతుకుంటాయి. ఆఫ్రికన్ బంతి మొక్కలను 40X30 సెం.మీ దూరంలోనూ, కత్తిరింపులను 30X20 సెం.మీ. దూరంలోనూ నాటుకోవాలి. ఫ్రెంచ్ బంతి మొక్కలైతే 20X20 సెం.మీ. దూరంలో, కత్తిరింపులను 20X20 సెం.మీ. దూరంలో నాటితే పూల దిగుబడి బాగుంటుంది. నాటిన వెంటనే నీటి తడులు ఇవ్వాలి. వాతావరణ పరిస్థితుల ఆధారంగా 3 -4 రోజులకు ఒక సారి నీటి తడి అందించాలి. నాటిన 20 రోజులకు మొగ్గలు వస్తాయి. మొదట వచ్చిన మొగ్గలను తుంచాలి.
ఎరువులు
ప్రధాన చేనులో చివరి దుక్కిలో ఎకరానికి 20 టన్నుల చొప్పున బాగా చివికిన పశువుల ఎరువు వేసి కలియ దున్నాలి. దీంతోబాటు 20-40 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 80 కిలోల పొటాష్ను ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. నారు నాటిన 37 రోజులకు నత్రజని 20-40 కిలోలు పైపాటుగా వేసి నీరు పెట్టాలి.
నీటి యాజమాన్యం
మొక్క కొమ్మల పెరుగుదల సమయంతోపాటు పూత దశలోనూ నేలలో తగినంత తేమ ఉండేలా చూడాలి. ఏ దశలోనైనా మొక్కలు నీటి ఎద్దడికి గురైతే, మొక్క పెరుగుదల, పూల దిగుబడి తగ్గుతుంది.
పించింగ్
ఆఫ్రికన్ బంతి రకాల్లో నిటారుగా పెరుగుతున్న మొక్క కాండపు చివరి భాగాన్ని ముందుగానే గిల్లివేయాలి. దీనివల్ల పక్క కొమ్మలు తొందరగా ఏర్పడతాయి. ఈ కొమ్మలపై పూలు పూసి, దిగుబడి పెరుగుతుంది. నాటిన 40వరోజు పించింగ్ చేస్తే, పూల దిగుబడి ఎక్కువ అవుతుంది. మామూలుగా గుబురుగా పెరిగే రకాలకు పించింగ్ అవసరం ఉండదు.
చీడపీడలు
బంతికి పొగాకు లద్దెపురుగు, శనగ పచ్చపురుగు, నులిపురుగు, నల్లి, తామర పురుగు, పేనుబంక ఆశిస్తాయి. వీటికి తోడు మొగ్గకుళ్లు, వేరుకుళ్లు తెగుళ్లు సోకుతాయి. కాబట్టి, సకాలంలో వీటి ఉనికిని గమనించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. లద్దెపురుగు, శనగ పచ్చపురుగు నివారణకు లీటర్ నీటిలో 1.5 గ్రా. ఎసిఫేట్ లేదా 1500 పీపీఎం 5 మి.లీ వేపనూనె మందును కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటర్ నీటిలో 0.4 గ్రా. ఇమామెక్టిమ్ బెంజోయేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. పేనుబంక కనిపిస్తే.. లీటర్ నీటిలో 2 మి.లీ. డూమిథోయేట్ కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగు నివారణకు లీటర్ నీటిలో 1.6 మి.లీ. మోనోక్రోటోపాస్ లేదా 2 మి.లీ. ఫిప్రోనిల్ కలిపి పిచికారీ చేయాలి. పంట మార్పిడి ద్వారా నులిపురుగులను నివారించవచ్చు. ఇక మొగ్గకుళ్లు, వేరుకుళ్లు నివారణకు లీటర్ నీటిలో 2.5 గ్రా. మ్యాంకోజెబ్ లేదా 1 గ్రా. కార్బెండిజమ్ కలిపి పిచికారీ చేయాలి.
దిగుబడి
సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే.. ఏ రకాలైనా ఎకరానికి 4-5 టన్నుల దాకా దిగుబడి ఉంటుంది. బాగా విచ్చుకున్న బంతి పూలనే కోయాలి. ఉదయం కానీ, సాయంత్రం కానీ కోస్తే మంచిది. కోతకు ముందు నీటి తడి ఇస్తే.. పూల నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. కోత తరువాత కూడా పూలు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి. సకాలంలో పూల కోత చేస్తుంటే.. దిగుబడి పెరుగుతుంది.
100 క్వింటాళ్లు సాధ్యమే!
మన దేశంలో ఏ పండుగైనా, శుభకార్యమైనా బంతిపూలు ఉండాల్సిందే! అందుకే, వీటి సాగుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. అయితే, చాలామంది రైతులు ఎకరానికి 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడిని మాత్రమే తీస్తున్నారు. కానీ, మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరానికి 50 నుంచి 100 క్వింటాళ్ల దాకా దిగుబడి
సాధించవచ్చు.
– సరిత, సంగారెడ్డి జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త
…? మజ్జిగపు శ్రీనివాస్రెడ్డి