నిమ్మగడ్డి ఆకుల నుంచి సుగంధ తైలం లభిస్తుంది. ఈ మొక్క బహువార్షిక గడ్డి జాతికి చెందిన మొక్క. సుమారు 3-4 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీని తైలాన్ని పరిమళాల పరిశ్రమలు, కృత్రిమ విటమిన్ ఏ తయారీకి ఉపయోగిస్తారు. నిమ్మగడ్డి తైలంలో సిట్రాల్ అనే రసాయనం ఉంటుంది. నిమ్మగడ్డి ఆకులను సువాసన కోసం హెర్బల్ తేనీటి పానీయాలలో, వంటలలో వాడుతారు. మొక్కలు దట్టంగా పెరిగి భూమి కోతను నివారించటానికి కూడా ఉపయోగపడుతాయి. నిమ్మగడ్డి సాగు చేపట్టి ఎలా లాభాలు ఆర్జించాలో తెలుసుకుందాం.
నిమ్మగడ్డి ఉష్ణ మండలంలో పెరిగి మొక్క. తేమతో కూడి న వేడి, సూర్యరశ్మి ఉన్న ప్రదేశంలో బాగా పెరుగుతుంది. వర్షపాతం వార్షికంగా 200-250 సెం.మీ. ఉండాలి. వర్షపాతం తక్కువ గల ప్రాంతాలలో నీటి తడులతో సాగు చేయడానికి అనుకూలం. రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో నీటి వసతి కింద సాగు చేయవచ్చు. ఎత్తైన కొండ ప్రాంతాల లో, సంవత్సరం పొడవునా వర్షపాతం ఉన్న ప్రాంతాలలో వర్షాధారంగా కూడా సాగు చేయవచ్చు. నిమ్మగడ్డిని వివిధ రకాల నేలల్లో సాగు చేయవచ్చు. బలమైన ఎర్రగరపు నేల ల నుంచి బలహీనమైన ఇసుక నేలల్లోనూ సాగు చేయవచ్చు. నీళ్లు ఎక్కువ కాలం నిలిచి ఉంటే తట్టుకోలేదు. క్షార భూములలో కూడా నిమ్మగడ్డి పెరుగుతుంది.
నేల తయారీ, నాటుట
నిమ్మగడ్డి ఒకసారి నాటిన తరువాత 4-5 సంవత్సరాలు భూమిలో ఉంటుంది. కాబట్టి భూమిని బాగా లోతుగా పలుమార్లు ఇరువైపుల దున్ని బాగా తయారుచేసుకోవాలి. నిమ్మగడ్డి పెంచాలని ఇప్పటికే నిర్ణయించుకున్న వాళ్లు ముందస్తుగా నాణ్యమైన పిలకలను ఎంపిక చేసుకోవాలి. డిసెంబర్ చివరి నాటికి విత్తుకోవడానికి సిద్ధం చేసుకోవా లి. భూమిని బాగా తయారుచేసిన తరువాత పొడవు వెడల్చుతో మడులను చేసుకొని నాటుకోవాలి. బోదెలు తయారుచేసుకొని బోదెలపై నాటు పద్ధతిని కూడా అవలంబించవచ్చు. వానకాలంలో అధిక వానలు ఉన్నప్పుడు మురుగు నీరు పోయే ఏర్పా చేయాలి. పిలకలు భూమిలో నాటగానే మొక్కలు పడిపోకుండా మొక్కల మొదళ్ళలో మట్టిని ఎగదోసి గట్టిగా నొక్కాలి. బాగా ఎదిగిన ఆరోగ్యవంతమైన తోటల నుంచి పిలకలను సేకరించాలి. బాగా ఎదిగిన మొక్కల నుంచి 100-150 పిలకలు లభిస్తాయి. ఒక ఎకరా పొలంలో నాటడానికి 15000 పిలకలు అవసరం. నాటే సమయంలో భూమిలో పదును ఉండాలి. నాటిన తరువాత తక్కువ మోతాదులో నీటి తడి ఇవ్వాలి.
రకాలు
ప్రస్తుతం మన రాష్ట్ర వాతావరణానికి అను కూలంగా ఉన్న రకాలు క్రిష్ణ, కావేరి, సుగంధి, ప్రగతి.
ఎరువుల యాజమాన్యం
తక్కువ సారవంతమైన భూములలో సేంద్రియ ఎరువుల ను విరివిగా వాడాలి. దీనివల్ల ఉపయోగకరంగా ఉంటుం ది. ఆఖరిదుక్కిలో నాలుగు టన్నుల పశువుల ఎరువు, 40 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్పేట్, 40 కిలోల యూరియాను రెండు దఫాలుగా వేసుకోవాలి. మొదటి కోత కోసిన వెంటనే, ఆ తరువాత 30-45 రోజు ల తరువాత భూమి సారాన్ని బట్టి ఎరువుల మోతాదు మార్చవచ్చు. సూక్ష్మపోషకాల ప్రభావం గడ్డి దిగుబడి సుగంధ తైలము దిగుబడిపై ఉన్నట్లుగా పరిశోధనలలో తేలింది.
నీటి యాజమాన్యం
పిలకలు నాటిన వెంటనే నీరు కట్టాలి. తరువాత రెండు నుంచి మూడు రోజులకొకసారి క్రమం తప్పకుండా నెల రోజుల వరకు నీరు కట్టాలి. నిలదొక్కుకొని పెరుగటం ప్రారంభమవుతుంది. ఆ తరువాత వాతావరణం, నేల స్వభావాన్ని బట్టి 10-15 రోజుల వ్యవధిలో నీటి తడులు ఇవ్వాలి. వానకాలంలో నీరు అంతగా అవసరం ఉండదు.
అంతర కృషి , అంతర పంటలు
నాటిన మొదటి 25-30 రోజుల వరకు కలుపు నిమ్మగడ్డి తో పోటీ పడుతుంది. కాబట్టి కలుపు రాగానే వెంటనే తీసి వేయాలి. మొదటి 3-4 నెలలు కలుపు నివారణ చర్యలు వెంటవెంటనే చేపట్టాలి. మొక్కలు నిలదొక్కుకున్న దశలో అంతరకృషి చేపట్టాలి. చలికాల ప్రారంభంలో వచ్చే పూల కంకులను తీసివేయాలి. లేకపోతే నిమ్మగడ్డి దిగుబడి తగ్గిపోతుంది. నాటిన 10-15 రోజుల తరువాత వరుసల మధ్య ఉలువలు లేదా పప్పుజాతి పంటను విత్తుకుంటూ కలుపును చాలావరకు నివారించవచ్చు. వానకాలంలో నీరు నిలువకుండా చూసుకోవాలి.
సస్యరక్షణ
రాష్ట్రంలో నిమ్మగడ్డికి సాధారణంగా పురుగులు, తెగుళ్ళ బాధలేదు. కాబట్టి సస్యరక్షణ చేపట్టాల్సిన అవసరం లేదు. మురుగు నీటి సౌలతిలేని చోట వేరు కుళ్ళు తెగులు సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి.
పంటకోత
మొదటి పంట నాటిన తరువాత 5-6 మాసాల తరువాత కోతకు వస్తుంది. తదుపరి ప్రతి రెండున్నర-మూడు నెలల వ్యవధిలో కోతకు వస్తుంది. కోతల సంఖ్య భూమి సారా న్ని బట్టి, నీటి లభ్యత యాజమాన్య పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వర్షాధారంగా మూడు కోతలు, నీటి పారుదల యాజమాన్యం బాగా ఉంటే 4-6 కోతలు కూడా తీసుకునే అవకాశం ఉన్నది. ఒకసారి నాటిన పైరు నుంచి 4-5 సంవత్సరాల వరకు పంట తీసుకోవచ్చు. మొక్కలను నేల నుంచి 10-15 సెం.మీ. వదిలి కోయాలి. పంటను కోసిన ప్రతిసారి ఎండు ఆకుల ను తీసివేయాలి. దీనివల్ల దుబ్బులు బాగా చిగురించి పెరుగుదల సంతృప్తికరంగా ఉంటుంది. సుగంధ తైలము దిగుబడి రెండో సంవత్సరము నుంచి క్రమంగా పెరుగుతుం ది. మూడవ, నాలుగో సంవత్సరములో అధిక దిగుబడి ఉంటుంది. తర్వాత క్రమంగా తగ్గుతుంది. సుగంధ తైలములో ‘సిట్రాల్’ అనే ముఖ్యమైన పదార్థం కూడ మొక్క వయసుతో పెరుగుతుంది. సంవత్సరానికి 10-12 టన్నుల గడ్డి లభిస్తుంది. గడ్డిలో నూనె శాతం 0.5శాతం నుంచి 1.0 శాతం వరకు ఉంటుంది. ఎకరాకు రకాన్ని బట్టి యాజమాన్య పద్ధతులను బట్టి 60-90 కిలోల నూనె లభిస్తుంది. వర్షాధారంగా ఎకరాకు 40-45 కిలోల నూనె లభిస్తుంది.
తైలం తీసే పద్ధతి
నిమ్మగడ్డి ఆకుల నుంచి స్వేదన ప్రక్రియ (స్టీవ్ డిస్టిలేషన్ పద్ధతి) ద్వారా నూనెను తీస్తారు. గడ్డిని కోయగానే లేదా కొద్దిగా గడ్డి వాడిపోయే వరకు ఉంచి గాని నూనె తీయ డానికి ఉపయోగించవచ్చు. కోసిన తరువాత 48 గంటలు నీడలో ఆరబెట్టినప్పుడు ఎక్కువ తైలం వచ్చినట్లు పరిశోధనలో వెల్లడైంది. ఆకులను చిన్న ముక్కలుగా చేసినచో తైలం దిగుబడి అధికమైనట్లు తెలిసింది. ఈ నూనె తీసే యంత్రం డిస్టిలేషన్ ట్యాంక్, స్టీవ్ బాయిలర్, కండెన్సర్, సపరేటర్ అనే భాగాలను కలిగి ఉంటుం ది. కోసిన ఆకులను డిస్టిలేషన్ ట్యాంక్లోకి నింపి మూత మూసి నీటి ఆవిరిని ఒత్తిడితో పంపాలి. నూనె ఆవిరి, నీటి ఆవిరి కండెన్సర్లో ద్రవ రూపం చెంది సెపరేటర్లోకి చేరుతాయి. నీటిపై తేలియాడే నూనె సెపరేటర్ లో వేరు కాబడి అటు తరువాత దానిలో నీటి బిందువులు లేకుం డా ఫిల్టర్ చేసి రంగు గాజు లేక అల్యూమినియం పాత్రల్లో భద్రపరుచాలి.