రోగాలను కలిగించే సూక్ష్మజీవులు పట్టుపురుగుల పెంపకపు గది లోపల, బయట, పురుగులను పెంచే పరికరాలపై ఉండి పట్టు పురుగులను పెంచేటప్పుడు వాటికి రోగాలను కలిగిస్తాయి. రోగాలను కలిగించే సూక్ష్మజీవులను నాశనం చేయడాన్నే రోగ నిరోధక చర్య అంటారు. పట్టుపురుగులను పెంచడానికి ముందు, తర్వాత పెంపకపు గదిలోపల, బయట, పెంపకపు పరికరాలను రోగ నిరోధక చర్య చేయడం వల్ల పంట నష్టాన్ని అరికట్టి, నాణ్యమైన అధిక పట్టుగూళ్ల దిగుబడిని సాధించవచ్చు.
పట్టుగుడ్లను పెట్టించినప్పడి నుంచి అవి పెరిగే వరకు వాటిలోని పిండాలన్ని ఆరోగ్యంగా, సమానంగా ఎదగడానికి, తద్వారా ఎక్కువ పగులు శాతాన్ని సాధించడానికి గుడ్లకు అవసరమైన వాతావరణ పరిస్థితులు కల్పించాలి. కానీ ఎక్కువ వానలు పడటం వల్ల, గాలిలో తేమ శాతం ఎక్కువై సూక్ష్మజీవులు పెరిగి, పట్టు పురుగులపై వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా పట్టుగుడ్లను పొదగబెట్టే సమయంలో 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 80 శాతం తేమ, రోజుకు 16 గంటల వెలుతురు, 8 గంటల చీకటి గల వాతావరణ పరిస్థితులు అవసరం. అందువల్ల పెంపకపుగది, పరికరాలు శుభ్రంగా, సంపూర్ణంగా రోగ నిరోధక చర్య చేపట్టడం వల్ల, పట్టుపురుగులపై వచ్చే వ్యాధులను సమూలంగా నివారించవచ్చు.
కింది విధంగా రోగ నిరోధక చర్యను చేపట్టాలి.
1) పంట పూర్తయిన తర్వాత చేయాల్సిన పని వివరాలు
-పట్టుగూళ్ల విడిపించడానికి ముందే చంద్రికల నుంచి రోగం సోకిన చనిపోయిన, పురుగులను, నాసిరకం గూళ్లను ఏరి కాల్చివేయాలి.
-గూళ్లను విడిపించిన తర్వాత చంద్రికలను అంటుకున్న పట్టుపోగులను చీపురుతో తీసివేసి ఆ తర్వాత చంద్రికలను బర్నర్తో కాల్చాలి.
-పట్టుగూళ్లను అమ్మిన వెంటనే పెంపకపు గదిని శుభ్రపరుచగా వచ్చే చెత్తపై 1:19 నిష్పత్తిలో బ్లీచింగ్ పొడి, కాల్చిన సున్నంపొడి మిశ్రమాన్ని చల్లి పూడ్చిపెట్టాలి.
-పంట పూర్తయిన తర్వాత మొదటిసారి 100 లీ టర్ల నీటికి 2 కిలోల బ్లీచింగ్ పొడి, 300 గ్రాము ల కాల్చిన సున్నపు పొడి మిశ్రమాన్ని రోగనిరోధక చర్యగా పెంపకపు గదిని శుభ్రపరుచాలి.
2) తరువాత పంటకు చాకీ కట్టడానికి ముందు
-పట్టుపురుగుల పెంపకపు గదిలో, పరికరాలపై గల దుమ్ము, ధూళి పోయేటట్లు నీటితో శుభ్రపరుచాలి. ఎండలో ఆరబెట్టాలి.
3) చాకీ పురుగుల దశలో
-ముందు పంట పాలుకారు రోగం లేదా ఫ్లాచరీ రోగాల వల్ల ఎక్కువగా దెబ్బతిని ఉంటే 100 లీటర్ల నీటికి 300 గ్రాముల కాల్చిన సున్నపుపొడి చొప్పున కలిపిన ద్రావణంతో అదనంగా రోగనిరోధక చర్య చేయాలి. గది కిటికీలను గాలి ప్రసరణ కోసం తెరిచి ఉంచాలి.
4) పెద్దపట్టు పురుగుల దశలో
-రెండవసారి రేరింగ్ గదిని 97.5 లీటర్ల నీటికి 2.5 లీటర్ల శాంటిక్ ద్రావణం, 5 ప్యాకెట్లు ఉత్తేజకారిని స్పటికాలు, అరకిలో కాల్చిన సున్నపుపొడి చొప్పున కలిపి తయారుచేసిన మిశ్రమ ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
-రేరింగ్ షెడ్కు నడిచివెళ్లే దారి వెంట, గది చుట్టూ 1:19 నిష్పత్తిలో కలిపిన బ్లీచింగ్ పొడి, కాల్చిన సున్నపు పొడి మిశ్రమాన్ని చల్లాలి.
పురుగులను పెంచే సమయంలో రోగనిరోధక చర్య, స్వచ్ఛతను పాటించడం
పురుగులను పెంచే సమయంలో శుభ్రతను పాటించడం వల్ల ద్వితీయ రోగ సంక్రమణ, రోగవ్యాప్తిని అరికట్టవచ్చు.
1) పురుగుల పెంపక గదిలోకి ఎక్కువమందిని వెళ్లనివ్వరాదు.
2) రేరింగ్ గదిలో ప్రతిసారి ఒకటి కంటే ఎక్కువ పట్టుపురుగుల పంటలను పెంచరాదు.
3) పురుగులను పెంచే పరికరాలను ఇతరుల నుంచి తీసుకోరాదు.
4) పురుగులను పెంచేటప్పుడు, గూళ్లను అల్లేటప్పుడు పురుగులకు గాయాలు కాకుండా జాగ్రత్తపడాలి.
5. రోగం వచ్చిన పురుగులను నేలపైగాని లేదా ఎక్కడపడితే అక్కడ పారవేయరాదు.
చేతులను శుభ్రం చేసుకోవడం
పట్టుపురుగులు పెంచే గదిలోకి వెళ్లే ముందు చేతులను సబ్బుతో కడుక్కోవాలి. ప్రవేశద్వారం దగ్గర బేసిన్లో గల 2.5 శాతం క్లోరిన్ గల 0.5 శాతం సున్నపుపొడి ద్రావణంలో గాని లేదా 2 శాతం బ్లీచింగ్ పొడిగల 0.3 శాతం సున్నంపొడి ద్రావణంలో గాని లేదా 2 శాతం ఫార్మాలిన్తో గాని చేతులను శుభ్రం చేసుకున్న తర్వాత పురుగుల పెంపకపు కార్యక్రమాల్లో పాల్గొనాలి. గది నుంచి బయటకు వెళ్లేటప్పుడు కూడా చేతులను మరోసారి కడుక్కోవాలి.
-ప్రవేశద్వారం దగ్గర 5 శాతం బ్లీచింగ్ పొడిగల సున్నపుపొడి చల్లిన గోనె సంచిపై పాదాలను తు డుచుకున్న తర్వాతనే రేరింగ్ గదిలోకి వెళ్లాలి.
-పట్టు గుడ్లు నీలిచుక్క దశకు తిరగకముందే ఉపరితలాన్ని 2 శాతం ఫార్మాలిన్ ద్రావణంలో 10 నిమిషాలు ముంచి తర్వాత మంచినీటితో కడిగి, నీడలో ఆరబెట్టి, పొదగడం చేయాలి.
-జ్వరానికి పోయే ముందు సున్నపు పొడిని, జ్వ రం నుంచి లేచిన తరువాత విజేత పొడిని పు రుగులపైనా, పడకలపైన సమానంగా చల్లాలి.
-రోగం బారిన పడిన పురుగులను నేలపై పడనీయరాదు. వీటిని పెంపుడు జంతువులకు ఆహారంగా వేయరాదు. పడకలను శుభ్రపరిచే ముందు, రోగం బారిన పడిన పురుగులను వీటి శరీరాలు చిట్లకుండా చిన్న కర్ర ముక్కలతో (చాప్స్టిక్స్) వేరు చేసి నాశనం లేదా కాల్చివేయాలి.
-రోగగ్రస్థ పురుగులను 5 శాతం బ్లీచింగ్ పొడి గల సున్నపు పొడి మిశ్రమం గల బేసిన్లోకి వేసిన తర్వాత వాటిని పూడ్చి పెట్టడం లేదా కాల్చివేయాలి. వెంటనే చేతులు కడుక్కోవాలి.
-బెడ్ క్లీనింగ్ చేయగా వచ్చే చెత్తను వెడల్పాటి నైల్ షీట్లోకి సేకరించి, ఎరువు దిబ్బలో వేసిన తరువాత దానిపై 5 శాతం బ్లీచింగ్ పొడిగల సున్నపు పొడిని చల్లాలి. తరువాత మట్టితో కప్పి కుళ్లింపజేయాలి.
-రేరింగ్ గది, గూళ్లు అల్లించు గదుల చుట్టు పరిశుభ్రత పాటించాలి. రేరింగ్ గదికి నడిచివెళ్లు దారి వెంబడి, గది చుట్టూ 5 శాతం బ్లిచింగ్ పొడి గల సున్నపు పొడిని ప్రతి 2-3 రోజులకోసారి చల్లుకోవాలి.
ఈవిధంగా పట్టు రైతు సోదరులు పైన చెప్పిన విధంగా వానకాలంలో రోగనిరోధక చర్యలు చేపట్టాలి. దీనివల్ల పట్టుపురుగులకు వచ్చే వ్యాధుల బారి నుంచి రక్షించడమే కాకుండా నాణ్యత కలిగిన పట్టుగూళ్ల సంఖ్య పెరిగి, మార్కెట్లో మంచి ధర పలుకుతుంది.