పండించాలి అంటున్నారు రైతు పాపారావు. స్టెల్లింగ్ పద్ధతిలో టమాట సాగు చేస్తూ లాభాలు పొందుతున్న ఆయన ఇతర పంటలే రైతుకు లాభదాయకమని చెప్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): స్టెల్లింగ్.. పందిరికి పాకే పద్ధతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్కు చెందిన రైతు తాళ్లూరి పాపారావు ఈ పద్ధతితో 20 ఎకరాల్లో టమాట సాగుచేశారు. వ్యవసాయంపై మక్కువ, ఏదన్నా కొత్తగా చేయాలన్న తపనతో సాగులో వినూత్న పద్ధతులను వాడుతూ అధిక దిగుబడిని సాధిస్తున్న ఈయన.. షెడ్ నెట్లు ఏర్పాటు చేసి 600 ఎకరాలకు సరిపడా వివిధ రకాల పంటల నారును కూడా సిద్ధం చేస్తున్నారు.
రైతు షేడ్ నెట్లు ఏర్పాటు చేసి ఆరెకరాల్లో టమాట, మిర్చి, వంగ, బంతి, క్యాలిఫ్లవర్, క్యాబేజీ నారు పెంచుతున్నారు. సాధారణ పంటలు పండిస్తూనే నర్సరీని ఏర్పాటు చేశారు. నర్సరీ ఏర్పాటుకు రూ.16 లక్షలు ఖర్చు చేశారు. ఈ ఏడాది అన్ని రకాల నారు పెంచడానికి రూ. 20 లక్షల పెట్టుబడి పెట్టానని, సుమారు రూ.30 లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతు తెలిపారు. నర్సరీలో పెరిగిన ఒక్కో మొక్కను రూ.1 చొప్పున అమ్ముతానని చెప్పారు. ఎకరాలో పెంచిన నారు వంద ఎకరాలకు సరిపోతుందని, ప్రస్తుతం తాను పెంచుతున్న నారు 600 ఎకరాలకు సరిపోతుందని పేర్కొన్నారు.
భూమ్మీద పాకే టమాట మొక్కలను నాటిన ఈ రైతు.. అందుకు స్టెల్లింగ్ పద్ధతి సరైనదని భావించాడు. అందుకోసం పందిళ్లు వేయడానికే రూ.3 లక్షలు ఖర్చుచేశారు. పందిరి మూడేండ్ల వరకు ఉంటుంది. ఆరు నెలల కాలంలో ఎకరా టమాటా సాగుకు రూ.2.30 లక్షలు వెచ్చించారు. ఆ ఖర్చుకు తగ్గట్టే ఎకరాకు 60 టన్నుల చొప్పున 20 ఎకరాలకు 1,200 టన్నుల దిగుబడి సాధించే అవకాశం ఏర్పడిందని పాపారావు అంటున్నారు.