మన ఆరోగ్యానికి ప్రధానంగా కావాల్సిన ప్రొటీన్లు, ఏ అండ్ సీ విటమిన్లు, ఇనుము, కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజ లవణాలను అందించేవి ఆకుకూరలు. ఆహార సమతుల్యతలో వీటిది ప్రధాన పాత్ర. రోజుకు కనీసం 116 గ్రాముల ఆకుకూరలు తినాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇవి కోసిన వెంటనే త్వరగా చెడిపోయే గుణం ఉంటుంది. అందుకే ఇంట్లోని పెరట్లో పెంచుకుని తాజాగా వాడుకోవడం చాలా మంచిది. గింజలు విత్తిన నాలుగు నుంచి ఆరువారాల్లో త్వరగా ఎదిగి కోతకు వస్తాయి. వీటిని పెంచడం కూడా సులభమే.
తోటకూర
విత్తిన నెలలోపే కోతకు వస్తుంది. లేత ఆకులు కాండం కూడా నెలల తరబడి వాడుకోవచ్చు. ఏడాదంతా పెంచుకునే ఆకుకూర ఇది. పీచుపదార్థంతో పాటు లైసిన్తో కూడిన ప్రొటీన్ ఉంటుం ది. అందువల్ల పోషకలోపంతో బాధపడే వారికి ఇది మేలైన ఆహారం. వీటిని సంవత్సరమంతా విత్తుకోవచ్చు. ఈ పంట గింజలు తేలికగా ఉంటాయి. అందుకని వెదజల్లేటప్పుడు మెత్తని మట్టితో గాని, సన్నని ఇసుకతో గాని చల్లాలి. విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి. కాబట్టి 1-1.5 సెం.మీ. కంటే ఎక్కువ లోతులో విత్తొద్దు. మిగతా అన్ని కాయగూరల్తో పోలిస్తే అతి తక్కువ నీళ్లు తీసుకుంటుంది. 3-4 వారాల్లో కోతకు వస్తుంది.
కొత్తిమీర
విత్తనాన్ని పైపాటుగా కుండీల్లో మట్టిపై వెదజల్లా లి. మొక్కకు మొక్కకు 45 సెం.మీ దూరం ఉండే లా చూసి మిగతా వాటిని తీసివేయాలి. 60 సెం.మీ. ఎత్తు పెరుగుతాయి. 30-45 రోజుల్లో కోతకు వస్తుంది. ఎండ తగిలేలా కుండీలను ఉంచాలి. వర్మీ కంపోస్ట్తో మల్చింగ్ చేసి మట్టిలో తడి ఆరకుండా చూసుకోవాలి. తరుచుగా నీటితో తడపాలి. రోజూ కొన్ని మొక్కలు వాడుకునేందుకు వీలుగా ప్రతీవారం కొత్తగా కొన్ని గింజలు దఫాలుగా విత్తాలి.
మెంతికూర
నాటడానికి సరైన ప్రాంతం, అత్యధిక సూర్యరశ్మి అందేలా ఉండాలి. పోషకాలతో కూడిన బలమైన నేల ఉండి, మురుగునీరు పోయే సౌలభ్యం ఉండాలి. నేలల్లో 6-7 ఉదజని సూచిక ఉండాలి. వెచ్చని పొడి వాతావరణం ఉండాలి. చల్లని బురదనేలలు వీటి పెంపకానికి పనికిరావు. ఇవి పెంచే నేలలకు నత్రజని అంది అవి మరింత సారవంతం అవుతాయి.
పాలకూర
నాటిన మూడు రోజుల్లో మొలకెత్తుతుంది. నేల లో 2 సెం.మీ. లోతులో విత్తి, ఆపైన బురదతో పూయాలి. ఇవి కుండీలలో చల్లని ఉష్ణోగ్రత ఉంటే బాగా పెరుగుతాయి. నాటిన 4-5 వారా ల్లో ఆకులు తెంపుకోవచ్చు. ఒకసారి ఆకులు తెంపిన తర్వాత ద్రవరూప పోషకాలను అందిస్తే కోతకు సిద్ధంగా ఉంటాయి. భూమి పైనుంచి ఒక ఇంచు ఎత్తులో ముదురు ఆకులను కత్తిరించి వాడుకుంటే లోపలి ఆకులు ముదరడంతోపాటు కత్తిరించిన చోట కొత్త ఆకులు వస్తాయి.
గోంగూర
వేడి వాతావరణంలో పెరిగే మొక్క. మురుగు నీరు నిల్వకుండా ఉండే నేలల్లో పెంచాలి. విత్తనాలు నాటిన 7-9 వారాల్లో గోంగూర అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత నుంచి ఆకులను మాత్రమే తీస్తే 10 నుంచి 12 రోజుల వ్యవధిలో చిగురించి కొత్త ఆకులు వస్తాయి. పీచు పదార్థంతోపాటు పొటాషియం, మెగ్నీషియం కలిగి ఉండటం వల్ల బలాన్ని ఇచ్చే ఆకుకూరగా పరిగణిస్తారు. అయితే అధిక వాన, గాలిలో తేమ ఎక్కువగా ఉంటే శిలీంద్రాలు ఆశించి నాణ్యత దెబ్బతింటుంది. నీటి ఎద్దడిని కూడా తట్టుకుంటుంది. మొక్కకు మొక్క కు మధ్య దూరం 35-45 సెం.మీ. ఉండేలా చూసుకోవాలి. పన్నెండు వారాల వ్యవధిలో 5-6 సార్లు ఆకులు తెంపుకోవచ్చు. ఘన రూప ఎరు వుల కంటే ద్రవరూప ఎరువులకే ప్రాధాన్యం ఇవ్వాలి. వెంటనే ఫలితం కూడా కనిపిస్తుంది. మట్టి మిశ్రమంలో సేంద్రియ ఎరువులు వాడేట ప్పుడు పూర్తిగా చివికిన పశువుల ఎరువు, లేదా బాగా తయారైన వర్మీకంపోస్టు మాత్రమే వాడాలి. మిద్దెతోటలో తరుచుగా ఎదురయ్యే వేరుకుళ్లు, మొక్క వడల తెగులు నివారణకు రసాయనాలకు బదులుగా జీవ శిలీంద్ర నాశనలు వాడటం ఉత్తమం.
పూదీన
ఔషధ గుణాలు కలిగినది పూదీనను ఏడాదంతా ఇంట్లో పెంచుకోవచ్చు. ఉష్ణ వాతావరణంలో బాగా పెరుగుతుంది. దీనికి వాడే నేల మట్టి ఉదజని సూచిక 6-7.5 మధ్య ఉండాలి. తీగ మొక్కలను 45 సెం.మీ. దూరంలో ఉండేలా ఇంటి పెరట్లో నాటుకోవచ్చు. వాటిపై మట్టికప్పితే చిగుర్లు తొడిగి తీగలుగా సాగుతాయి. ప్రతి 3-4 రోజులకొకసారి తప్పనిసరిగా నీటితో తడపాలి. నాటిన 20 రోజుల నుంచి ఆకులు తెంపుకొని వాడుకోవచ్చు. ఆకులు తీసిన ప్రతీసారి ద్రవరూప ఎరువులను అందిస్తే మళ్లీ కాతకు వస్తాయి.
మట్టి, మొక్కల ఎంపిక
మిద్దెతోటల్లో కుండీలలో మొక్కల పెంపకం చేపడుతున్నారు. మట్టి ఒక మిశ్రమంగా లభించదు. కాబట్టి తొట్లలో వాడే మట్టి మిశ్రమం తయారీలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి.
– ఎర్రమట్టిని మాత్రమే వాడాలి. నల్లరేగడి మట్టి వాడకూడదు. వాడే మట్టిలో గాజు పెంకులు, పెద్ద పరిమాణంలో ఉండే రాళ్లు, పూర్తిగా చివికిపోని చెత్తా, చెదారం లేకుండా చూసుకోవాలి.
– ఎర్రమట్టిని మాత్రమే కాకుండా పెంచాలనుకునే మొక్కల పోషక అవసరాలను బట్టి వర్మీ కంపోస్టు, బాగా చివికిన పశువుల ఎరువు, వేప చెక్క, కొబ్బరిపీచును వాడాలి. ఏ మిశ్రమంలోనైనా 50 శాతానికి తగ్గకుండా ఎర్రమట్టి వాడాలి. వర్మీ కంపోస్టు లేదా పశువుల ఎరువు వాడితే సమగ్ర పోషకాలు మొక్కలకు అందుతాయి. కొబ్బరిపీచు తగినంతగా చేర్చితే నీటిని పట్టి ఉంచుతాయి. తర్వాత మొక్క తన అవసరం మేరకు వాడుకుంటుంది. అయితే వీటన్నింటినీ తొట్లు/కుండీలలో నింపే ముందే శుద్ధి చేస్తే శిలీంద్రాల సమస్య ఏర్పడదు. మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.
– మిరప, టమాటా, వంకాయ పంటలు పెంచుకునేటప్పుడు నులి పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మట్టి మిశ్రమంలో కచ్చితంగా వేప చెక్కను చేర్చాలి. ఈ పంటలను ఒకసారి పెంచిన తర్వాత ఆ మట్టిని కచ్చితంగా మార్చి వాడాలి. లేకపోతే అంతకుముందు ఆశించిన తెగు ళ్లు మళ్లీ ఆశించే అవకాశం ఉంటుంది.
– ప్రతి రెండుసార్లు మొక్కలు పెంచిన తర్వాత మట్టిని కచ్చితంగా మార్చాలి. లేదంటే అందులోని పోషకాలన్నీ పోయి, ఆ తర్వాత పెంచే మొక్కల్లో పోషకధాతు లోపాలు ఏర్పడుతాయి.
– ఆకులు, కాయలు, పండ్ల నాణ్యత బాగుండాలంటే పైపాటుగా సూక్ష్మధాతు పోషకాలను పిచికారీ చేయాలి.
– తొట్లలో అడుగుభాగం నుంచి మొదట ఒక పొరగా చిన్నసైజు గులకరాళ్లు పేర్చి ఆ తర్వాత ఎర్రమట్టితో కూడిన మిశ్రమాన్ని నింపాలి. మొక్క పెరిగేటప్పుడు పైపాటుగా ఉన్న మట్టిని కొద్దిగా కదిలిస్తే మొక్కలకు పోషకాలు అందుతాయి.
– తొట్టిలో 80 శాతం మేర మాత్రమే మట్టి మిశ్రమంతో నింపాలి. మిగతాభాగం ఖాళీగా ఉంచాలి. దీంతో ఎరువులు, వర్మీకంపోస్టు వేయడం, నీటిని అందించడం తేలిక అవుతుంది.