Timber teak | టేకు సిరులు కురిపించే పంట. కలపతో తయారు చేసిన వస్తువులు ఏవైనా పది కాలాల పాటు పదిలంగా ఉంటాయి. అలాంటి కలప లభ్యత తక్కువైంది. ఈ పరిస్థితుల్లో టేకు కర్రకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. టేకు వనాలు పూర్తిగా తగ్గి పోవడం ప్రత్యామ్నాయంగా ఇతర చెట్ల కలపని ఉపయోగించుకునే పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు వ్యవసాయంతో పాటు టేకు చెట్ల పెంపకంపై ఆసక్తి చూపితే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో సమతలంగా లేని నెలల్లో, బంజరు భూముల్లో కలప మొక్కలను పెంచి ఆదాయం పొందవచ్చు.
కలప రకాలు
మన దేశంలో అనేక రకాల కలప దొరుకుతుంది. కలప మొక్కలను పండించేందుకు కొన్ని రకాలు చాలా లాభదాయకం. వాటిలో ముఖ్యంగా నీలంబూర్ టేకు (మలబార్), సౌత్ అండ్ సెంట్రల్ అమెరికన్ టీక్, వెస్ట్ ఆఫ్రీకన్ టీక్, అదిలాబాద్ కలప, గోదావరి కలప, కొన్ని కలపను ఎంచుకోవాలి.
సాగుఇలా..
కలప మొక్కల సాగు చేపట్టాలంటే ముందుగా ఆ నేలల్లో ఉండే ముళ్ళపొదలను, అడవి మొక్కలను వేర్లతో సహా పెకలించి అనువుగా ఉన్న చోట్ల దున్నాలి. అలవిగాని ప్రాంతాలలో బుల్డోజర్ల సాయంతో నేలను సిద్ధం చేసుకోవాలి. మొక్కలు నాటడానికి ముందు నేల భౌతిక, రసాయనిక గుణాలను భూసార పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. నేల స్వభావం ఫలితాలను అనుసరించి చెరువు మట్టిని మొక్కలు నాటే గుంతల్లో కలపాలి. ఫలితంగా భూసారం పెరుగుతుంది.
ఎంపిక చేసుకున్న భూముల్లో వ్యవసాయ శాఖ నిపుణులు సూచించిన విధంగా గుంతలు తవ్వుకోవాలి. ఎకరాకు ఎన్ని గంటలు తీయాలన్నది పెంచే మొక్కను బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రతి గుంత దాదాపుగా ఎటుచూసినా 2 నుంచి 4 మీటర్ల దూరంలో ఉండాలి. పశువుల ఎరువుతో పాటు నల్ల మట్టి వేయాలి. వీలైతే వీటికి అరకిలో వేపపిండి 50 గ్రాములు మూడు శాతం లిండేన్ పొడి కలిపి గుంతల్ని నింపాలి. రుతువులను అనుసరించి మొక్కలను నాటాలి. మే నుండి జూన్ లో గుంతలు తీసుకొని జూన్ నుండి ఆగస్టు మాసాల మధ్యలో మొక్కలను నాటుకోవచ్చు. ఒక ఎకరానికి 1000 మొక్కలు నాటుకోవచ్చు. 20 ఏళ్లు పెంచితే 20 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉంది.
మొక్కలు నాటిన తరువాత 1-2 సంవత్సరాల పాటు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. నాటిన తరువాత వచ్చే మొదటి వేసవి కాలంలో 15 నుంచి 20 రోజులకు ఒకసారి 7 నుంచి 8 సార్లు అవసరాన్ని బట్టి మొక్కలకు నీరు అందించాలి. వర్షాకాలంలో వర్షం పడగానే ఒక్కో మొక్కకు 100 గ్రాముల చొప్పున డీఏపీని రెండు సార్లు అందించాలి. మొక్కల ఆకృతి బాగుండేలా అవసరం మేరకు కత్తిరింపులు చేపడితే చెట్లు నిటారుగా పెరిగే అవకాశం ఉంటుంది.
సస్యరక్షణ..
కలప మొక్కల్లో చీడపీడల సమస్య తక్కువగానే ఉంటుంది. వేరు పురుగు సమస్య ఉన్న నేలల్లో 2 చమీ కు 1 టీ స్పూన్ కార్బోప్యూరాన్ గుళికలు వేయడం ద్వారా వేరు పురుగును నివారించవచ్చు. ఆకుమచ్చ, తుప్పు తెగుళ్ళ మొక్కలకు ఆశించినట్లయితే లీటరు నీటికి 2.5 గ్రాముల మాంకోజెబ్ పిచికారీ చేయాలి. పొలంలో సరైన అంతరకృషి, కలుపు నివారణ చర్యలు ఎప్పటికప్పుడు చేపడితే నాణ్యతతో కూడిన కలపను పొందవచ్చు.