పంట మార్పిడి దిశగా రైతులు అడుగులు వేస్తుండటంతో ఈ రబీ సీజన్లో రాష్ట్రంలో వేరుశెనగ విస్తీర్ణం పెరిగింది. ఈ నేపథ్యంలో వేరుశెనగ పంటలో విత్తన తదుపరి చర్యలలో కలుపు నివారణ ప్రధానమైనది. ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం సరిగ్గా పాటించగలిగితే.. రబీలో వేరుశెనగ మంచి దిగుబడినిస్తుంది.
వేరుశెనగలో ఊద, తుంగ, గరిక, కాకి కాలు గడ్డి, కుక్కవామింట మొదలగు కలుపు మొక్కలు పంటను ఆశిస్తాయి. పంట విత్తిన 30-50 రోజుల వరకు కలుపు లేకుండా ఉంచితే అధిక దిగుబడులు సాధించవచ్చు. కలుపు మొలకెత్తక ముందే పెండిమిథాలిన్ 30 శాతం ఇ.సి. ఎకరాకు 750 మి.లీ. నుంచి ఒక లీటరు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. విత్తిన 45 రోజుల వరకు ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి.
ఎరువుల యాజమాన్యం భూసార పరీక్షను అనుసరించి ఎకరాకు 3-4 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువులు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ఎకరానికి 100 కిలోల సూపర్ ఫాస్పేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 18 కిలోల యూరియా విత్తే సమయంలో వేసుకోవాలి. విత్తిన 30 రోజుల తర్వాత తొలి పూత దశలో మరో 10-15 కిలోల యూరియా వేసుకోవాలి. ఎకరానికి 200 కిలోల జిప్సంను పూత దశ పూర్తయి ఊడలు దిగే సమయంలో మొదళ్ల దగ్గర వేసి మట్టిని ఎగదోయాలి. నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళను నివారించడానికి 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి అనే జీవ శిలీంధ్ర నాశినిని 100 కిలోల పశువుల ఎరువుతో కలిపి 10 రోజులు మాగబెట్టి ఆఖరి దుక్కిలో వేయాలి.
వేరుశెనగ పంటకు మొత్తం 450600 మి.మీ. నీరు అవసరం. తేలిక నేలల్లో 6-8 తడులు ఇవ్వాల్సి ఉంటుంది. విత్తేముందు నేల బాగా తడిగా ఉండేలా నీరు పెట్టుకోవాలి. రెండో తడి మొలకెత్తిన 20-25 రోజులకు ఇవ్వాలి. చివరి తడి పంటకోతకు 4-7 రోజుల ముందు ఇవ్వాలి. పైరులో ఊడలు దిగే దశ నుండి కాయలు ఊరే వరకు అంటే 45-50 రోజుల నుండి 85-90 రోజుల వరకు సున్నితమైన దశ కనుక ఈ దశలో నీరు సక్రమంగా తగు మోతాదులో ఇవ్వాలి. నీటి తుంపర్లు (స్ప్రింక్లర్లు) ద్వారా ఇచ్చినట్లయితే దాదాపు 25 శాతం నీరు ఆదా అయి అధిక దిగుబడి, నాణ్యమైన కాయలు తీసుకోవచ్చు.