వారంతా వ్యవసాయదారులు. స్వయం సహాయక సంఘా(ఎస్హెచ్జీ)ల్లో సభ్యులుగా చేరారు. వ్యాపారంపై దృష్టి పెట్టారు. గ్రామైక్య సంఘం(వీవో) నుంచి రూ.లక్ష రుణం పొంది, అల్లం పేస్ట్ తయారీ వ్యాపారం ప్రారంభించారు. మొదట్లో తమ వాడలోని ఇండ్లకు, ఆ తర్వాత ఊర్లోనే తమ అల్లం పేస్ట్ను అందుబాటులోకి తెచ్చారు. క్రమంగా మండలం, జిల్లా దాటి.. రాష్ట్రవ్యాప్తంగా తమ వ్యాపారాన్ని విస్తరించారు. దుకాణాలు, హోటళ్లు, ఫంక్షన్లకూ హోల్సేల్గా అల్లం పేస్ట్ను సరఫరా చేస్తూ, మంచి లాభాలను పొందుతున్నారు. స్వశక్తితో ఇతర మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.. వరంగల్ జిల్లా నల్లబెల్లి కుటీర పరిశ్రమ నిర్వాహకులు.
నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్ గ్రామానికి చెందిన కొందరు స్వయం సహాయక సంఘాల సభ్యులకు అల్లం వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది. ఈ నేపథ్యంలో ఐదు సంఘాల నుంచి 11 మంది సభ్యులు కలిసి, కొంత పెట్టుబడి సమకూర్చుకున్నారు. ‘నల్లబెల్లి కుటీర పరిశ్రమ’ పేరుతో ప్రత్యేకంగా ఒక సంఘాన్ని స్థాపించారు. గుండ్లపహాడ్ గ్రామంలో ఒక గదిని అద్దెకు తీసుకుని అల్లం వ్యాపారం ప్రారంభించారు. మొదట వరంగల్ నగరంలోని హోల్సేల్ దుకాణాల నుంచి అల్లం కొనుగోలు చేసి అమ్మారు. ఆ తర్వాత అల్లం పేస్ట్ తయారుచేస్తే మంచి లాభాలు వస్తాయని గుర్తించారు.
అనుకున్నదే తడవుగా ఏడాది క్రితం గ్రామంలోని వీవో నుంచి రూ.లక్ష రుణం తీసుకున్నారు. అల్లం పేస్ట్ తయారీ కోసం యంత్రాన్ని కొనుగోలు చేశారు. దానిని గ్రామంలోని తమ అద్దె గదిలో ఏర్పాటు చేసి అల్లం పేస్ట్ తయారీ ప్రారంభించారు. మొదట్లో అల్లం పేస్ట్ను పావుకిలో, అరకిలో, కిలో చొప్పున డబ్బాల్లో ప్యాక్ చేసి తమ వాడలోని ఇండ్లకు సరఫరా చేసేవారు. ఆ తర్వాత గ్రామంలోని ఇతర ఇండ్లకూ చేరవేశారు. నాణ్యత బాగుండటంతో వీరి అల్లం పేస్ట్కు చుట్టు పక్కల గ్రామాల నుంచీ ఆర్డర్లు రావడం మొదలైంది.
అల్లం పేస్ట్ తయారు, అమ్మకం ద్వారా ఆశించిన ఫలితాలు రావడంతో ‘నల్లబెల్లి కుటీర పరిశ్రమ’ రోజురోజుకూ విస్తరిస్తున్నది. క్రమంగా నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలు, ఆ తర్వాత వరంగల్ జిల్లాలోని ఇతర మండలాలకూ అల్లం పేస్ట్ సరఫరా కావడం మొదలైంది. ఇప్పుడు ములుగు, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాలకూ ‘నల్లబెల్లి’ అల్లం పేస్ట్ చేరుతున్నది. చిన్న చిన్న దుకాణాలు మొదలుకుని హోల్సేల్ షాపుల వరకూ ఆర్డర్పై తయారు చేసి పంపిస్తున్నారు నల్లబెల్లి మహిళలు. పావు కిలో, అర కిలో నుంచి కిలో, రెండు కిలోలు, ఐదు కిలోల లెక్కన డబ్బాల్లో ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. ఆర్డర్లు పెరుగుతుండటంతో ఇప్పుడు ఎక్కువగా హోల్సేల్గానే అమ్మకాలు చేపడుతున్నారు.
ఈ పరిశ్రమలోని 11 మంది మహిళలు ఓవైపు వ్యవసాయం చేస్తూనే, మరో వైపు వ్యాపారాన్నీ నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం అల్లం పేస్ట్ తయారీకి, మధ్యాహ్నమంతా వ్యవసాయ పనుల కోసం సమయం కేటాయిస్తున్నారు. ప్రస్తుతం నల్లబెల్లి కుటీర పరిశ్రమకు అధ్యక్షురాలిగా దురిశెట్టి లక్ష్మి, కార్యదర్శిగా కొండోజు కళమ్మ, కోశాధికారిగా బొంత సంధ్య వ్యవహరిస్తున్నారు. వీరిలో సంధ్య పరిశ్రమ ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు.
అల్లం పేస్ట్ వ్యాపారం ద్వారా వచ్చిన లాభాల నుంచి ఇప్పటికే వీవో రుణం చెల్లించారు. పెట్టుబడి, ఖర్చులుపోగా మిగిలిన డబ్బును తమ పరిశ్రమ బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. ఇప్పటివరకూ రూ.3 లక్షల ఆదాయం గడించారు. ఈ వ్యాపారం గురించి తెలిసి, ఈ వ్యాపారంలోకి రావాలని అనుకుంటున్న చుట్టుపక్కల మండలాల సభ్యులు గుండ్లపహాడ్ గ్రామాన్ని సందర్శిస్తున్నారు. వరంగల్ జిల్లాలోని ఖానాపురం మండల సమాఖ్యలోని సభ్యులు, అధికారులు వీరిని సంప్రదించి అల్లం పేస్ట్ తయారీ, అమ్మకాల గురించి తెలుసుకున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కూడా నల్లబెల్లి పరిశ్రమ గురించి తెలుసుకుని, నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.
వేముల రాజేశ్వర్ రావు