ప్రస్తుత పరిస్థితుల్లో పాడిపశువులు, జీవాల పోషణ రైతులకు భారంగా మారింది. ప్రధానంగా పశువులకు అవసరమైన మేతను సమకూర్చుకునేందుకే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తున్నది. మేలైన పశుగ్రాసాలను సాగు చేయడం ద్వారా అధిక పాల దిగుబడి పొందే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో పశుగ్రాసాల సాగుపై పాడి రైతులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది.
పశుగ్రాసాలను అన్ని ఆరుతడి నేలల్లోనూ పెంచవచ్చు. మొదట దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల నత్రజని, 10 కిలోల పొటాష్, 5 కిలోల జింక్ వేసుకోవాలి. భూమిని మెత్తగా దున్నిన తరువాత ప్రతి మూడు అడుగులకు ఒక బోదెను ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకోసం ఎకరానికి 10 వేల దాకా కాండపు ముక్కలు లేదా వేరుపిలకలు అవసరం అవుతాయి. బాగా ముదిరిన సూపర్ నేపియర్ కాండాలను ముక్కలుగా చేయాలి. ప్రతి ముక్కలో తప్పనిసరిగా రెండు కణుపులు ఉండాలి.
భూమికి ఆరుతడి పెట్టిన తరువాత ప్రతి మూడు అడుగులకు ఒక ముక్కను ఏటవాలుగా.. ఒక కణుపు భూమిలోకి, మరొక కణుపు భూమిమీద ఉండేలా 45 డిగ్రీల వాలుగా గుచ్చాలి. నాలుగైదు రోజుల్లో భూమి లోపలి కణుపు నుంచి వేర్లు, భూమిమీద కణుపు నుంచి ఆకులు వస్తాయి. నేపియర్ గడ్డి త్వరగా దుబ్బు కట్టాలంటే.. మొదళ్ల వద్ద కలుపు రాకుండా చూసుకోవాలి. మొదటి కోత వరకు వరుసల మధ్య అంతర పంటగా అలసంద, జనుము వంటివి వేసుకోవచ్చు. నాటిన మూడు వారాలకు పైపాటుగా నత్రజని వేస్తే.. గడ్డి త్వరగా పెరుగుతుంది. కాలాన్ని బట్టి 10 నుంచి 15 రోజులకు ఒకసారి నీటి తడిని ఇవ్వాలి.
మొదటి కోత రెండు నెలలకు, తదుపరి కోతలు ప్రతి 35-40 రోజులకు ఒకసారి తీసుకోవచ్చు. ఈ విధంగా ఏడాదిలో దాదాపు 8 కోతలు తీసుకోవచ్చు. ప్రతి కోతకు సుమారు 20 కిలోల నత్రజని వేయాలి. సంవత్సరానికి ఒకసారి 10 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 10 కిలోల పోటాష్ వేస్తూ ఉండాలి. ఈ పశుగ్రాసం భూమి నుంచి నిరంతరం పోషక పదార్థాలను తీసుకుంటుంది. కాబట్టి, సరైన ఎరువుల యాజమాన్యం పాటిస్తే దిగుబడి ఎక్కువగా ఉంటుంది.
బాగా పెరిగిన గడ్డి సుమారు 12 నుంచి 15 అడుగుల వరకూ ఉండి, ఎకరానికి సుమారు 200-300 టన్నులకు పైగా పశుగ్రాసం దిగుబడి ఇస్తుంది. ఏడాది తర్వాత చచ్చుదుబ్బులు తీస్తూ ఉంటే, కొత్త పిలకలు పెరిగి సుమారు పదేండ్ల వరకూ పశుగ్రాసాన్ని పొందవచ్చు. సూపర్ నేపియర్ పశుగ్రాసంలో 10-12% మాంసకృత్తులు, 50-55% జీర్ణ యోగ్య పదార్థాలు ఉంటాయి. ఒక ఎకరంలో సాగుచేసిన సూపర్ నేపియర్ గడ్డి, సుమారు 10 పశువులకు ఏడాది పొడవునా పశుగ్రాసం అవసరాలను తీరుస్తుంది.
మేపే విధానం
సూపర్ నేపియర్ గడ్డిని తప్పనిసరిగా కత్తిరించిన తర్వాతే మేపాలి. ఇందుకోసం చాఫ్కట్టర్ ద్వారా 0.5-1.0 సెం.మీ. ముక్కలుగా చేయాలి. లేకుంటే పశువులు ఆకులు మాత్రమే తింటాయి. దీనివల్ల కాండంలోని పోషక పదార్థాలు వృథా అవుతాయి. ఈ గడ్డిలో చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పశువులు ఇష్టంగా తింటాయి. సాధారణంగా నేపియర్ గడ్డిని పూర్తిగా కాకుండా, ఒక భాగం కాయ జాతి పశుగ్రాసాలు అయిన అలసంద, పిల్లిపెసర, జనుము, ఉలవ వంటివాటితో కలిపి మేపితే పాల దిగుబడి ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా సైలేజీ పద్ధతి ద్వారా గడ్డిని నిలువ చేసుకోవచ్చు.