పాలకూరలో పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటికి మార్కెట్లో మంచి డిమాండు ఉన్నది. కాబట్టి రైతులు ఈ ఆకు కూరను సాగు చేసి మంచి లాభాలు పొందవచ్చు. దీని సాగుకు నీరు తక్కువగా అవసరం. దీంతోపాటు సులభ పద్ధతిలో సాగు చేసుకునే అవకాశం ఉన్నది. మంచి విత్తనాలను ఎంచుకున్న తర్వాత వాటిని సరైన పద్ధతులలో నాటు పెట్టి సకాలంలో నీటి తడులు అందించాలి. మోతాదు ప్రకారం ఎరువులు వేస్తూ.. అవసరానికి తగ్గట్టుగా మందులను వాడితే మంచి దిగుబడులు వస్తాయి.
సాధారణంగా పాలకూరను సారవంతమైన మురుగునీరు పోయే నేలలు అనుకూలం. చౌడునేలల్లోనూ పాలకూరను పండించవచ్చు. సాధారణంగా మన ప్రాంతంలో దీనిని అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పండిస్తారు.
నాటుకునే విధానం
ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనా లు అవసరం. విత్తనాలను 20X10 సెంటీమీటర్ల దూరంలో ను, 3-4 సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి. ఇలా విత్తుకు న్న విత్తనాలు 8-10 రోజులలో మొలకెత్తుతాయి.
ఎరువుల యాజమాన్యం
ఎకరాకు 6-8 టన్నుల మాగిన పశువుల ఎరువు లేదా 1.5 టన్నుల వానపాముల ఎరువు, 4 కిలోల అజోస్పైరిల్లమ్, 4 కిలోల ఫాస్పో బాక్టీరియంలు వేయాలి.
రసాయన ఎరువులు
ఎకరాకు 10 కిలోల నత్రజని, 10 కిలో ల భాస్వరం, 20 కిలోల పొటాష్లను వాడాలి. ప్రతి కోత తర్వాత 10 కిలోల నత్రజని వేయాలి.
నీటి యాజమాన్యం
విత్తిన వెంటనే నీటి తడి ఇవ్వాలి. భూమిలో తేమను బట్టి ప్రతి 7-10 రోజులకు ఒక్కసారి నీటి తడి ఇవ్వాలి. తుంపర పద్ధతిలో నీటిని అందిస్తే నీటిని పొదుపు చేయడంతో పాటు ఎక్కువ విస్తీర్ణంలో పంటను సాగు చేయవచ్చు.
సస్యరక్షణ
ఆకుకూరలకు తక్కువ సాంద్రత గల పురుగు మందులను మాత్రమే వాడాలి. పేనుబంక, ఆకులు తినే గొంగ ళి పురుగుల నివారణకు లీటరు నీటికి 2 మి.లీ.ల మలాథిన్ కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ఆక్సీక్లోరైడ్ మందును కలిపి పిచికారీ చేయాలి. మందును పిచికారీ చేసిన తర్వాత పదిరోజుల సమ యం గడిచిన తర్వాతే ఆకులు కోయాలి.
ఆకుల కోత
విత్తిన 3-4 వారాలకు మొదటి కోతకు వస్తుంది. తర్వాత 7-10 రోజలు వ్యవధిలో 4-6 కోతలు తీసుకోవచ్చు.
దిగుబడి: పాలకూరలో ప్రధానంగా ఆల్గ్రీన్, పూసాజ్యోతి, ఊటి నెంబర్-1 అనే రకాలు ఉన్నాయి. వీటిలో ఆల్గ్రీన్ అనేరకం ఎకరాకు ప్రతి 15 రోజులకు ఒకసారి కోత చొప్పున 6,7 కోతలలో 5 టన్నులు, పూసాజ్యోతి 6-8 కోతలలో 16-19 టన్నులు, ఊటి నెంబర్-1 రకం 4 కోతలలో 24 టన్నుల దిగుబడి వస్తుంది. దీంతో ఎకరా పాలకూర తోటలో రైతులకు అన్ని పెట్టుబడులు పోగా రూ. 3లక్షలకు పైనే ఆదాయం ఉంటుంది.