ఐదెకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. ఇటీవలి వర్షాలతో చీడపీడల ఉధృతి పెరిగింది. నివారణకు సలహా ఇవ్వగలరు.
వెంకటి, కాటారం.
భారీ వర్షాలకు పత్తి చేలల్లో నీరు నిలవడం వల్ల పంటలు దెబ్బతిన్నాయి. పొలాల్లో మొక్కలు ఎండిపోవడం గమనిస్తే.. లీటర్ నీటిలో 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 1గ్రా. కార్బెండజిమ్ కలిపి 5 నుంచి 7 రోజుల వ్యవధిలో రెండుసార్లు మొక్కల అడుగుభాగం తడిసేలా పిచికారీ చేయాలి. పంట త్వరగా కోలుకునేందుకు లీటర్ నీటిలో.. నీటిలో కరిగే పాలిఫీడ్ (19-19-19) లేదా మల్టీ-కె (13-0-45) లేదా యూరియా 10 గ్రా. చొప్పున కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. కలుపు నివారణ కోసం లీటర్ నీటిలో 1.25 మి.లీ. పైరిథయోబ్యాక్ సోడియం, 2 మి.లీ. క్విజలోపాస్ ఇథైల్ కలిపి పిచికారీ చేయాలి. చీడపీడల బారినుంచి పంటను కాపాడుకునేందుకు లీటర్ నీటిలో 1 గ్రా. కార్బెండజిమ్ లేదా 1 మి.లీ. ప్రొఫికొనజోల్, 5 మి.లీ. వేపనూనె (1500 పి.పి.ఎం) లేదా 2 మి.లీ. ఫిప్రోనిల్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి.