సోయాచిక్కుడు సాగు చేస్తున్నా. కొన్ని రోజులుగా ఆకులపై ఎర్రరంగు, ఉదారంగు మచ్చలు ఏర్పడుతున్నాయి. వీటి ప్రభావంతో ఆకులు మాడి రాలిపోతున్నాయి. అక్కడక్కడా ఆకు ముడతతోపాటు చిత్తపురుగు కూడా కనిపిస్తున్నది. వీటిని నివారించే మార్గం చెప్పండి.
–రాజిరెడ్డి, తిమ్మాపూర్.
మీ చేనుకు ‘సెర్మోస్పోరా ఆకుమాడు తెగులు’ సోకింది. దీని ప్రభావంతో ఆకుల రెండువైపులా ఎరుపు, ఊదారంగులో మచ్చలు ఏర్పడి, క్రమేపీ పసుపుగా మారుతాయి. ఆకుల తొడిమెలు, కాండం, కాయలపై కూడా ఈ మచ్చలు కనిపిస్తాయి. కొన్ని రోజులకు ఆకులు మాడి రాలిపోతాయి.
ఆల్టర్ నేరియా ఆకుమచ్చ తెగులు సోకినట్లయితే, ముదురు ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. కొన్నిసార్లు కాయలపై కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఈ తెగులు నివారణకు లీటర్ నీటిలో 3 గ్రా. మాంకోజెబ్ లేదా 1 గ్రా. కార్బెండజిమ్ కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుమూడు సార్లు పిచికారీ చేయాలి. ఇక ఆకుముడత నివారణ కోసం లీటర్ నీటిలో 1 గ్రా. ఎసిఫేట్ లేదా 2.5 మి.లీ. క్లోరిపైరిఫాస్ లేదా 2 మి.లీ. క్వినాల్ఫాస్ కలిపి పిచికారీ చేయాలి. లీటర్ నీటిలో 2 మి.లీ. డైమిథోయేట్ లేదా 1 గ్రా. ఎసిఫేట్ కలిపి పిచికారీ చేస్తే, చిత్త పురుగును నివారించుకోవచ్చు.