చలికాలంలో గొర్రెలు, మేకలు రోగాలబారిన పడే అవకాశం ఉన్నది. చలిలో కొన్నిరకాల వైరస్లు, వ్యాధికారక ఈగలు వ్యాప్తిచెందడం వల్ల రోగాలు ప్రబలుతాయి. జీవాలను ఆరుబయట ఉంచడంవల్ల కూడా అనారోగ్యానికి గురవుతాయి. కొన్ని అంటువ్యాధులు ఆరోగ్యవంతమైన జీవాలకూ వ్యాపిస్తాయి. సరైన సమయంలో వ్యాధిని గుర్తించి, చికిత్స అందించకుంటే జీవాలు మృత్యువాత పడుతాయి. ముఖ్యంగా చలికాలంలో జీవాల్లో వ్యాపించే వ్యాధులు, వాటి నివారణ చర్యల గురించి..
జీవాలను ఆరుబయట ఉంచడం, పాకలు పరిశుభ్రంగా లేకపోవడం, దుమ్మూధూళితో నిండిఉండటం వల్ల జీవాలకు న్యుమోనియా సోకుతుంది. షెడ్లలో పరిమితికి మించి ఎక్కువ సంఖ్యలో జీవాలను ఉంచడం, సరైన పోషణ లేకపోవడంవల్ల జీవాలు తీవ్ర ఒత్తిడికి గురవడం కూడా న్యుమోనియా రావడానికి కారణమవుతాయి. ఈ వ్యాధికి గురైన జీవాల్లో దగ్గు, జ్వరం, ముక్కు కారడం ఎక్కువగా కనిపిస్తుంది. సరిగ్గా మేత మేయకపోవడం వల్ల జీవాలు నీరసించిపోతాయి. ఇలాగే కొన్ని రోజులు గడిస్తే, అవి మరణించే అవకాశం ఉంటుంది. ముర్రుపాలు సరిగా తాగని చిన్నపిల్లల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మరణాలు కూడా ఎక్కువగా సంభవిస్తాయి. ముఖ్యంగా ఒకటి నుంచి తొమ్మిది నెలల వయసున్న మేక, గొర్రె పిల్లలు ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడుతుంటాయి.
నివారణ : న్యుమోనియా వ్యాధి నివారణకు గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే షెడ్లలో జీవాలను ఉంచాలి. వాటికి ఎప్పటికప్పుడు సరైన పోషణ ఇవ్వాలి. తల్లులు మూడు నెలల చూడితో ఉన్నప్పుడే న్యుమోనియా నివారణకు టీకా ఇవ్వడం వల్ల పిల్లల్లో వ్యాధిని నివారించవచ్చు. టీకాల వల్ల ముర్రుపాలలో యాంటీబాడీలు వృద్ధి చెంది, పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఈ వ్యాధి ప్రధానంగా గొర్రెల్లో కనిపిస్తుంది. కులికాయిడ్ జాతికి చెందిన చీకటీగల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఇది అంటువ్యాధి. వ్యాధికి గురైన గొర్రె నుంచి ఆరోగ్యవంతమైన గొర్రెలకూ సోకుతుంది. చలికాలంలో కులికాయిడ్ జాతికి చెందిన చీకటీగలు ఎక్కువగా వృద్ధిచెందుతాయి. గాలిద్వారా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సులభంగా చేరి, వ్యాధిని వ్యాపింపజేస్తాయి. ఈ వ్యాధి సోకిన గొర్రెల్లో అధిక జ్వరం, కండ్లు, ముక్కులు కారడం కనిపిస్తుంది. నోరు, నాలుక వాచి, నీలిరంగులోకి మారుతుంది. నోటిలో పుండ్లు కూడా ఏర్పడతాయి. దీనివల్ల జీవాలు ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది పడుతాయి. కాలిగిట్టలు, చర్మం కలిసే దగ్గర వాపు వచ్చి, జీవాలు కుంటుతుంటాయి. వ్యాధి లక్షణాలు ఎక్కువై మరణిస్తాయి.
నివారణ : కులికాయిడ్ జాతికి చెందిన చీకటీగలను నివారించడం ద్వారా ఈ వ్యాధిని నిర్మూలించవచ్చు. జీవాలుండే షెడ్ల దగ్గర మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వ్యాధికి గురైన జీవాలను త్వరగా గుర్తించి, మందనుంచి వేరు చేయాలి. వాటిని ప్రత్యేకంగా ఉంచి, చికిత్స అందించాలి. ఆరోగ్యవంతమైన జీవాలకు నీలినాలుక టీకాలు ఇప్పించాలి.
డిసెంబర్, జనవరి నెలల్లో వ్యాపించే వైరస్ వల్ల ఈ వ్యాధి ప్రబలుతుంది. ఇది ఎక్కువగా మేకల్లో కనిపిస్తుంది. వ్యాధికి గురైన మేకలపై బొబ్బలు కనిపిస్తాయి. తీవ్ర జ్వరానికి గురవుతాయి. ముక్కుల నుంచి నీరు కారుతుంది. వ్యాధిగ్రస్త మేకలకు శ్వాస సరిగ్గా ఆడక, వేగంగా ఊపిరి పీలుస్తుంటాయి.
నివారణ : బొబ్బరోగం నివారణకు ఫిబ్రవరి నెలలో మశూచి టీకాలను వేయించాలి. వ్యాధికి గురైన మేకలను మంద నుంచి వేరుచేసి చికిత్స అందించాలి. పుండ్లపై వేపనూనె లేదా పశువైద్యులు సూచించిన మందులను పూయాలి.