యాసంగిలో అపరాల సాగు లాభదాయకమని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్ఏఆర్ఎస్) సహ వ్యవసాయ సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి సూచిస్తున్నారు. మినుము, పెసర, జొన్న, మక్కజొన్న, నువ్వు పంటలు వేసేందుకు ఇది అనుకూల సమయమని చెబుతున్నారు. ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. రైతులకు పలు సూచనలు చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి పంటలు వేయడం మంచిది?
అపరాల సాగుకు ఇది అనుకూల వాతావరణం. వీటిని ఇప్పుడు సాగు చేస్తే దిగుబడి పెరుగుతుంది. మినుము, పెసర, జొన్న, మక్కజొన్న పంటలను ఈ నెల 20వ తేదీ వరకూ వేసుకోవచ్చు. నువ్వులను మాత్రం ఈ నెల 15వ తేదీలోగానే విత్తుకోవాలి. అపరాలకు స్థానికంగా మంచి మార్కెట్ ఉంది. విత్తన సమస్య కూడా లేదు. మినుము, పెసర విత్తనాలు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాల్లోనే అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడి కూడా తక్కువ. అపరాలకు చీడపీడల బెడదా తక్కువే. ఏప్రిల్ మొదటి వారంలోగా దిగుబడులు చేతికొస్తాయి. ఈ యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు సాగు చేయడం ఎంతో లాభదాయకం.
మినుముల్లో ఏయే రకాలు అందుబాటులో ఉన్నాయి?
మినుములు 80 రోజుల పంట. వేసవిలోగానే చేతికొస్తుంది. ఎకరానికి ఏడు నుంచి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు. మంచి ధర కూడా వస్తుంది. ఈ పంట కోసం ఎకరానికి 8 కిలోల విత్తనాలు సరిపోతాయి. పీయూ-31, టీబీజీ-104, వీబీఎన్-8 రకం విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. పీయూ-31 సాదా రకం. కాయలపై నూగు ఉంటుంది. పల్లాకు తెగులును పూర్తిగా తట్టుకుంటుంది. 70 నుంచి 75 రోజుల్లో కోతకొస్తుంది. టీబీజీ-104 వేసవికి అనుకూలమైనది. పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం ఇది. వీబీఎన్-8 నీటి వసతి గల ప్రాంతాల్లో సాగుకు అనుకూలం. పల్లాకు తెగులును తట్టుకొనే సాదా రకం ఇది.
ప్రస్తుతం దిగుబడి త్వరగా చేతికి రావాలంటే ఏ పంటలు వేయాలి?
పెసర 60 రోజుల పంట. యాసంగి సాగుకు అనుకూలమైనది. ప్రస్తుతం రెండు రకాల పెసర విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి డబ్ల్యూజీజీ-42(యాదాద్రి) రకం. రెండోది ఎంజీజీ-385 (మధిర పెసర-1) రకం. డబ్ల్యూజీజీ-42 రకం వానకాలం, యాసంగి సాగుకు అనుకూలం. పంట కాలం 58 నుంచి 60 రోజులు మాత్రమే. పొడవైన కాయలు, లావు మెరుపు గింజలు కలిగి ఉంటాయి. పల్లాకు తెగులునూ సమర్థంగా తట్టుకొంటుంది. ఎకరానికి నాలుగు నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు. ఇక ఎంజీజీ-385 కూడా వేసవి సాగుకు అనుకూలమైనదే. పొడవైన కాయలు, మధ్యస్థ మెరుపు గింజలు ఉంటాయి. పల్లాకు తెగులునూ తట్టుకొంటుంది.
విత్తన ధరలు ఎలా ఉన్నాయి?
మినుములో పీయూ-31, టీబీజీ-104, వీబీఎన్-8 రకాలు, పెసరలో డబ్ల్యూజీజీ-42, ఎంజీజీ-385 రకాలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అందుబాటులో ఉన్నాయి. కిలో మినుము విత్తనాలు రూ.130, పెసర విత్తనాల ధర రూ.110. కావాల్సిన రైతులు పరిశోధన కేంద్రంలోని స్టోర్ ఇన్చార్జి బి.రమేశ్ను (9133446600) సంప్రదించవచ్చు.
వరంగల్ ఆర్ఏఆర్ఎస్ సహ వ్యవసాయ సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి