ఔషధ గుణాల కీరదోస.. కర్షకుల గోస తీరుస్తున్నది. ఆహార పంటగానే కాదు.. వాణిజ్య పంటగానూ విరివిగా సాగవుతున్నది. తక్కువ రోజుల్లోనే చేతికి వస్తూ.. రైతులను లాభాల బాట
పట్టిస్తున్నది. దీనికి మార్కెట్లో ఏడాదంతా గిరాకీ ఉంటున్నది. అదే సమయంలో మంచి ధర కూడా పలుకుతున్నది.
ఒకప్పుడు వేసవికి ముందే కీరదోసను పండించేవారు. కానీ, ఇప్పుడు ఏడాదంతా సాగు చేస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో ఈ పంటను ఎక్కడైనా సాగు చేసుకోవచ్చు. అయితే, పాలీహౌజుల్లో పండిస్తే.. ఏడాదంతా మంచి దిగుబడి సాధించవచ్చు. అంతేకాకుండా, కాయలను ఆకర్షణీయమైన రంగు, నిర్దిష్ట ఆకారంలో పొందవచ్చు. దీనివల్ల మార్కెట్లో మంచి ధర సొంతం చేసుకోవచ్చు.
అనుకూలం : మురుగు నేలలు కాకుండా, అన్ని రకాల నేలల్లోనూ కీరదోసను సాగు చేసుకోవచ్చు. ఎర్ర గరప నేలలు అత్యంత అనుకూలం. ఉదజని సూచిక 5.5 నుంచి 6.5 శాతం ఉంటే దిగుబడి ఎక్కువగా వస్తుంది. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 24 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉండే వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
కీరదోసలో రకాలు : కీరదోసలో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. వాణిజ్య సరళిలో సాగుకు ఈ మూడు రకాలూ అనుకూలమే. అయితే, పాలీహౌజ్లో సాగుకు ‘పార్డినోకార్పిక్’ రకాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఇందులోనూ సలిస్, అలామిర్, సన్కియాన్ వంటి రకాలకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నది.
మడుల తయారీ : కీరదోస సాగు కోసం మొదటగా మడులను ఏర్పాటు చేసుకోవాలి. 90 సెం.మీ వెడల్పు, 40 సెం.మీ ఎత్తు ఉండేలా బెడ్లను తయారు చేసుకోవాలి. ఒక్కో బెడ్ మధ్య 50 సెం.మీ దూరం ఉండేలా చూసుకోవాలి. ఎకరానికి కిలో నుంచి కిలోన్నర దాకా విత్తనాలు అవసరం అవుతాయి. సాగుకోసం హరిత గృహాల్లో ప్లగ్ ట్రేలలో పెంచిన 30 రోజుల వయసు కలిగిన నారును ఎంచుకోవాలి.
మొక్కలు నాటడం : వరుసల మధ్య 75 సెం.మీ. వరుసలోని మొక్కల మధ్య 45 సెం.మీ. ఎడం ఉండేలా మల్చింగ్ షీట్పై వేరుతోపాటు మొక్కలను నాటుకోవాలి.
సాగు పద్ధతులు : పాలీహౌజుల్లో రెండు పద్ధతుల్లో కీరదోసను సాగు చేయవచ్చు. అందులో ఒకటి వర్టికల్ కార్డాన్ పద్ధతి, రెండోది కార్డాన్ పద్ధతి.
సస్యరక్షణ : కీరదోస సాగులో ప్రధానంగా పేనుబంక కనిపిస్తుంది. ఈ పురుగులు ఆశిస్తే.. ఆకులు ముడుచుకొని పోతాయి. ఆకుల మీద తేనెలాంటి పదార్థం విసర్జించడం వల్ల మసి ఏర్పడుతుంది. దీన్ని నివారించేందుకు లీటర్ నీటిలో 1 గ్రా. ఎసిఫేట్ లేదా 0.3 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా తామరపురుగు ఆశిస్తే.. ఇవి ఆకులపై రసాన్ని పీల్చి ఆకుల ఆకారాన్ని మార్చేస్తాయి. దీని నివారణకు లీటర్ నీటిలో 0.3 మి.లీ. స్పైనోసాడ్ కలిపి పిచికారీ చేసుకోవాలి. కొన్నిచోట్ల ఎర్రనల్లి పురుగులు ఆశించి, ఆకుల రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల ఆకులు పాలిపోతాయి. ఆకుల అడుగు భాగాన ఎర్రటి బూజుతో నిండిన పురుగుల గుంపులను నివారించేందుకు.. లీటర్ నీటిలో 3 మి.లీ. డైకోఫాల్ కలిపి పిచికారీ చేయాలి. వారం వ్యవధిలో లీటర్ నీటికి 1 మి.లీ. ప్రాపర్గైట్ కలిపి పిచికారీ చేసుకోవాలి.
తెగుళ్లు : కీరదోస తోటల్లో ఎక్కువగా సెర్కా స్పారా ఆకుమచ్చ తెగుళ్లు వస్తాయి. దీనివల్ల ఆకుల మీద చిన్న గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటర్ నీటికి 2.5 గ్రా. మాంకోజెబ్ లేదా 2 మి.లీ. హెక్సాకొనజోల్ కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు సోకడం వల్ల ఆకుల అడుగు భాగాన బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. అవి క్రమేణా ఆకుల పైభాగానికి చేరుతాయి. తర్వాత ఆకులు ఎండిపోతాయి. దీనిని నివారించేందుకు లీటర్ నీటిలో 2.5 గ్రా. మాంకోజెబ్ లేదా 2 గ్రా. మెటలాక్సిల్ కలిపి పిచికారీ చేయాలి. వెర్రి తెగులు వల్ల ఆకులు ముడుచుకుని వంకరలు తిరుగుతాయి. తీగలు కురుచగా గిడసబారి, మొక్కల ఎదుగుదల లోపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో పూత, కాయ ఏర్పడదు. దీన్ని నివారించేందుకు లీటర్ నీటిలో 2 మి.లీ. ప్రిపోనిల్ లేదా 2 మి.లీ. మెటాసిస్టాక్స్ కలిపి పిచికారీ చేయాలి.
దిగుబడి : మొక్కలు నాటిన 45 నుంచి 65 రోజుల్లో పంట కోతకు వస్తుంది. లేత ఆకుపచ్చగా ఉన్న కాయలను మాత్రమే కోయాలి. ఊర బెట్టడానికి వాడే కీరదోసలను 5 సెం.మీ కన్నా తక్కువ పొడవు ఉన్నప్పుడే కోసుకోవాలి. ముక్కలకు వాడే కీరదోస 4 సెం.మీ. కన్నా తక్కువ పొడవు ఉండేలా చూసుకోవాలి. ఒక మొక్కకు సరాసరి 8 కిలోల దిగుబడి వస్తుంది. ఇలా పాలీహౌజ్లో హైబ్రీడ్ రకాలను సాగు చేస్తూ ఎకరానికి 30 టన్నుల దిగుబడి పొందవచ్చు.
వర్టికల్ కార్డాన్ పద్ధతి :
ఈ పద్ధతిలో ప్రతి బెడ్పైనా రెండు వరుసల్లో మొక్కలు పెంచాలి. మొక్కలు నిటారుగా మడిపైన 10 అడుగుల ఎత్తులో సమాంతరంగా కట్టిన తీగ వరకూ పెరగనివ్వాలి. తీగకు తాకిన వెంటనే మొక్క తల భాగాన్ని తుంచేయాలి.
కార్డాన్ పద్ధతి : ఈ పద్ధతిలో ఎదిగే మొక్కల కొనభాగం
తీగను తాకి.. 1-2 ఆకులు వచ్చిన తర్వాత కొనభాగాన్ని తుంచేయాలి. దానికింద నుంచి వచ్చిన రెండు పక్క కొమ్మలను కిందికి పాకించాలి. ఈ పద్ధతుల్లో సాగు చేయడం వల్ల దిగుబడులు పెరుగుతాయి.
డ్రిప్ పైపులు
కీరదోస సాగులో నీటి యాజమాన్యాన్ని తప్పకుండా పాటించాలి. ఇందుకోసం 16 ఎం.ఎం వ్యాసం ఉండి, ప్రతి 45 సెం.మీ వద్ద గంటకు రెండు నుంచి నాలుగు లీటర్ల దాకా నీటి చుక్కలను విడుదల చేసే ఇన్లైన్ డ్రిప్ పైపులను ఎంచుకోవాలి. వీటిని మడి మధ్యభాగంలో పరుచుకోవాలి. 1.2 మీ వెడల్పు, 35 నుంచి 100 మైక్రాన్ల మందం ఉన్న పాలిథిన్ మల్చింగ్ షీట్లను మడులపై కప్పాలి. మల్చింగ్ షీట్పై 75X45 సెం.మీ ఎడంలో 5 సెం.మీ వ్యాసంలో రంధ్రాలు చేయాలి.
ఉద్యాన శాఖ అండతో..
మేం ఉన్నత చదువులు చదివాం. ఎంతమంచి ఉద్యోగాలు చేసినా.. సంతృప్తి లేదు. అందుకే, ఉద్యోగాలను వదిలిపెట్టి సాగువైపు మళ్లాం. మా వ్యవసాయ భూమిలోనే పాలీహౌజ్ ఏర్పాటు చేసుకున్నాం. ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ సబ్సిడీ అందించింది. అందులో కీరదోస సాగు చేస్తున్నాం. మంచి దిగుబడులు సాధిస్తున్నాం.
– ఎన్. వెంకట నర్సింహారావు – సైదమ్మ. కొత్తగూడెం, మిర్యాలగూడ మండలం.
…? మజ్జిగపు శ్రీనివాస్రెడ్డి