భర్త పీజీ, భార్య డిగ్రీ చేశారు. ఉన్నత విద్యావంతులైనా.. వారిద్దరూ వ్యవసాయం వైపే అడుగులేశారు. తమకున్న నాలుగు ఎకరాల్లో టమాట, బీర, పచ్చిమిర్చి పంటలను సాగు చేస్తున్నారు. ఉద్యోగాల కంటే.. కూరగాయల సాగే ఎంతో ఉత్తమమని నిరూపిస్తున్నారు. ఏడాదికి మూడు పంటలు పండిస్తూ.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందుతున్నారు. తోటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.. భద్రు – అనిత దంపతులు.
బానోత్ భద్రు – అనిత దంపతులది మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం బొజ్జన్నపేట పంచాయతీ పరిధిలో బీమ్లా తండా. 35 ఏండ్ల బానోత్ భద్రు ఎంఏ ఇంగ్లిష్తోపాటు టీటీసీ కూడా పూర్తిచేశాడు. అనిత బీఎస్సీ, బీఈడీ చేసింది. ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేని ఈ యువ దంపతులు.. వ్యవసాయమే చేయాలని నిర్ణయించుకున్నారు. తమకున్న నాలుగు ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తూ, లక్షల ఆదాయం పొందుతున్నారు. అర ఎకరంలో టమాట, మరో అర ఎకరంలో కాకర, ఎకరం చెలకలో బీరకాయలను పండిస్తున్నారు. ఈ పంటలన్నీ మూడు నెలల్లోనే చేతికి వస్తుండగా, తక్కువ కాలంలోనే ఎక్కువ ఆదాయం అందుకుంటున్నారు.
లాభాల సాగు :
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందుతూ ‘ఔరా!’ అనిపిస్తున్నారు భద్రు – అనిత దంపతులు. కూరగాయల సాగుకోసం భూమి దున్నడం, విత్తనాలు, ఎరువులు, కూలీలు, రవాణా ఖర్చులు అన్నీ కలిపి రూ.90వేల వరకు పెట్టుబడి పెట్టారు. ఎకరం భూమిలో ఒకసారి బీర సాగువేసి, 8 టన్నుల దాకా దిగుబడి సాధించారు. అప్పటి మార్కెట్ రేటు ప్రకారం.. కిలోకు రూ.30ల చొప్పున అమ్మి, రూ.2.40లక్షల ఆదాయం పొందారు. ఇందులో పెట్టుబడి రూ.90వేలు పోగా, రూ.1.50 లక్షల లాభం కండ్ల చూశారు. ఇలా ఏడాదికి మూడుసార్లు బీరకాయలు సాగు చేస్తున్నారు. కాకర సాగులోనూ మంచి ఆదాయాన్నే అర్జిస్తున్నారు. అర ఎకరంలో కాకర సాగు చేయడానికి రూ.50వేలు పెట్టుబడి పెట్టారు. 5టన్నుల దిగుబడి పొందారు. కిలోకు రూ.30 చొప్పున హోల్సేల్ మార్కెట్లో విక్రయించగా, రూ.1.50లక్షల ఆదాయం వచ్చింది. ఇందులో రూ.50వేలు పెట్టుబడి తీసేస్తే.. రూ.లక్ష మిగిలింది. ఇలా ఏడాదికి రెండుసార్లు కాకర సాగు చేస్తున్నారు. మరో అర ఎకరంలో టమాటను పండిస్తున్నారు. ఐదు వందల ట్రేల టమాట దిగుబడి రాగా, రూ.2లక్షల ఆదాయం వచ్చింది. ఇందులో రూ.50వేలు పెట్టుబడి తీసేయగా.. రూ.1.50 లక్షల లాభం వచ్చింది. ఈ మూడు పంటలూ కలుపుకొని ప్రతి ఏడాదీ రూ.6లక్షల నుంచి రూ.8లక్షల ఆదాయం పొందుతున్నారు.
అన్ని పనులూ మేమే..
ఉన్నత చదువులు చదివినా.. ఒకరి కింద ఉద్యోగాలు చేయడం మా ఇద్దరికీ ఇష్టం లేదు. అందుకే, వ్యవసాయం చేయాలని అనుకున్నాం. మాకున్న నాలుగు ఎకరాల భూమిలో నాలుగేళ్లుగా కూరగాయలు సాగు చేస్తున్నాం. అర ఎకరంలో టమాట, మరో అర ఎకరంలో కాకర, ఎకరం భూమిలో బీర పంటలు వేశాం. ఏడాదికి మూడుసార్లు కొత్త పంట వేస్తాం. విత్తనాలు నాటడం, కలుపుతీయడం, ఎరువులు చల్లడం, కాయలు తెంపడం.. అన్ని పనులనూ మేమిద్దరమే చేస్తాం. స్థానికులు, చిరువ్యాపారులు నేరుగా మా చేను వద్దకే వచ్చి, పంటలను కొనుగోలు చేస్తుంటారు. మహబూబాబాద్ మార్కెట్కు కూడా తరలిస్తుంటాం. అన్ని ఖర్చులూ పోను ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నాం.
– బానోత్ భద్రు – అనిత
…? కన్నెబోయిన రాజు