సాగులో రసాయనాలు, క్రిమిసంహారక మందులు మితిమీరి వాడుతుండటంతో.. పంటలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. తినే ఆహారం విషతుల్యంగా మారి, అనేక రోగాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రసాయనాలు లేకుండా సహజ వ్యవసాయం చేస్తున్న ఓ విశ్రాంత ప్రభుత్వోద్యోగి ఆదర్శంగా నిలుస్తున్నారు. మూడున్నర దశాబ్దాలుగా కృషి చేసి, తన వ్యవసాయ క్షేత్రంలో ఒక వైవిధ్యాన్ని సృష్టిస్తున్నారు.
గంగాధర మండలం న్యాలకొండపల్లికి చెందిన ఆకుల లక్ష్మయ్య రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఉన్నత విద్యాశాఖలో లెక్చరర్గా, రవాణా శాఖలో ఆర్టీఓగా సేవలందించి విరమణ పొందారు. ప్రస్తుతం హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగుతున్నారు. ఓ రైతుగా తన తండ్రి పడిన తపనను చిన్నప్పటి నుంచి చూసిన లక్ష్మయ్య, వ్యవసాయంపై అమితాసక్తి పెంచుకున్నారు. ఉద్యోగం చేస్తూనే 1985లో 14 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అందులో 12 ఎకరాల్లో మామిడి తోటను పెంచారు.
మిగతా రెండెకరాల్లో వరి, కూరగాయలు పండిస్తున్నారు. మొదట్లో అందరిలాగే రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడేవారు. వాటి వాడకం వల్ల రైతుకు లాభాలు వస్తున్నా, ప్రజల ఆరోగ్యాలు, నేల సారం దెబ్బతింటోందని గ్రహించారు. ప్రకృతి వ్యవసాయ సృష్టికర్త డాక్టర్ సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో సహజ వ్యవసాయంపై దృష్టి పెట్టారు. 2011 నుంచి కేవలం జీవామృతం ఆధారంగా ఈ 14 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలో మొదటి మూడేళ్లపాటు నష్టాలు వచ్చినా భరించారు. ఆ తర్వాత మేలైన దిగుబడులు సాధిస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
అరుదైన వృక్షాలు
లక్ష్మయ్య వ్యవసాయ క్షేత్రంలో 13 రకాల మామిడి పండ్లను పండిస్తున్నారు. దేశీ, విదేశీ పండ్ల మొక్కలు, ఆయుర్వేద ఔషధాలను ఇచ్చే మొక్కలనూ పెంచుతున్నారు. రుద్రాక్ష, ఎర్రచందనంతోపాటు పంపర్ పనస, సింగపూర్ చెర్రి, కరోండ, అంజీర్, వెలగ, గజనిమ్మ లాంటి అరుదైన వృక్షాలు ఇక్కడ కనిపిస్తాయి. కేవలం జీవామృతంతో టమాట, బెండ, వంకాయ వంటి కూరగాయలూ పండిస్తున్నారు. గుగ్గిళ్లం మొక్కలు, మునగ తోటను సాగు చేస్తున్నారు. వీటన్నిటి కోసం తన క్షేత్రంలోనే జీవామృతాన్ని తయారు చేస్తున్నారు.
-దొంత వెంకటస్వామి
పాలేకర్ స్ఫూర్తితో..
వ్యవసాయంలో అనేక మార్పులు తెస్తున్న సుభాష్ పాలేకర్ నాకు స్ఫూర్తి. ఆయన ఇచ్చిన పలు శిక్షణ కార్యక్రమాలకు హాజరయ్యా. వ్యవసాయంలో మా నాన్న పడ్డ కష్టాలే నాలో స్ఫూర్తిని రగిలించాయి. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే వ్యవసాయం చేసేవాణ్ని. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల వల్ల కలిగే అనర్థాలు అనేకం. వీలైనంత మేరకు ప్రతి రైతునూ సహజసిద్ధమైన వ్యవసాయం వైపు మళ్లించాలన్నదే నా లక్ష్యం. జీవామృతంతో అనేక అద్భుతాలు సాధించవచ్చని నా క్షేత్రం ద్వారా నిరూపించాలనుకున్నా. నేను పండించే మామిడికి భారీ డిమాండ్ ఉంది. ఎంతోమంది రిటైల్ వ్యాపారులు ఇక్కడికే వచ్చి తీసుకెళ్తున్నారు. ఇదే స్ఫూర్తితో మరో ప్రయత్నం కూడా చేయబోతున్నా. వచ్చే ఏప్రిల్, మే నెల నుంచి ఆర్గానిక్ పద్ధతిలో అన్ని రకాల ఆకుకూరలు పండించాలని అనుకుంటున్నా. ఆర్డర్పై పండించి డోర్ డెలివరీ ఇవ్వాలనేదే ప్రయత్నం. అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేయబోతున్నా.
-ఆకుల లక్ష్మయ్య