కేంద్రమేమో బియ్యం కొననంటున్నది.. వరికి మార్కెట్లో డిమాండ్ కూడా లేదు.. అలాంటప్పుడు ఆ పంట వేసి ఏం ప్రయోజనమని అంటున్నారు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచెలకకు చెందిన ఆదర్శ రైతు చెరుకూరి రామారావు. వరి సాగు ఒక ఎత్తు, మార్కెట్లో అమ్ముకోవటం ఇంకో ఎత్తు అని.. అందుకే మనమే పండించి, మన దగ్గరలోనే అమ్ముకొనే ఉద్యాన పంట సాగు చేస్తున్నానని అంటున్నారాయన.
ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 4: ‘ఊహ తెలిసిన నాటి నుంచి ఉద్యాన పంటల సాగు చేస్తున్నాను. ఒకప్పుడు 5 ఎకరాలతో మొదలుపెట్టిన ఉద్యానపంటల సాగు ఇప్పుడు 25 ఎకరాలకు చేరింది. ఇంటి మందమే వరి సాగు చేస్తున్నా. వరికి బదులు నాలుగెకరాల్లో చెరుకు సాగుచేశా’ అని రామారావు చెప్పారు. ఉద్యాన పంటలలో బహుళపంటల సాగు చేపడితే ఏ రైతుకు ఇబ్బంది ఉండదని, సొంతంగా పంటను అమ్ముకొంటే రెండింతల లాభం పొందవచ్చని తెలిపారు. తన తండ్రి వరి సాగు చేసి ఏం సంపాదించలేదని, అందుకే తాను కూరగాయల సాగు చేయాలని నిర్ణయించుకొన్నానని వివరించారు. 5 గుంటల భూమిలో బీర సాగు చేసి, అమ్మితే ఎకరం పొలానికి వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం వచ్చిందని, తర్వాత కండక్టర్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేశానని వెల్లడించారు. ఆకు కూరలు, కూరగాయలతోపాటు పండ్లతోటలు సాగు చేశానని, ఎకరం భూమిలోనే నాలుగు నుంచి ఆరు రకాల పంటల సాగు చేపట్టానని తెలిపారు. మంచి లాభాలు వచ్చాయని, పదేండ్లలో 5 ఎకరాల సాగు నుంచి 25 ఎకరాలకు సాగు విస్తీర్ణం పెంచినట్టు రామారావు చెప్పారు. ప్రస్తుతం 18 రకాల పండ్లు, కూరగాయల సాగు చేస్తున్నానని పేర్కొన్నారు.
పదిహేనేండ్లుగా ఉద్యాన పంటలు సాగు చేస్తున్నానని, ఏటా సాగులో వైవిధ్యం కనబర్చటం వల్ల దిగుబడి బాగుంటున్నదని రామారావు తెలిపారు. పంట పొలాల్లోనే ఎరువులు, జీవామృతం తయారుచేస్తానని, కుళ్లిపోయిన కూరగాయులు, మట్టిని నానబెట్టిన నీళ్ల రసాయనాలే పురుగుల మందు తరహాలో పిచికారీ చేసానని వివరించారు. సీజనల్ వారీగా కూరగాయలు, పండ్లు, తేనె పట్టు కూడా తయారు చేస్తానని వెల్లడించారు. సేంద్రియ సాగుకు మెచ్చి అనేక సంస్థలు తనను అవార్డులతో సత్కరించాయని తెలిపారు. 2017లో రైతు నేస్తం అవార్డు, 2018 జిల్లా ఉత్తమ రైతు, 2020, 2021లో పలు కార్పొరేట్ సంస్థలు అవార్డులతో సత్కరించాయని పేర్కొన్నారు.
కేంద్రమేమో బియ్యం కొననంటున్నది.. వరికి మార్కెట్లో డిమాండ్ కూడా లేదు.. అలాంటప్పుడు ఆ పంట వేసి ఏం ప్రయోజనమని అంటున్నారు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచెలకకు చెందిన ఆదర్శ రైతు చెరుకూరి రామారావు. వరి సాగు ఒక ఎత్తు, మార్కెట్లో అమ్ముకోవటం ఇంకో ఎత్తు అని.. అందుకే మనమే పండించి, మన దగ్గరలోనే అమ్ముకొనే ఉద్యాన పంట సాగు చేస్తున్నానని అంటున్నారాయన.
పంటను సొంతంగా అమ్ముకొన్నా, ప్రాసెసింగ్ చేసి విక్రయానికి పెట్టినా రెండింతల లాభం వస్తుంది. కొద్ది రోజుల కిందట ఖమ్మంలో సొంతంగా ఆర్గానిక్ ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేశా. ఇద్దరు కొడుకులు ఉన్నత చదువు చదివినా, ఇందులో ఉన్న లాభాన్ని చూసి ఇటే మళ్లారు. కూరగాయలు, ఇతర పంటల ప్రాసెసింగ్, మార్కెటింగ్ చేస్తున్నారు. పొద్దున కోసిన కూరగాయలను మధ్యాహ్నంలోపు రైతుబజార్లో అమ్ముతాను. ఎక్కువ మొత్తంలో పంట చేతికొస్తే వరంగల్, విజయవాడకు ఎగుమతి చేస్తా. ఇటీవల ఆర్గానిక్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశా.
చెరుకూరి రామారావు (ఉత్తమ రైతు)
సెల్ నంబర్: 7995430697