ఆ వ్యవసాయ క్షేత్రం.. తీరొక్క పంటలతో కళకళలాడుతూ కనిపిస్తుంది. పాత పద్ధతులకు నూతన ఆలోచనలు మేళవించి చేస్తున్న ఇక్కడి వ్యవసాయం.. రైతు ఇంట సిరులు కురిపిస్తున్నది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం వీరాజ్పల్లికి చెందిన కొండారెడ్డి.. గో ఆధారిత వ్యవసాయంతో సేద్యాన్ని లాభసాటిగా మార్చాడు. అనేకమంది రైతులకు మార్గదర్శకుడిగా నిలుస్తున్నాడు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ వ్యవసాయంలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నాడు కొండారెడ్డి. తనకున్న 35 ఎకరాల్లో సిరుల పంటలు పండిస్తున్నాడు. సమాంతరంగా పాడినీ నిర్వహిస్తూ.. ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన రైతుబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుని, వచ్చిన సొమ్ముతో ఆవులను కొనుగోలు చేసి ఆదాయం సముపార్జిస్తున్నాడు. ఆవు పాల నుంచి వచ్చిన నెయ్యిని విదేశాలకు ఎగుమతి చేస్తూ భారీ లాభాలను కండ్ల చూస్తున్నాడు. పాలతో మజ్జిగ తయారుచేసి వివిధ పంటలు, మొక్కలపై పిచికారీ చేస్తూ, తెగుళ్ల బారినుంచి పంటలను కాపాడుకొంటున్నాడు.
ఆవులతో ఆదాయం..
రైతుబంధు సాయంతో 10 గిర్ అవులను కొనుగోలు చేశాడు కొండారెడ్డి. వీటిని ఆధారంగా చేసుకొనే సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు. పాలతో స్వచ్ఛమైన నెయ్యి తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నాడు. కిలోకు రూ.3,500 ధరతో అమ్ముతూ భారీ లాభాలను ఆర్జిస్తున్నాడు. మిగతా పాలతో మజ్జిగ చేసి, పసుపు, బెల్లం కలిపి సస్యరక్షణలో భాగంగా తెగుళ్ల నివారణకు వాడుతున్నాడు. ఆవు మూత్రంతో ద్రవ జీవామృతం, పేడతో ఘన జీవామృతం తయారుచేసి గో ఆధారిత వ్యవసాయంలో రాణిస్తున్నాడు.
క్షేత్రమంతా హరితహారం..
హరితహారం స్ఫూర్తితో తన క్షేత్రంలో వేల మొక్కలు నాటాడు కొండారెడ్డి. మామిడి, ఎర్రచందనం, కొబ్బరి, టేకు, వేప, శ్రీగంధం, ఉసిరి, పనస, నిమ్మ, దానిమ్మ, సీతాఫలం, మేడి, రేగు, మర్రి, ఈత, పోక, గనీ, చింత చెట్లను పెంచుతున్నాడు. ఇక్కడి వాతావరణానికి అనువుగా లేని యాలకులు, మిరియాల మొక్కలను అంతర్గత పంటగా సాగు చేస్తున్నాడు. 14 ఎకరాల్లో ఉన్న మామిడి తోట ద్వారానే ఏటా రూ.25 లక్షల ఆదాయం పొందుతున్నాడు. కొండారెడ్డి పండించిన ‘నవారా’ వడ్లు.. క్వింటాల్కు రూ.4,500 ధర పలుకుతున్నవి. పలు పోషక విలువలు కలిగిన ఈ ధాన్యం సాగు ద్వారా.. ఇతర రకాలతో పోలిస్తే రెండింతల ఆదాయం ఆర్జిస్తున్నాడు. సేంద్రియ పద్ధతిలో వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తున్నాడు. డిమాండ్ ఉన్నప్పుడే సరఫరా చేసేలా పంటలు వేస్తూ ప్రతిఫలం పొందుతున్నాడు.
…రాందేని చంద్రమౌళి
పండుగలా వ్యవసాయం..
ఉమ్మడి రాష్ట్రంలో దండుగ అనుకున్న వ్యవసాయాన్ని.. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పండుగలా మారుస్తున్నారు. సాగునీటి రంగంలోనూ సమూల మార్పులు వచ్చాయి. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి ఎకరానికీ నీరు అందుతున్నది. రైతుబంధు విప్లవాత్మక పథకం. పంట మార్పిడి ద్వారా భూమి సారవంతమై, వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. ఉద్యానశాఖ అందించే ప్రోత్సాహకాలు, యంత్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. సీఎం చేపట్టిన హరితహారం స్ఫూర్తిగా నా వ్యవసాయక్షేత్రంలో అడవిని తలపించేలా చెట్లు పెంచుతున్నాను. ఎకరానికి రూ.లక్ష సంపాదించాలన్నదే లక్ష్యం.
– గిన్నె కొండారెడ్డి, రైతు.