ఆ యువ దంపతులు పెద్ద్ద చదువులే చదివారు. కానీ, పెద్దపెద్ద కొలువుల కోసం ఎదురు చూడకుండా చిన్నప్పటి నుంచి చూస్తున్న పొలాల్లోనే బతుకుదెరువును వెతుక్కున్నారు. తమ ఆలోచనలకు తోడుగా ఆధునిక సాగు విధానాలను అందిపుచ్చుకుంటూ సేద్యాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. ఉపాధి అంటే ఉద్యోగమే కాదు వ్యవసాయం కూడా అంటున్నారు. విద్యాధికులైన ఆ దంపతులే బానోత్ భద్రు, అనిత. వాళ్లు ఉద్యాన శాఖ డివిజన్ అధికారి తోడ్పాటుతో కూరగాయల సాగును మొదలుపెట్టారు. మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా విభిన్నమైన కూరగాయలు పండిస్తూ సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయం ఎంత లాభసాటిగా ఉంటుందో నిరూపిస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం బొజ్జన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలో మారుమూలగా ఉంటుంది బీమ్లా తండా. 250 మంది నివసిస్తున్నారు. మూసపద్ధతిలో వ్యవసాయం చేసి నష్టాలను చవిచూశారు. వ్యవసాయం కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను దగ్గరగా చూసిన భద్రు ఎంఏ ఇంగ్లిష్ చేసినా, కొలువుల కోసం ఎదురు చూడకుండా ఐదేండ్ల కిందట కూరగాయల సాగును మొదలుపెట్టాడు. తమకున్న ఆరు ఎకరాల భూమిలో మూడు ఎకరాల్లో భార్యతో కలిసి కూరగాయలు పండిస్తూ ఆదాయం గడిస్తున్నాడు. తాము ఉపాధి పొందడంతోపాటు మరి కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు ఈ దంపతులు.
భద్రు మొదట అర ఎకరంలో బీర, కాకర సాగుచేశాడు. మంచి దిగుబడి రావడం.. ఆ సమయంలోనే ఉద్యానశాఖ డివిజన్ అధికారి రాకేశ్ పరిచయమై కూరగాయల సాగుపట్ల అవగాహన కల్పించడం వారి జీవితాన్నే మార్చివేసింది. ఇప్పుడు మూడు ఎకరాల్లో కూరగాయలు, మిగతా సగం పొలంలో ఇతర పంటలు పండిస్తున్నారు. ఇలా ఉంటే, ఉపాధి హామీ పథకంలో భాగంగా పందిరి సాగుకు ఎకరానికి రూ.లక్ష చొప్పున రెండు ఎకరాలకు రాయితీతోపాటు 90శాతం సబ్సిడీతో డ్రిప్ సౌకర్యాన్నీ పొందాడు. ప్రభుత్వం ప్రోత్సాహంతో బీర, కాకర, టమాట సాగు చేస్తున్నామని, మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నామని భద్రు, అనిత వెల్లడించారు. అధికారుల సహకారం వల్లే ఇదంతా సాధ్యమైందంటున్నారు.
రూ.5 లక్షల ఆదాయం
ఆరేండ్ల కింద ఎంఏ ఇంగ్లిష్ చేశా. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా. ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటున్నా. నాకు చిన్నప్పటి నుంచీ వ్యవసాయం అంటే ఇష్టం. కాబట్టి, రైతుగా బతకడానికే సిద్ధపడ్డాను. ప్రస్తుతం రెండు ఎకరాల్లో బీర, కాకర సాగుచేస్తున్నా. మరో ఎకరంలో టమాట వేసేందుకు నారు పెంచుతున్నా. గత ఏడాది బీర, కాకర సాగుచేశా. అన్ని ఖర్చులూ పోగా రూ.5లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఈసారి కూడా అవే పంటలు వేశా. ఎప్పటికప్పుడు ఉద్యాన శాఖ అధికారుల సలహాలు, సూచనలు తీసుకుని మెరుగైన దిగుబడులు సాధిస్తున్నా.
– బానోత్ భద్రు
భర్తకు తోడుగా
డిగ్రీ, టీటీసీ పూర్తి చేసినప్పటికీ, నా భర్తకు పొలం పనుల్లో సహకరిస్తున్నా. మేము సాగుచేసిన కూరగాయలను ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా కేంద్రాలకు మా ఆటోలో అమ్మకానికి తీసుకెళ్తాం. టమాటతో మరింత ఆదాయం వస్తుంది. ఇప్పుడు ధర బాగా ఉంది. ఇలాగే ఉంటే ఎకరానికి రూ.10 లక్షల వరకు ఆదాయం రావచ్చు. వాతావారణం అనుకూలించకపోవడంతో ఈ ఏడాది లాభం తక్కువగా ఉంది. నష్టం మాత్రం రాలేదు.
– బానోతు అనిత
…?సలుగు నాగన్న