సమీకృత జాతీయ నూనె గింజల పథకంలో భాగంగా ఆయిల్పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. అత్యధికంగా వంటనూనె దిగుబడిని ఇచ్చే బహు వార్షిక పంటలలో ఆయిల్పామ్ ప్రధానమైనది. జాతీయ ఆయిల్పామ్ పరిశోధన సంస్థ ‘విజన్ 2050’ నివేదిక ఆధారంగా 2050 నాటికి ఆయిల్పామ్ సాగు విస్తృతం చేయాలనేది లక్ష్యం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సంప్రదాయ పంటల స్థ్దానంలో మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని రైతులను కోరుతున్నది. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా ఆయిల్పామ్ సాగు చేయాలనే లక్ష్యంతో రైతులను సమాయత్తం చేస్తున్నది.
ఆయిల్పామ్కు వాణిజ్యపరంగా స్థానికంగా విస్తారమైన మార్కెట్ అందుబాటులో ఉంది. కాబట్టి, ఈ పంట సాగుతో రైతులు అధిక లాభాలను ఆర్జించేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం ప్రత్యేక ఆయిల్పామ్ క్షేత్ర ప్రదర్శనలను చేపడుతూ రైతులకు అవగాహన కల్పిస్తున్నది జయశంకర్ భూపాలపల్లి ఉద్యానవన శాఖ. రైతులకు సూక్ష్మ సేద్య పరికరాలు, డ్రిప్ మంజూరులో రాయితీ, పంటల సాగుపై ప్రత్యేక రుణ సదుపాయాలు కల్పిస్తున్నది. ఆయిల్పామ్ రైతులు మూడేండ్ల వరకు వివిధ రకాల అంతర పంటలు సాగుచేయడం వల్ల అదనపు లాభాన్ని కూడా పొందడానికి వీలుంది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి జిల్లాలో ఆయిల్పామ్ సాగుకు ఆ జిల్లా ఉద్యానవన శాఖ కృషిచేస్తున్నది.
19,900 హెక్టార్లలో సాగు ప్రణాళిక
గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న భూపాలపల్లి జిల్లాలో 11 మండలాల పరిధిలో సుమారు 19,900 హెక్టార్లలో ఆయిల్పామ్ సాగు చేపట్టాలనే ప్రభుత్వ కార్యాచరణను అమలు చేసే దిశగా జిల్లా ఉద్యానవన శాఖ సంకల్పించింది. జిల్లావ్యాప్తంగా భూపాలపల్లి మండలంలో 2,600 హెక్టార్లు, పలిమెలలో 1,500, కాటారంలో 1,600, మహదేవపూర్లో 2,100, మహాముత్తారంలో 2,000, మల్హార్రావులో 2,100, చిట్యాలలో 1,600, మొగుళ్లపల్లిలో 1,600, టేకుమట్లలో 1,600, రేగొండలో 1,600, గణపురంలో 1,600 హెక్టార్లలో ఆయిల్పామ్ సాగుకు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించారు అధికారులు. 2021లో 363 హెక్టార్లలో సాగుచేయగా, ఈ ఏడాది ఏకంగా 10వేల ఎకరాలకు విస్తరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
రేగొండలో ప్రత్యేక నర్సరీ
ఆయిల్పామ్ రైతులకు మొక్కలను అందించడానికి రేగొండలో 23 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక నర్సరీని ఏర్పాటుచేశారు. జిల్లావ్యాప్తంగా రైతులకు సరఫరా చేయడానికి 4,20,000 మొక్కలను ఈ నర్సరీలో పెంచుతున్నారు. జిల్లాలో 2021లో 126 మంది రైతులకు 481 ఎకరాల్లో నాటడానికి 27,417 మొక్కలను పంపిణీ చేశారు. 2022 ఆగస్టు నుంచి మార్చి వరకు 7 వేల ఎకరాల్లో 3,99,000 మొక్కలను నాటనున్నారు. ఆయిల్పామ్ రైతులకు వంద శాతం సబ్సిడీపై సూక్ష్మ సేద్యంలో భాగంగా డ్రిప్ను మంజూరు చేయడంతోపాటు, మూడేండ్ల వరకు అంతరపంటల సాగుకు బ్యాంకు రుణాలను అందుబాటులో ఉంచే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నది. మూడు సంవత్సరాల నుంచి ఆయిల్పామ్ మార్కెటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తగినన్ని రాయితీలను కల్పిస్తున్నది.
…?గుజ్జ సారేశ్వర్ రావు