మామడ, ఆగస్టు 24 : పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం శ్రావణ మాసంలో చాలా ప్రత్యేకం. ముత్తైదువులు తమ ఇంట, ఆలయాల్లో ప్రత్యేకంగా వరలక్ష్మీవ్రతం అచరిస్తారు. అమ్మవారికి పూలు, పండ్లు నైవేద్యంగా సమర్పించి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. కొత్తగా పెళ్లయిన యువతులు తొలి పండుగగా భావిస్తారు. అత్తవారింట్లో పూజలు చేసేందుకు సామగ్రి కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. మహిళలు వరలక్ష్మీవ్రత ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం జిల్లావ్యాప్తంగా అన్ని అమ్మవారి ఆలయాల్లో వ్రతం నిర్వహించనున్నారు.
కోరిన కోర్కెలు తీర్చే వరలక్ష్మీ..
సర్వ మంగళ సంప్రాప్తితో నిత్య సుమంగళిగా వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. భక్తుల కొంగు బంగారం, వరాలిచ్చే మహాలక్ష్మీయే వరలక్ష్మీ. అష్టలక్ష్మీల్లో వరలక్ష్మీ దేవికి ఒక ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కన్నా వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్ర్తాలు చెబుతున్నాయి. మహా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణమాసంలో ఈ వ్రతాన్ని అచరిస్తే విశేష ఫలితాలు లభిస్తుంటాయంటారు. సకల శుభకరం, మంగళకరమైన వరలక్ష్మీదేవి పూజ మహిమాన్వితమైనదని భక్తుల నమ్మకం.
సకల ఐశ్వర్యాలు పొందే వ్రతం..
పరమేశ్వరుడు వరలక్ష్మీవ్రతం గురించి పార్వతీదేవికి వివరించాడని స్కంద పురాణం చెబుతున్నది. లోకంలో స్త్రీలు సకలైశ్వర్యాలు పొందేందుకు వీలుగా ఏదైనా వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుడ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు వరలక్ష్మీ వ్రత మహాత్యాన్ని వివరించాడు. శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేస్తాడు. మగధరాజ్యంలో చారుమతి అనే సాధ్వి ఉండేది. భర్తపై ఆదరణ, అత్తామామలపై గౌరవాన్ని ప్రకటిస్తూ ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తుండేది. మహాలక్ష్మీదేవిపై ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆమె సద్గుణాలకు మెచ్చిన ఆదిలక్ష్మీ స్వప్నంలో ప్రత్యేక్షమై ‘చారుమతి.. నీ సద్గుణములకు నేను మెచ్చితిని.. శ్రావణ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం వ్రతం చేయు. అప్పుడు నీవు కోరిన కోర్కెలు తీర్చెదను’ అని చెప్పిందని తన స్వప్న వృత్తాంతాన్ని భర్తకు చెప్పి వ్రతం చేయడానికి సంకల్పించింది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతం ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదలను అందుకుందని ఈశ్వరుడు గౌరీకి వివరించాడు. పార్వతీదేవి కూడా వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మీ కృపకు పాత్రులవుతుంది.
వ్రతం ఆచరించే విధానం..
మహిళలు తెల్లవారుజామున వాకిళ్లను రంగులతో శోభాయమానం చేసి, ఇండ్లను తోరణాలతో అలంకరిస్తారు. పూజా సామగ్రి సిద్ధం చేసుకొని, ఇంట్లో పూజా స్థలాన్ని ఏర్పరుచుకొని శుభ్రపరుస్తారు. బియ్యపు పిండితో అలికి మండపాన్ని ఏర్పాటు చేసుకుంటారు. పసుపు గణపతిని చేసి పూజించి, కలశంలో వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి షోడశోపచార పూజలు చేస్తారు. దేవికి ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి, అష్టోత్తర శతనామాలతో పూజలు చేస్తారు. మంగళ హారతితో పూజిస్తారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన వంటలు, పండ్లను సమర్పిస్తారు. చివరగా వాయనదాన మంత్రం తో ఒక ముత్తయిదువును మహాలక్ష్మీగా భావిం చి వాయినాలు ఇస్తారు.
వాయినం ఇచ్చుకొనే ఆచారం..
వ్రతం పూర్తిచేసిన అనంతరం ఇంటికి వచ్చిన సుహాసినులకు వాయినం ఇచ్చుకోవడం ఎంతో శుభప్రదం. వాయినంగా పసుపు, కుంకుమ, 12 లడ్డూలు లేదా అరిసెలు, అరటిపండ్లు తమలపాకులు, పోక వక్కలతో పాటు కనుము ఇచ్చి సుహాసినుల అశీర్వాదం తీసుకోవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన లడ్డూలు, పులిహోర, పొంగలి నైవేద్యాన్ని సమర్పించి సుహాసినులందరికీ ప్రసాదంగా ఇచ్చి వ్రతం అచరించినవారు తీసుకోవాలి.
నెలంతా.. ఆధ్యాత్మికతే..
ఈ యేడాది నిజ శ్రావణం ఆగస్టు 17తో ప్రారంభమైంది. ఈ నెలలోనే పండుగలు, పూజాధికాలు నిర్వహిస్తుంటారు. కాగా, శ్రావణమాసంలో మొదటి పండుగ మంగళగౌరీ వ్రతం. ఆ తర్వాత నాగ, గరుడ పంచమిలు, నారసింహ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ (జంధ్యాల), రాఖీ పూర్ణిమ, హయగ్రీవ జయంతి, గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు, శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ నెలలోనే వస్తాయి. శ్రావణ సోమవారాలు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మంగళగౌరీ వ్రతం : ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ముత్తయిదువలు, పెండ్లికాని యువతులు ఆచరించే మంగళగౌరీ వ్రతం అత్యంత విశేషమైంది. అమ్మవారిని షోడశోపచారాలతో, అష్టోత్తర శతనామాలతో పూజిస్తారు. పసుపు, బంగారం, వెండితో గౌరమ్మను పూజిస్తే సుఖ సంపదలు, ధనధాన్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. పెండ్లికాని వారికి వివాహం అవుతుందని ప్రగాఢ విశ్వాసం. చివరి వారంలో పసుపు, కుంకుమలతో వాయినాలు సమర్పించుకుంటారు.
వరలక్ష్మీ వ్రతం : నిత్య సౌభాగ్యం కోసం మహిళలు ఆచరింఏ వ్రతాల్లో వరలక్ష్మీ వ్రతం ఒకటి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రత్యేకంగా అమ్మవారికి కుంకమార్చనలు చేస్తారు. అష్ట ఐశ్వర్యాలు, సౌభాగ్యాలతో వర్ధిల్లేలా చూడాలని అమ్మవారిని కోరుకుంటారు.
శ్రావణ పూర్ణిమ : శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమనే శ్రావణ పూర్ణిమ అంటారు. రక్షాబంధన్, జంధ్యాల పౌర్ణమిగా జరుపుకుంటారు. ఇదే రోజున హయగ్రీవ, సంతోషిమాత జయంతి కూడాకావడం విశిష్టత. మాతను ఆరాధించడం ద్వారా సకల పాపాలు తొలగి శుభాలు కలుగుతాయన్నది హిందువుల నమ్మకం.
శ్రీకృష్ణాష్టమి : శ్రావణ కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీకృష్ణుడి జన్మాష్టమిగా జరుపుకుంటారు. ఒక్క కృష్ణాష్టమి వ్రతాన్ని నిష్ఠతో ఆచరిస్తే సంవత్సరంలో 24 ఏకాదశి వ్రతాలు చేసిన పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున పల్లె, పట్టణాల్లో ఉట్టి సంబురాలు, చిన్నారులను గోపికలు, చిన్ని కృష్ణులుగా అలంకరించి మురిసిపోతారు.
వరలక్ష్మీ వ్రతానికి ప్రత్యేకత ఉంది..
అష్టలక్షులలో వరలక్ష్మీదేవికి ప్రత్యేకత ఉంది. మిగిలిన అమ్మవార్ల పూజలకంటే వరలక్ష్మీపూజ శ్రేష్ఠమైంది. శ్రీహరికి ఇష్టమైన విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణంలో ఈ వ్రతం చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి. మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే వ్రతం అంటే అది వరలక్ష్మీ వ్రతమే.
– రమాకాంత్ జోషి, పురోహితుడు