మామడ, సెప్టెంబర్ 10 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తుండడంతో గ్రామాలు ప్రగతిపథంలో పయనిస్తున్నాయి. మండలంలో గతంలో 14 గ్రామ పంచాయతీలు ఉండగా 2018లో ప్రభుత్వం 13 గ్రామ పంచాయతీలను నూతనంగా ఏర్పాటు చేసింది. ఆయా గ్రామాల్లో ప్రభుత్వం నుంచి విడుదలవుతున్న నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. డంప్యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు ఇప్పటికే పూర్తి కాగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు తదితర పనులు దశల వారీగా జరుగుతున్నాయి.
మండలంలో 15 గ్రామ పంచాయతీ భవనాలకు రూ.20 లక్షల చొప్పున రూ.3 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. కాగా కొరిటికల్ గ్రామ పంచాయతీ నిర్మాణం పూర్తికాగా రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఇటీవల ప్రారంభించారు. ఆరెపల్లి, మొండిగుట్ట, రాశిమెట్ల పంచాయతీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
గతంలో గ్రామాల్లో చెత్తను రోడ్ల వెంట, జనవాసాలకు దగ్గరగా ఖాళీ ప్రదేశాల్లో వేసేవారు. దీంతో మురుగు నిల్వ ఉండి ప్రజలు వ్యాధులు బారిన పడేవారు. ప్రస్తుతం ప్రభుత్వం గ్రామాల్లో డంప్ యార్డులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చెత్తను తరలిస్తుండడంతో పరిశుభ్రత నెలకొని రోగాలు తగ్గుముఖం పట్టాయి. గతంలో బురదమయంగా ఉంటే మట్టిరోడ్లకు దశల వారీగా సీసీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడంతో గ్రామగ్రామాన నర్సరీలు, పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. దీంతో మండలంలోని అన్ని గ్రామాల్లో అవెన్యూ ప్లాంటేషన్, ప్రకృతి వనాలతో పచ్చదనం పరుచుకుంది.
పల్లె ప్రగతితో గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొరిటికల్ పంచాయతీ భవనం ఇటీవల పూర్తి కాగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం మూడు నూతన పంచాయతీ భవన నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మిగిలిన పంచాయతీ భవనాల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయి. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలి.
-రమేశ్, ఎంపీడీవో, మామడ