ఆసిఫాబాద్/లింగాపూర్, మార్చి 29: నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకెళ్లి పార్టీని మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పిలుపునిచ్చారు. లింగాపూర్ మండలంలోని పిట్టగోడ వద్ద బుధవారం ఎమ్మెల్యే ఆత్రం సకు అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మితో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కోనేరు కోనప్ప మాట్లాడుతూ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో అనేక పథకాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు. వర్షం పడితే కప్పలు వచ్చినట్లు, ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొన్ని పార్టీల నాయకులు హడావిడి చేస్తుంటారని ఎద్దేవా చేశారు. వారి ప్రలోభాలకు లొంగకుండా, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్కు అండగా ఉండాలని సూచించారు.
చిన్న మండలం అయినప్పటికీ 1221 పెన్షన్లు, 4002 మందికి రైతుబంధు, ఎనిమిది మందికి రైతుబీమా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎన్నో పథకాలు మన కళ్లముందే అమలవుతున్నాయని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మనలా ఏ ఒక్క పథకమూ అమలుకావడం లేదన్నారు. పోడు భూముల సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపేందుకు సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారని తెలిపారు.
గత ప్రభుత్వాల హయాంలో రైతులు ఎంతో గోసపడ్డారని, ఇప్పుడు ఆ కష్టం తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. పాలిచ్చే బర్రెను కాదని, పొడిచే దున్నపోతులను రాణిస్తే భవిష్యత్ అంధకారమవుతుందని సూచించారు. అభివృద్ధి విషయంలో అటవీ శాఖ సిబ్బంది అడ్డుపడితే, మీకు అండగా మేముంటామని ప్రజల్లో మనోధైర్యం నింపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలతో పబ్బం గడిపేవాళ్లని దగ్గరికి రానివ్వొద్దని సూచించారు.