ఆదిలాబాద్, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలంలో సాధారణ వర్షపాతం 1,200 మిల్లీమీటర్లు నమోదు కాగా.. ఈ యేడాది అధిక వర్షపాతం కురిసింది. బోథ్, నేరడిగొం డ, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, సిరికొండ, ఉట్నూర్, నార్నూర్, ఆదిలాబాద్ రూరల్, నార్నూర్, గుడిహత్నూర్ మండలాల్లో గరిష్ఠంగా పడింది. జూలైలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, వ్యవసాయ బావులు, ఇతర సాగునీటి వనరులు జలకళను సంతరించుకున్నాయి. తర్వాత మోస్తరు వర్షాలు పడగా.. ప్రస్తుతం వానకాలం ముగిసి చలికాలం ప్రారంభమైంది. ఈ యాసంగిలో 1.30 లక్షల ఎకరాల్లో శనగ, గోధుమ, పల్లి, జొన్న పండే అవకాశం ఉండగా.. ప్రాజెక్టుల నుంచి విడుతలవారీగా అధికారులు నీటిని సరఫరా చేస్తారు. చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో ఆయకట్టు రైతులకు ఇబ్బందులు లేవు.
జిల్లాలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది భూగర్భజల నీటమట్టం బాగా పడిపోయింది. భూగర్భజలనీటిమట్టం. నాణ్యతను తెలుసుకోవడానికి భూగర్భజలశాఖ అధికారులు 10 సాధారణ పరిశీలకబావులు, 26 ఫీజోమీటరు బావులను ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. ఫీజో మీటర్ల ఆధారంగా నీటిమట్టాన్ని లెక్కించారు. గతేడాది ఆగస్టులో భూగర్భజల నీటిమట్టం 1.76 మీటర్ల పైకి ఉండగా ఈ ఏడాది ఆగస్టు నెలలో 2.26 మీటర్లకు పడిపోయంది గతేడాది ఆగస్టుతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 1.12 మీటర్లు లోతుకు పడిపోయాయి… గతేడాది సెప్టెంబరులో భూగర్భజలాలు 1.73 మీటర్ల పైకి ఉండగా ఈ ఏడాది సెప్టెంబరులో 2.70 మీటర్లకు పడిపోయాయి. గతేడాది సెప్టెంబరుతో పోల్చుకుంటే ఈ ఏడాది సెప్టెంబరులో భూగర్భ జలం 0.97 మీటర్ల కిందికి చేరింది. గతేడాది ఆగస్టు, సెప్టెంబరు నెలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో భూగర్భ జలాలు ఆ రెండు నెలల్లో ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం జులైలో భారీ వర్షాలు పడగా ఆగస్టులో మోస్తారు వానలు పడ్డాయి దీంతో గతేడాది కంటే ఈ సంవత్సరం రెండు నెలల్లో భూగర్భజల నీటిమట్టం తక్కువగా నమోదైంది. గతేడాదితో పోల్చేతే ఈ సంవత్సరం నీటిమట్టం పడిపోయిన సాగునీరు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు అంటున్నారు.