ఆదిలాబాద్, ఏప్రిల్ 9(నమస్తే తెలంగాణ) : మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందు కు కేసీఆర్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నది. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువులకు మరమ్మతులు చేపట్టింది. దీంతోపాటు మత్స్యకారుల కుటుంబాలకు ఉచితం గా చేప పిల్లలను పంపిణీ చేసింది. ఆదిలాబాద్లో రూ.10 లక్షలతో చేపల మార్కెట్ను నిర్మించి మార్కెటింగ్ సౌకర్యం కల్పించింది. వలలు, ఇతర సామగ్రిని అందించింది. చేపలను విక్రయించుకునేందుకు ద్విచక్ర, ఫోర్ విల్లర్స్ను పంపిణీ చేసింది.
ఆదిలాబాద్ జిల్లాలో 85 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 4,496 మంది సభ్యులుగా ఉన్నా రు. జిల్లాలో గతేడాది జూలైలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు, చెరువులు నిండిపోయాయి. ప్రాజెక్టులు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకోవడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువనకు వదిలారు. మత్స్యకారులకు ఉపాధిని మెరుగుపర్చడానికి కేసీఆర్ ప్రభు త్వం గతేడాది వానకాలంలో 222 చెరువులు, రెండు రిజర్వాయర్లలో 1.18 కోట్ల చేప పిల్లలను, 14.61 లక్షల రొయ్య పిల్లలను వదిలారు.
జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువుల్లో చేపలను కొనుగోలు చేయడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ర్టాల నుంచి వ్యాపారులు వచ్చేవారు. గతేడాది జిల్లాలో 222 చెరువులు, రెండు ప్రాజెక్టుల్లో వదిలిన చేప పిల్లలు పెరిగిన తర్వాత ఈ సమయంలో మత్స్యకారులు పట్టుకుని విక్రయించేవారు. జిల్లాలో 6 వేల టన్నులకుపైగా చేపల ఉత్పత్తి జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా జూలైలో మాత్రమే వర్షాలు బాగా పడగా ఆ తర్వాత పడలేదు. ఫలితంగా సాగు నీటి వనరుల్లో నీటిమట్టం తగ్గిపోవడంతో చేప పిల్లల పెరుగుదలపై ప్రభావం పడింది.
చేప పిల్లల పంపిణీ జాప్యం కూడా ఉత్పత్తి తగ్గడానికి కారణంగా చెప్పవచ్చు. ప్రాజెక్టులు, చెరువుల్లో వదిలిన చేపపిల్లలు అరకిలో వరకు మాత్రమే పెరగడంతో ధర సరిగా రాదని, విక్రయించి లాభం లేదని లబ్ధిదారులు మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. యేటా ఈ సమయానికి ఆదిలాబాద్ చేపల మార్కెట్ కొనుగోలుదారులతో రద్దీగా ఉండేది. ఇప్పుడు చేపలు సరిగా రాక జనం కనిపించడం లేదు. చేపలను కొనుగోలు చేయడానికి ఇతర రాష్ర్టాల నుంచి రావడం లేదు. ఈ ఏడాది చేపల ఉత్పత్తి తగ్గిపోవడంతో మత్స్యకారులకు ఉపాధి కరువైంది. కుటుంబపోషణకు వారు ఇతర పనులు చేసుకోవాల్సి వస్తున్నది.