జైపూర్, మార్చి 9 : వేలాల జాతరకు శనివారం రెండో రోజూ భక్తులు పోటెత్తారు. శుక్రవారం గుట్టపై గట్టు మల్లన్నకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు, శనివారం సమీప గోదావరి పుష్కరఘాట్ల వద్ద పుణ్యస్నానాలాచరించారు. గొర్రె పిల్లలతో గోదారమ్మకు మొక్కులు అప్పగించారు. ఆపై మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. పట్నాలు వేసి బోనాలు సమర్పించారు.
ఎంపీడీవో సత్యనారాయణ సిబ్బందితో కలిసి పుష్కరఘాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పారిశుధ్య లోపం తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. జాతరలో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ ఈవో రమేశ్ తెలిపారు. ఇక ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. శ్రీరాంపూర్ సీఐ బన్సీలాల్ , జైపూర్ ఏస్ఐ ఉపేందర్రావుతో పాటు సిబ్బంది భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూశారు.