కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా అటవీ అందాలు.. కొండకోనలు.. గలగల పారే సెలయేళ్లు చూడముచ్చటగొలుపుతాయి. సహజసిద్ధ అందాలకు తోడు పలు ప్రాంతాల్లో అర్బన్ నేచర్ పార్కులు ఏర్పాటు చేసి మరింత శోభను తీసుకొచ్చారు. ఆసిఫాబాద్ జిల్లాకేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో అడ ప్రాజెక్టు పక్కన సుమారు 10 హెక్టార్లలో, కాగజ్నగర్ డివిజన్ కేంద్రానికి సమీపంలో సిర్పూర్(టీ) వెళ్లే రహదారి పక్కన అర్బన్ పార్కులు ఏర్పాటు చేశారు.
రూ. 60 లక్షలతో ఏర్పాటు చేసిన ఈ పార్కులు జూన్లో అందుబాటులోకి వచ్చాయి. ప్రకృతి రమణీయ దృశ్యాలను కనులారా చూసేందుకు అనువుగా వీటిని తీర్చిదిద్దారు. పార్కుల్లోకి వచ్చే ప్రధాన గేట్లను ప్రత్యేకంగా అలంకరించారు. కాగజ్నగర్లోని పార్కులో ప్రత్యేకంగా యోగా సెంటర్ను ఏర్పాటు చేశారు. సుమారు 45 వేల చెట్లను పెంచారు. అడవుల్లో అమర్చిన కెమెరాలకు చిక్కిన వన్యప్రాణులు, పక్షుల ఫొటోలను కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. వర్షాకాలంలో అక్టోబర్, నవంబర్ నెలల్లో సహజసిద్ధమైన అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.