ఎదులాపురం, జూలై 4 : తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పోరాడిన అమరుల త్యాగాలు ఎన్నటికీ మరువలేమని ఆదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం దొడ్డి కొమురయ్య వర్ధంతి నిర్వహించారు. అదనపు కలెక్టర్, అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని, ఆయన ఉద్యమ సమయంలో చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఆర్డీవో రాథోడ్ రమేశ్, కలెక్టరేట్ పరిపాలన అధికారి అరవింద్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజలింగం, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాజేశ్వర్, బీసీ సంఘం నాయకులు చిక్కాల దత్తు, శంకర్, అనసూయ, ఉమామహేశ్వరి, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.