ఇంద్రవెల్లి : సంస్కృతి, సంప్రదాయలతోపాటు ఆదివాసీల ఆచారాలను పాటిస్తూనే పిల్లలకు ఉన్నత చదువులు చదివించి విద్యాపరంగా అభివృద్ధి చెందాలని ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదివాసీ గిరిజనులకు సూచించారు. మండలంలోని కెస్లాపూర్ గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన గుస్సాడీ దండారి ఉత్సవాల్లో ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్తో కలిసి పాల్గొని ఏత్మాసూర్ పెన్ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెస్లాపూర్ నాగోబా జాతరతోపాటు నాగోబా చరిత్ర దేశంలోనే పేరు ప్రతిష్టలు గాంచిందన్నారు. గ్రామస్తులు ఐక్యమత్యంతో ఉండడానికి నాగోబా జాతర ఉత్సవాలు నిదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.
గుస్సాడీ దండారి ఉత్సవాలు అద్భుతంగా ఉన్నాయని వాటిని భావితరాలకు అందించాలని సూచించారు. దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రజల సహకారంతో పోలీసు శాఖ ప్రజలకు మరింత సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటు మంచి మార్గాలను ఎంచుకొని సమాజంలో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ సైదారావ్, ఎస్ఐ నందిగామ నాగ్నాథ్, కెస్లాపూర్ గ్రామపటేల్ మెస్రం వెంకట్రావ్పటేల్, సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్ తదితరులు పాల్గొన్నారు.