బజార్హత్నూర్, జనవరి 8 : మహిళలు, యువతులు స్వశక్తితో ఎదగాలంటే వారికి ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండాలి. గ్రామాల్లో ఉన్నవారికి ఉపాధి అంతంత మాత్రంగానే ఉంటుంది. కాగా, కుట్టు పని వారిలో నూతనోత్తేజాన్ని నింపుతున్నది. దీనికి తగు శిక్షణ అవసరం. దీన్ని అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో ముందుకొచ్చిన జనశిక్షణ సంస్థ రాష్ట్రంలో ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో శిక్షణను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో మహిళలు, యువతులకు పలు రకాల ఉపాధి అవకాశాలు పెంచేలా శిక్షణ ఇస్తున్నది.
యువతులకు చదవుతో పాటు వారు భవిష్యత్లో ఉపాధి పొందేందుకు వివిధ అంశాలపై శిక్షణ అవసరం. మహిళలకు సైతం కుట్టు శిక్షణ ఇచ్చేందకు జనశిక్షణ్ సంస్థ ఆయా మండలాల్లోని గ్రామాల్లో యువతులు, మహిళల కోసం శిక్షణ కేంద్రాలను నెలకొల్పింది. దీని ద్వారా కుట్టులో ఉచిత తర్ఫీదు అందిస్తున్నారు. కేవలం కుట్టుశిక్షణనే కాకుండా మగ్గం వర్క్, బ్యుటీషియన్, ఉలన్ వర్క్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో నడుస్తున్న జనశిక్షణ్ సంస్థ అందించే తర్ఫీదుల ద్వారా వందలాది మంది మహిళలు, యువతులు శిక్షణ పొందుతున్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి మూడు నెలల పాటు కుట్టుతో పాటు ఇతర ఉపాధి అవకాశాలపై మెళకువలు నేర్పిస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లతో పాటు బా్ంయక్ ద్వారా రుణ సదుపాయాన్ని కూడా అందజేస్తున్నారు.
శిక్షణకు వచ్చిన వారికి మొదట దుస్తుల కటింగ్పై శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత యంత్రంపై ఎలా కుట్టాలో నేర్పిస్తారు. ముందుగా కాగితంపై తర్ఫీదు ఇచ్చి అనంతరం బట్టలపై ఇస్తారు. జాకెట్లు, చుడీదార్లు, తదితరవి ఎలా కుట్టాలో నేర్పిస్తున్నారు. డిజైన్లు కుట్టడంలో సైతం మెళకువలు ఇస్తున్నారు. సరికొత్త డిజైన్లు కుట్టేలా ప్రోత్సహిస్తున్నారు. సొంతంగా ఉపాధి లభించేలా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఏడాదిలో 1800 మందికి వివిధ రకాల వృత్తులపై శిక్షణ ఇస్తున్నారు.
ఈ కేంద్రాల్లో మూడు నెలల పాటు మహిళలు, యువతులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నాం. యువతులు, మహిళలు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. జనశిక్షణ సంస్థ ఆద్వర్యంలో ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నాం. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువీకరణ పత్రంతో పాటు బ్యాంకు రుణాలు అందిస్తున్నాం.
– తడక రూప, కుట్టు శిక్షకురాలు
జన శిక్షణ సంస్థాన్ ద్వారా ఏడాది కాలంలో 1800 మందికి ఉచితంగా వివిధ రకాల వృత్తి విద్య శిక్షణ కార్యక్రమాలు నేర్పిస్తున్నాం. మహిళలు, యువతులను జీవనోపాధి వైపు నడిపిస్తున్నాం. వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నాం. జనశిక్షణ సంస్థాన్లో నేర్చుకున్న లబ్ధిదారులకు సర్టిఫికెట్లు పొంది బ్యాంకుల ద్వారా సొంత ఖర్చులతో షాపులు ఏర్పాటు చేసుకొని లబ్ధి పొందుతున్నారు.
– మ్యాదిరి శ్యామల, జనశిక్షణ సంస్థాన్ డైరెక్టర్, ఆదిలాబాద్