సమైక్య పాలకుల పట్టింపులేని తనంతో అధ్వాన స్థితిలో ఉన్న పోరుగడ్డ, స్వరాష్ట్రంలో ప్రగతిబాట పట్టింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చిన సీఎం కేసీఆర్, కుమ్రం భీం ఆశయాలకనుగుణంగా పాలన చేపడుతున్నారు. జోడేఘాట్తో పాటు 11 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, వాటి రూపురేఖలు మార్చివేశారు. 500 జనాభా ఉన్న తండాలు, గూడేలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి మా ఊళ్లో మా రాజ్యం కలను సాకారం చేశారు. తాజాగా.. 6 శాతం ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. కాగా, ఆదివారం కుమ్రం భీం 82వ వర్ధంతి నిర్వహించనుండగా, శుక్రవారం ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి ఏర్పాట్లు పరిశీలించారు. ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరుకానున్నట్లు వారు తెలిపారు.
– కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/కెరమెరి, అక్టోబర్ 7
ఒకప్పుడు కాలినడక కూడా కష్టంగా సాగే జోడేఘాట్ గ్రామానికి తెలంగాణ ప్రభుత్వం రూ.15.70 కోట్లతో రెండు వరుసల రహదారి నిర్మించింది. దీంతో దారి కష్టాలు శాశ్వతంగా దూరమయ్యాయి. రూ.25 కోట్లతో గిరిజన మ్యూజియం, స్మారక చిహ్నం, స్మృతి వనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జోడేఘాట్ పరిసరాల్లోని 12 ఆదివాసీ గ్రామాల అడవి బిడ్డలకోసం రూ.2.95 కోట్లతో చేపట్టిన ఆశ్రమ పాఠశాల నిర్మాణం పూర్తయ్యింది. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, చుట్టుపక్కల 11 గ్రామాలకు ఇంటింటికీ స్వచ్ఛమైన నీటిని ప్రభుత్వం అందిస్తున్నది. జోడేఘాట్ గ్రామానికి త్రీఫేస్ విద్యుత్ వసతి కల్పించారు. గిరిజన రైతులకు 30 మంది రైతులకు ఎడ్ల జతలు, బండ్లను ఐటీడీఏ ద్వారా అందించారు. విద్య, వైద్య సదుపాయాలు అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణ ప్రభుత్వ పాలనలో ఏడేండ్లుగా జోడేఘాట్ గ్రామాలు అభివృద్ధి బాటపట్టాయి. ప్రత్యేకంగా 26 డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేసిన ప్రభుత్వం.. వాటి నిర్మాణాలను శరవేగంగా చేపడుతున్నది. మూడు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. కుమ్రం భీం కలలుగన్న ఆదివాసీ గ్రామాల స్వేచ్ఛ- అభివృద్ధి ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం అక్షరాల నిజం చేస్తున్నది.
రిజర్వేషన్ల పెంపుతో ఆనందం
ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు తాజాగా 10 శాతం రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. దీంతో గతంలో ఆరు శాతం ఉన్న రిజర్వేషన్లు ప్రస్తుతం 10 శాతానికి పెంచడంతో గిరిజనుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. కుమ్రం భీం ఏ ఆశయాలు సాధించేందుకు పోరాటం చేశారో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని నిజం చేసి చూపిస్తున్నారని గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వర్ధంతికి ముస్తాబైన జోడేఘాట్
కెరమెరి, అక్టోబర్ 7: కుమ్రం భీం 82వ వర్ధంతి వేడుకలకు జోడేఘాట్ ముస్తాబైంది. కుమ్రంభీ ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు నిర్మాణాలను చకచకా పూర్తి చేస్తున్నారు. భీం స్మృతి చిహ్నం వద్ద గతంలో టైల్స్ వేయగా, అవి ఊడిపడుతుండడంతో వాటిని తొలగించి మరమ్మతులు చేసి రంగులు దిద్దుతున్నారు. ధీర భూమి వద్ద విరివిగా మొక్కలు నాటి ప్రకృతివనంలా తీర్చిదిద్దడంతో పాటు మొక్కలను సంరక్షించేందుకు పర్యవేక్షణకు రెండు మంచెలను నిర్మించారు. దర్బార్ ఏర్పాటు చేసే ప్రాంతంలో శాశ్వత స్టేజీ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. హట్టి గ్రామంలో నూతనంగా కుమ్రం భీం చిత్రంతో ముఖద్వారం నిర్మించారు. ఈ నెల 9న పోరాట యోధుడి వర్ధంతిని ఆదివాసీ ఆచార వ్యవహారాల మధ్య అత్యంత ఘనంగా జరుపుకునేందుకు అధికారులు అన్ని చర్యలూ చేపడుతున్నారు. ఇప్పటికే హెలీప్యాడ్ చుట్టూ పిచ్చిమొక్కలు తొలగించడంతో పాటు ఆర్టీసీ బస్సు పార్కింగ్, ఇతర వాహనాల పార్కింగ్ ప్రాంతాలను సిద్ధం చేశారు. రోడ్డుకు ఇరువైపులా గడ్డిని తొలగించి, శిథిలావస్థకు గురైన కల్వర్టులకు మరమ్మతులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో వర్ధంతి వేడుకలకు ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.