ఎదులాపురం, ఫిబ్రవరి17: తల్లిదండ్రుల కలలను సాకారం చేసేలా యువత కష్టపడి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. టెలికాం ఇండస్ట్రీలోని పలు కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి గురువారం ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈమేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపికైన వారికి ఉద్యోగ నియామక పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. జాబ్ మేళాకు దాదాపు 500 మంది హాజరు కాగా అందులో 260 మందికి ఉద్యోగాలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. యువత అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో స్థిరపడాలన్నారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి గాను పట్టణంలో ఐటీ టవర్ ఏర్పాటు చేశామని , శాశ్వత ఐటీ టవర్ నిర్మాణానికి ఇటీవల నిధులు మంజూరైనట్లు గుర్తుచేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీఆర్డీవో కిషన్, ఆయా కంపెనీల ప్రతినిధులు, అభ్యర్థులు పాల్గొన్నారు.
కలెక్టర్ను కలిసిన ఎమ్మెల్యే
ఆదిలాబాద్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ రాజ్ను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డిలు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పూలమొక్క అందించి, శుభాకాంక్షలు అందజేశా రు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, బీఆర్ఎస్ యువనాయకుడు జోగు మహేందర్ ఉన్నారు.
నేడు శివపార్వతుల కల్యాణోత్సవం
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 17 : అనుకుంట గ్రామంలో ఈనెల 18న నిర్వహించనున్న మార్కండేయ శివపార్వతుల కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎమ్మెల్యే జోగు రామన్న కోరారు. పద్మశాలీ సంఘం రూపొందించిన మహాశివరాత్రి మహోత్సవ వాల్పోస్టర్లను క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విడుదల చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.