ఆదిలాబాద్ టౌన్, ఏప్రిల్ 26 : మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రభుత్వం ఇచ్చే తోడ్పాటును అందిపుచ్చుకొని సూక్ష్మ ఆహార ఉత్పత్తిలో రాణించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. వివిధ పథకాల కింద ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సెంట్రల్ గార్డెన్లో సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ మిషనరీ ప్రదర్శనను బుధవారం ఆయన ప్రారంభించారు. మిషనరీ పనితనాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆధునిక యుగంలో యంత్రాల పాత్ర బాగా పెరిగిందని, దీని ద్వారా అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని ఆర్జించవచ్చన్నారు.
ఆధునిక టెక్నాలజీని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో బాగా వినియోగించుకోవాలని, తద్వారా స్వయం ఉపాధి పొందుతూ ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. యంత్రాల పనితీరును పరిశీలించాలని, తద్వారా సూక్ష్మ ఆహార ఉత్పత్తిలో లాభాలు ఆర్జించాలన్నారు. సాధారణంగా ఇలాంటి ఎక్స్పోలు హైదరాబాద్ కేంద్రంగానే జరుగుతుంటాయని, కానీ జిల్లా అధికారులు ప్రజల సౌకర్యార్థం ఇక్కడ నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ డాక్టర్ శ్రీజ మాట్లాడుతూ.. ఈ మిషన్ ఎక్స్ పోను మండలాల స్థాయిలోనూ ప్రదర్శించాలని మరింత ప్రచారం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారి పద్మభూషణ్ రాజు, డీఆర్డీవో విభాగం అధికారులు పాల్గొన్నారు.