International Nurses day | నిరూపమాన సేవకు ప్రతిరూపం వారు. రోగులకు మనోధైర్యం కల్పించి వారు ఆరోగ్యంగా తిరిగి ఇంటికి చేరేదాకా సేవలందిస్తారు. రాత్రింబవళ్లు దవాఖానల్లో విధులు నిర్వర్తిస్తూ, రోగులకు కంటికి రెప్పలా తోడుగా ఉండి సేవచేస్తారు. కుటుంబ సభ్యులు, బంధువుల్లా ఆప్యాయంగా పలకరిస్తూ. కోలుకుంటారనే భావన రోగుల్లో కల్పిస్తారు. కరోనా సమయంలో నర్సుల సేవలు ప్రపంచమంతా చూసింది. ఎందరో ప్రాణాలను కాపాడేందుకు వారి ప్రాణాలను కోల్పోయిన వారు కూడా ఉన్నారు. కుటుంబాలకు దూరంగా కొన్ని రోజుల పాటు గడిపిన వారూ ఉన్నారు. ఇలా ఎన్నో సందర్భాల్లో మేమున్నామని నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివి. మే 12న ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి, ‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవం’ సందర్భంగా నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం..
నిర్మల్ చైన్గేట్, మే 11
సేవ చేయాలనే సంకల్పంతోనే నర్సు వృత్తిని ఎంచుకున్నాను. ప్రమాద పరిస్థితిలో ఉన్న రోగులకు అందించే వైద్య సేవలతో ఆరోగ్యం మెరుగైతే అది రెట్టింపు సంతృప్తినిస్తుంది. నిర్మల్ ప్రసూతి దవాఖానకు నిత్యం వందల సంఖ్యలో గర్భిణులు వస్తుంటారు. ప్రసవ వేదనను దగ్గర నుంచే చూస్తుంటాం. వారికి ఓపికగా సేవలు అందిస్తుంటాం. రోగులకు ఇంజక్షన్లు ఇవ్వడం ఆక్సిజన్ పెట్టడం వంటి అనేక సపర్యలు చేయడమే కాకుండా చిన్నారులకు టీకాలు వేయడం మా విధి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులను ప్రేమతో పలకరించి సేవలు అందిస్తుంటాం. ఏం కాదనే భావన రోగిలో వచ్చినప్పుడే సంతోషంగా ఉండగలడు. అదే ధైర్యం వారిలో నింపేందుకు ప్రయత్నిస్తుంటాం. – వీణ, స్టాఫ్నర్స్, నిర్మల్ ప్రధాన దవాఖాన
గౌరవానికి ప్రతీక నర్సు వృత్తి. రోగి దవాఖానకు వచ్చి తిరిగి వెళ్లే వరకు సేవలందిస్తుంటారు. రోగాలను నయం చేయడంలో నర్సుల పాత్ర కీలకం. రోగులను ఆత్మీయంగా పలకరించి, స్ఫూర్తి దాయక సేవలు అందిస్తారు. డాక్టరు రాసిన మందులు వేళకు రోగికి వేయిస్తారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలందించారు. కరోనా మహమ్మారితో అనేక మంది నర్సులు తమ ప్రాణాలు కోల్పోయారు. నర్సుల సేవలు వెలకట్టలేనివి. – భారతి, నర్సింగ్ సూపరింటెండెంట్, నిర్మల్ ప్రధాన దవాఖాన
రోగులకు సొంత కుటుంబ సభ్యుల్లా సేవలందిస్తాం. చికిత్స ప్రారంభించిన నుంచి కోలుకొని ఇంటికి వెళ్లే వరకు సపర్యలు చేస్తాం. విసుగు చెందితే రోగి కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. అంకిత భావంతో పనిచేస్తేనే ఈ విధులకు ఒక సార్ధకత ఉంటుంది. మాకూ సంతృప్తి మిగులుతుంది. వారితో ఆప్యాయంగా ఉంటేనే వచ్చిన రోగం నుంచి త్వరగా బయటపడుతారు.
– రాంబాయమ్మ, హెడ్నర్సు, మాతాశిశు సంరక్షణ కేంద్రం
ప్రసవం అనంతరం పుట్టిన బిడ్డను తల్లి చేతిలో పెట్టినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. నిర్మల్ మాతా శిశు సంరక్షణ దవాఖానలో నర్సుగా పని చేస్తున్నా. ఇది సేవాభావంతో ముడిపడి ఉన్న వృత్తి. గతంలో కంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నది. దవాఖానలో మెరుగైన వసతులు కల్పిస్తున్నది. దవాఖానకు పేద కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా వస్తుంటారు. విసుగు చెందకుండా వారికి సేవ చేయడం ఎంతో సంతృప్తినిస్తుంది.
– గురిజాల వనిత, స్టాఫ్నర్సు, నిర్మల్ ప్రధాన దవాఖాన