రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను ఉచితంగా అందించి వారి ఉజ్వల భవిష్యత్కు బాటలు వేస్తున్నది. ఇందులో భాగంగా అన్ని హంగులతో రెసిడెన్షియల్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఏర్పాటు చేస్తున్నది. కేజీబీవీల్లో విద్యాలయాల ఏర్పాటుతో పేద కుటుంబాలకు చెందిన బాలికలు మంచి విద్య అందుతున్నది. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే 17 కస్తూర్బా గాంధీ పాఠశాలలు ఉండగా.. కొత్తగా మావల మండలానికి మరో విద్యాలయాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో కొంతమంది పేద విద్యార్థులకు సర్కారు విద్య ఉచితంగా అందనుంది.
ఆదిలాబాద్, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో సర్కారు విద్య పేదలకు అందని ద్రాక్షలా మా రింది. అరకొర పాఠశాలలు, ఉపాధ్యాయుల కొరత, వసతుల లేమి, సరిపడా తరగతి గదులు లేకపోవడంతో పేద పిల్లలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గత ప్రభుత్వాలు విద్యా రంగంపై చిన్నచూపు చూడడంతో ప్రతిభ గల విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి ఉండేది. స్వరాష్ట్రంలోప్రభుత్వం పేద విద్యార్థుల చదువులపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు ‘మన ఊరు-మన బడి’ పథకంలో పాఠశాలలను ఆధునికీకరించింది. బీసీ, ఎస్సీ, మైనార్టీ విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి ఇంగ్లిష్ మీడియం చదువులతోపాటు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, డ్రెస్సులు అందించడంతోపాటు సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. సర్కారు విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యల ఫలితంగా పట్టణాలు, గ్రామాల్లోని విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలను మానివేసి ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారు.
భవిష్యత్కు బాటలు
బాలికలను చదువుల్లో ప్రోత్సహించి వారు తమ బంగారు భవిష్యత్కు బాటలు వేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నది. అన్ని వర్గాల విద్యార్థినులకు బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసింది. ప్రతి నియోజకవర్గంలో రెండేసీ చొప్పున గిరిజన, ఎస్సీ, మైనార్టీ, బీసీ గురుకుల పాఠశాలను ప్రారంభించి వేలాది మంది బాలికలు చదువుకునేలా చర్యలు తీసుకుంటున్నది. రెసిడెన్షియల్ స్కూళ్లలో పదో తరగతి వరకు చదువుకున్న పిల్లలు మధ్యలో చదువు ఆపివేయకుండా పాఠశాలల్లో ఇంటర్ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది. పేద విద్యార్థినుల కోసం కస్తూర్బా గాంధీ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో 17 కేజీబీవీలు ఉన్నాయి. వీటిల్లో 4,909 మంది బాలికలు పదో తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 12 కేజీబీవీల్లో ఇంటర్ విద్యను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. వీటిల్లో 1,545 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ప్రభుత్వం కేజీవీబీలకు అన్ని సౌకర్యాలతో కొత్త భవనాలను నిర్మిస్తూ విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నది. మావల మండలానికి కొత్తగా కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో జిల్లాలోని కేజీవీబీ పాఠశాలల సంఖ్య 18కి చేరగా ఆరు నుంచి పది వరకు విద్యార్థినులు చదువుకునే అవకాశం లభిస్తున్నది. ప్రభుత్వం కొత్తగా కస్తూర్బా స్కూల్ను మంజూరు చేయడంపై మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.