పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు రాష్ట్ర సర్కారు పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా దవాఖానల్లో మెరుగైన వసతులు కల్పిస్తూనే, తల్లీబిడ్డలకు కేసీఆర్ కిట్, అమ్మ ఒడి లాంటి పథకాలతో అండగా ఉంటున్నది. మరోవైపు సర్కారు దవాఖానల్లో సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యమిస్తుండగా, ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో రోజురోజుకూ నమ్మకం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో కాన్పు కోసం వచ్చే వారిలో రక్తహీనత, పౌష్టికాహారలోపాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఆయా చోట్ల గర్భిణులకు ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు’ అందజేయాలని నిర్ణయించింది. ఆదిలాబాద్ జిల్లాలో త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది.
ఆదిలాబాద్, డిసెంబర్ 2( నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం ప్రజలకు చేరువైంది. జిల్లా దవాఖానలు మొదలుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సబ్ సెంటర్ల వరకూ కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నాయి. సర్కారు దవాఖానల్లో మెరుగైన వసతులు సమకూరడంతో పాటు సిబ్బంది నియామకం, రో గులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో పాటు ప్రభు త్వం టీ డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసి 57 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేయిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో రిమ్స్ తోపాటు రెండు కమ్యూనిటీ దవాఖానలు, 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వా రా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. అనేక రకాల శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి.
ప్రభుత్వం మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా గర్భిణుల కోసం అమ్మఒడి, బిడ్డల సంరక్షణకు కేసీఆర్ కిట్లను అమలు చేస్తున్నది. జిల్లాలో సర్కారు దవాఖానల్లో ప్రతి నెలా 900-1000 డెలివరీలు అవుతున్నాయి. గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు మాతా, శిశు మరణాల నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను ప్రవేశపెట్టింది. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలతో కూడిన న్యూట్రిషన్ కిట్లను వైద్యశాఖ అధికారులు పంపిణీ చేస్తారు. రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో ఈ పథకం అమలు చేయనుండగా, అందులో ఆదిలాబాద్ జిల్లా కూడా ఉంది. 16 నుంచి 24వారాలు ( రెండో త్రైమాసికం), 27 నుంచి 24 వారాలు (మూడో త్రైమాసికం) ఉన్న గర్భిణులు ఈ కిట్కు అర్హులుగా ఉంటారు. ప్రస్తుతం జిల్లాలో 6040 మంది ఈ పథకం వల్ల ప్రయోజనం పొందుతారు. ఒక్కో కిట్ రూ.2 వేల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఆరకిలో నెయ్యి. కిలో ఖర్జూర పండ్లు, ఒక్కొక్కటి కిలో చొప్పున రెండు హార్లిక్స్ బాటిల్స్, ఇతర పోషక పదార్థాలు ఉంటాయి. ఈ పథకం వారం రోజుల్లో ప్రారంభం కానుండగా వైద్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. దవాఖానల్లో కిట్లను నిల్వ ఉంచడానికి గదులను అనుగుణం గా తీర్చిదిద్దుతున్నారు. పీహెచ్సీల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వీటిని పంపిణీ చేయనున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో పోషకాహార లోపం, రక్తహీనత ఉన్న గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు ఎంతగానో ఉపయోగపడుతాయి. జిల్లా వ్యాప్తంగా రెండు, మూడో త్రైమాసిక గర్భిణులు 6040 మంది ఉండగా, వారికి ఈ పథకం వర్తిస్తుంది. కిట్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. పీహెచ్సీల్లో న్యూట్రిషన్ కిట్లను భద్రపర్చడానికి ప్రత్యేక గదులను గుర్తించాం. రోజూ 80 మంది గర్భిణులకు పంపిణీ చేస్తాం. మూడో త్రైమాసికంలో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం, రెండో త్రైమాసికంలో ఉన్న వారికి తర్వాత ప్రాధాన్యం ఉంటుంది. పంపిణీ వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతాం.
– నరేందర్ రాథోడ్, జిల్లా వైద్యాధికారి, ఆదిలాబాద్