బజార్హత్నూర్, ఏప్రిల్ 22 : పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం పెంచేలా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా రహదారులు, పొలం గట్లు, కార్యాలయాల ఆవరణ, ఇంటి పరిసరాలు, పాఠశాలలు, అటవీ ప్రాంతాల్లో మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టింది. దీంతోపాటు పల్లె, బృహత్ ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి గ్రామాల్లో ప్రజలు సేదతీరేలా ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తున్నది. ఇందుకు అనుగుణంగా నాటేందుకు వీలుగా మొక్కలను పెంచేందుకు గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో నర్సరీలను ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని 30 గ్రామ పంచాయతీల్లో జీపీకో నర్సరీని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నర్సరీల్లో అటవీ జాతులు, పండ్లు, పూలు, ఆయుర్వేద మొక్కల పెంపకం చేపట్టారు. ప్రస్తుతం వేసవి దృష్ట్యా, మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. మొక్కలకు నీడ కల్పించేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. అలాగే తుంపర విధానంలో మొక్కలపై నీటి జల్లులు పడేలా చర్యలు తీసుకున్నారు.
నర్సరీల్లో కూలీలను నియమించి మొక్కలను సంరక్షిస్తున్నారు. నిత్యం రెండు వేళల్లో నీటితడులు అందజేస్తున్నారు. చనిపోయిన వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటి పెంచుతున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. తెగుళ్లు రాకుండా నివారణ చర్యలు తీసు కుంటున్నారు. మొత్తానికి వచ్చే వర్షాకాలంలో నాటేందుకు వీలుగా వీటిని సిద్ధం చేస్తున్నారు.
మండలంలోని 30 గ్రామపంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేశారు. జీపీకి 10 వేల చొప్పున మొత్తం 3 లక్షల మొక్కలను పెంచుతున్నారు. నీటి వసతి లేని పలు జీపీలను మరో గ్రామ పంచాయతీకి జతచేసి నర్సరీల్లో సిద్ధం చేస్తున్నారు. జాతర్ల గ్రామపంచాయతీలో జాతర్ల, గిరిజాయి.. పిప్పిరిలో అనంతపూర్.. డేడ్రాలో మన్కాపూర్ నర్సరీలను ఏర్పాటు చేశారు.
కానుగ, సీమతంగేడు, అంజీల్, బొప్పాయి, జామ, నిమ్మ, టెకోమా, చైనా బాదం, గన్నెరు, ఉసిరి, ఫెల్టోపామ్, గుల్మోహార్, రెయిన్ ట్రీ, దానిమ్మ, అశ్వగంధ, సపోటా, మునగ, టేకు, గులాబీ, మందారం, మల్లె, చామంతి, నీలగిరి, గోరింటాకు, తులసి, దేవ కాంచన, ఖర్జూరం.