దస్తురాబాద్, మే 5 : గొల్లకుర్మలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ 2017, జూలైలో ప్రవేశ పెట్టిన గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. మొదటి విడుతలొ గొర్రెలు అందుకున్న ఎంతో మంది సంపదను పెంచుకొని, విక్రయించి ఆర్థికంగా అభివృద్ధి చెందారు. గ్రామాల్లో సంపద పెంచే దిశగా గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. తెలంగాణ ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొదటి విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమం విజయవంతం కావడంతో రెండో విడుతకు శ్రీకారం చుట్టింది. దీంతో అధికారులు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లోని లబ్ధిదారులకు అవగాహన సదస్సులు నిర్వహించి, అవగాహన కల్పిస్తున్నారు. మండలంలో మొదటి విడుతలో 207 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయగా, రెండో విడుతలో 216 మందికి గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నారు.75 శాతం సబ్సిడీతో ప్రభుత్వం లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. 25 శాతం లబ్ధిదారులు తమ వాటాను డీడీ చెల్లించాలి. కాగా.. గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
అర్హులైన వారందరికీ ప్రభుత్వం యూనిట్లను పంపిణీ చేయనున్నది. కులవృత్తులకు జీవం పోస్తూ సీఎం కేసీఆర్ గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మండలంలోని బుట్టాపూర్-15, మున్యాల-22, రేవోజిపేట-74, దేవునిగూడెం-14, గొడిసెర్యాల-66, భూత్కుర్-25 మంది లబ్ధిదారులుండగా.. వీరికి గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాల్సి ఉంది. కాగా, వీరు తమ వాటాకు సంబంధించిన డీడీలు చెల్లించాల్సి ఉంది. ఈ విషయమై అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. వీరికి ఒక యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలును అందించనున్నారు.
రెండో విడుత గొర్రెలను పంపిణీ చేసేందుకు అధికారులు ఇప్పటికే సమావేశాలు నిర్వహించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పెరిగిన ధరల కారణంగా ప్రభుత్వం రాయితీని పెంచింది. మొదటి విడుతలో యూనిట్ విలువ రూ.1.25 లక్షలుండగా, లబ్ధిదారుడి వాటా రూ.31,250 చెల్లించారు. ప్రసుత్తం రెండో విడుతలో యూనిట్ విలువ రూ.1.75 లక్షలు కాగా, ఇందులో 75 శాతం అంటే రూ .1 లక్షా 31,250 ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేస్తుంది. కాగా.. 25 శాతం అంటే రూ.43,750 లబ్ధిదారుడు డీడీ చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా కారణంతో గొర్రెలు మరణిస్తే పరిహారం ఇవ్వడానికి ప్రతి గొర్రెకు కొనుగోలు సమయంలో ప్రభుత్వమే బీమా చేయిస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు జీవం పోస్తూ గొల్లకుర్మలను ఆదుకుంటున్నది. ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 2017లో గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటి విడుతలో మండలంలో 206 యూనిట్లను ప్రభుత్వం లబ్ధిదారులకు ప్రభుత్వం అందించింది. ప్రస్తుతం రెండో విడుతలో 216 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనున్నది. గొర్రెలు చనిపోతే లబ్ధిదారుడు నష్టపోకుండా ప్రభుత్వం బీమా చేయించి అండగా నిలుస్తుంది. గొల్లకుర్మల తరఫున సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే రేఖా నాయక్కు రుణపడి ఉంటాం.
– ముడికే ఐలయ్య యాదవ్, యాదవ సంఘం మండలాధ్యక్షుడు, రేవోజిపేట
రెండో విడుత గొర్రెల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గ్రామాల్లో లబ్ధిదారులకు రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్నాం. గొర్రెల యూనిట్ విలువ రూ.1.75 లక్షలుండగా.. 75 శాతం ప్రభుత్వం చెల్లిస్తుంది. లబ్ధిదారుడి వాటా కింద 25 శాతం అంటే రూ.43,750 డీడీ చెల్లించాలి. ప్రస్తుతం మండలంలో రెండో విడుతలో 216 మంది లబ్ధిదారులున్నారు. డీడీలు చెల్లించి, ఆధార్ కార్డు, కులం, బ్యాంక్ అకౌంట్, నామినీ ధ్రువీకరణ పత్రాలను అందించాలి.
– టీ సుకన్య, పశు వైద్యాధికారి, రేవోజిపేట, దస్తురాబాద్