భీంపూర్, జనవరి 16 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి విజయవంతం చేయాలని ప్రత్యేకాధికారి గోపీకిషన్ పిలుపునిచ్చారు. మండలంలోని కరంజి(టీ) గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రంలో సోమవారం కంటి వెలుగు సన్నద్ధత డెమో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి సమస్యలతో బాధపడుతున్న వారిని ఉపకేంద్ర ,అంగన్వాడీ సిబ్బంది గుర్తించి పరీక్షలు చేసుకునేలా చూడాలన్నారు. 18వ తేదీన కరంజి(టీ)లో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు, హెచ్ఈవో లింగంపల్లి జ్ఞానేశ్వర్, సర్పంచ్ స్వాతిక, ఉపసర్పంచ్ లక్ష్మీబాయి, ఎంపీటీసీ దేవమ్మ, సిబ్బంది గంగాధర్, లూసి, సుజాత, సరస్వతి, కవిత, సునీత, జనాబాయి, నాయకులు నరేందర్యాదవ్, మాద విఠల్ యాదవ్, ఆకటి నరేందర్రెడ్డి , సిల్వర్ ఆశన్న, సుదర్శన్ పాల్గొన్నారు.
బోథ్, జనవరి 16: మండలంలోని పొచ్చెర గ్రామంలో కంటి వెలుగు కేంద్రాన్ని ఎంపీడీవో లక్ష్మణ్, ఎంపీవో జీవన్రెడ్డి పరిశీలించారు. అనంతరం అధికారులు, వైద్యసిబ్బంది, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో సొనాల పీహెచ్సీ డాక్టర్ కుంట నవీన్రెడ్డి, సూపర్వైజర్ నర్సింహస్వామి, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్గౌడ్, ఉపసర్పంచ్ మనోజ్రెడ్డి, ఐకేపీ సీసీ విజయలక్ష్మి, ఏఎన్ఎం లలిత, ఆశ కార్యకర్తలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
నార్నూర్, జనవరి 16 : కంటి వెలుగు శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గాదిగూడ ఎంపీపీ చంద్రకళ అన్నారు. గాదిగూడలోని మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కంటి వెలుగు కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటి సమస్య ఉన్న వారికి ఉచితంగా పరీక్షలు చేసి అద్దాలు ఇస్తారని తెలిపారు. అలాంటి వారిని గుర్తించి పరీక్షలు చేసుకునేలా చూడాలన్నారు. సమావేశంలో వైస్ఎంపీపీ యోగేశ్, ఎంపీడీవో సాయిప్రసాద్, హెచ్ఈవో పవార్ రవీందర్, మండల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ టౌన్, జనవరి 16 : కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీఎమ్మార్పీస్ జిల్లా అధ్యక్షుడు మల్యాల మనోజ్కుమార్ సూచించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని సంఘం పక్షాన స్వాగతిస్తున్నామని తెలిపారు. గతంలో మాదిరిగా ఈ కార్యక్రమాన్ని మధ్యలో నిలిపివేయకుండా నిరంతరం సాగించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి నక్క రాందాస్, కోశాధికారి ప్రసన్నకుమార్, జిల్లా ప్రచార కార్యదర్శి రవికుమార్, పట్టణాధ్యక్షుడు సుధాకర్ పాల్గొన్నారు.
బేల, జనవరి 16 : కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులతో కంటి వెలుగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వైద్య సిబ్బంది గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శంకర్, నాయకులు గంభీర్ ఠాక్రే, సతీశ్పవార్, సర్పంచ్లు ఇంద్రశేఖర్, రాకేశ్, ఎంపీడీవో భగత్ రవీందర్, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, బేల పీహెచ్సీ డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు.
నార్నూర్, జనవరి 16 : గాదిగూడ మండలం దాబా(బీ) గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఎంపీడీవో సాయిప్రసాద్ విడుదల చేశారు. కార్యక్రమంలో డాక్టర్ ఇఫాత్, హెచ్ఈ రాథోడ్ రవీందర్, హెచ్ఎస్ సంజయ్, సిబ్బంది శ్రీదేవి, కల్పన, రాజు, పంచాయతీ కార్యదర్శి వెంకటసాయి పాల్గొన్నారు.