యైటింక్లయిన్కాలనీ డిసెంబర్ 28 : దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి.. అద్భుతమైన పర్యాటక కేంద్రమని డైరెక్టర్ (ఆపరేషన్) ఎస్ చంద్రశేఖర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ఆర్జీ-2 ఏరియాలో మూసివేసిన 7 ఎల్ఈపీ గనిని యాజమాన్యం పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయగా, బుధవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందుగా సంస్థలో బొగ్గు నిక్షేపాల తీరు, భూగర్భ గనులు, ఓసీపీల్లో పని స్థలాలు, బొగ్గు ఉత్పత్తికి వినియోగిస్తున్న భారీ యంత్రాలు, మ్యాన్రైడింగ్ తదితర నమూనాలను పర్యాటకులతో కలిసి వీక్షించారు.
ఆర్టీసీ, సింగరేణి జా యింట్ ప్రాజెక్టుగా మొదటిసారిగా 7 ఎల్ఈపీ గని ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తూ కార్మికులు వెళ్లి నల్లబంగారాన్ని వెలికి తీసి దేశానికి వెలుగునందిస్తున్నారన్నారు. ఇలాంటి సంస్థ గురించి ప్రజలకు తెలియజేయాల్సిన ఉద్దేశ్యంతో మూసేసిన గనిని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నామని చెప్పారు. తొలిసారిగా ఆర్టీసీ సికింద్రాబాద్ నుంచి కోల్ టూరిజం పేరిట బస్సు నడుపుతున్నదని చెప్పారు.
టూరిస్టులకు 7ఎల్ఈపీ గని, ఓసీపీ-3 ప్రాజెక్టు, జైపూర్ పవర్ ప్లాంటును సందర్శించేందుకు అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. కాగా, ఉదయం 9:30 గంటలకు కరీంనగర్ చేరుకున్న కోల్టూరిజం బస్సుకు కరీంనగర్ డిప్యూటీ ఆర్ఎం చందర్రావు, డిపో-2 మేనేజర్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావు, అధికారుల సంఘం ప్రతినిధి చంద్రమౌళి, ఆర్టీసీ కరీంనగర్ ఆర్ఎం ఖుస్రో ఖాన్, ఆర్జీ-1 జీఎం కాల్వల నారాయణ, కార్పొరేట్ జీఎం గురువయ్య, రీజియన్ జీఎం సాంబయ్య, వెంకటేశ్వర్లు, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, డివిజన్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, గ్రూప్ ఏజెంట్ కాంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎస్వోటూ జీఎం అబ్దుల్ సలీం, ఓసీపీ-3 పీవో మోహన్ రెడ్డి, డీజీఎం(ప) జీ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
ఎస్టీపీపీలో..
జైపూర్, డిసెంబర్ 28 : జైపూర్ సింగరేణి విద్యుత్కేంద్రంలో పర్యాటకులు పర్యటించారు. ఎస్టీపీపీలో అడ్మిన్ బిల్డింగ్, సర్వీస్ బిల్డింగ్ యూనిట్-1, కంట్రోల్రూం, చిమ్ని, బాయిలర్ తదితర ప్రాంతాలను సందర్శించారు. ఎస్టీపీపీకి సాయంత్రం 3 గంటల వరకు రావాల్సిన బస్సు సర్వీసు ఆలస్యంగా రావడంతో కొన్ని ప్రాంతాలనే సందర్శించినట్లు తెలిపారు. కాగా, ఎస్టీపీపీకి వచ్చిన పర్యాటకులకు సీటీసీ సంజయ్కుమార్ ష్యూర్, జీఎం డీవీఎస్ఎస్ సూర్యనారాయణరాజు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జీఎం పీసీఎస్ రాజశేఖర్, ఏజీఎం సివిల్ సత్యనారాయణ, ఏజీఎం ఎఫ్అండ్ఏ సుధాకర్, ఏజీఎం ఎఫ్జీడీ శ్రీనివాసులు, పీఎం కేస నారాయణ తదితరులు పాల్గొన్నారు.