ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : అర్హత కలిగిన ప్రతి పోడు రైతుకు పట్టా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ రాల్రాజ్ అన్నారు. ఇందు కోసం నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు పోడు రైతుల సమస్యలు పరిష్కరించేందుకు దరఖాస్తు దారుల వాదానలు వింటామని పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ గ్రామ పంచాయతీ రైతువేదికలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, వరుణ్రెడ్డిలతో కలిసి జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్.ఓ.ఎఫ్. ఆర్ చట్టం 2005 ప్రకారం పట్టా పంపిణీ జరుగుతుందని , పట్టా పంపిణీ తరువాత అటవి భూమి ఆక్రమణకు గురి కాకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరీపై ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయిలో ఒక కమిటీ ఉంటుందని వెల్లడించారు. జిల్లాలో దాదాపు 10వేల వరకు పట్టాలు ఇచ్చే అవకాశం ఉందని వివరించారు. ఎవరైనా అభ్యర్థుల దరఖాస్తులు తిరస్కరించినట్లయితే దరఖాస్తు సవరించి , సరైనా పత్రాలు జత చేసి తిరిగి సమర్పించవచ్చని సూచించారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ కోనేరు కృష్ణరావు , జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు , సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.