నిర్మల్ అర్బన్, డిసెంబర్ 30 : జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులపై గౌరవం పెరిగేలా సేవలందిస్తామని నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పొలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వార్షిక నేర నివేదిక వెల్లడించారు. జిల్లాలోని సమస్యాత్మక నిర్మల్, భైంసా ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచి, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు. అందుకు సహకరించిన పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల శాతం 13.81 పెరిగిందన్నారు. గతేడాది 2,714 కేసులు నమోదవగా, ఈ ఏడాది 3,089 నమోదయ్యాయని చెప్పారు. ఇందులో తీవ్ర మైన కేసుల్లో గతేడాది, ఈఏడాది 56 కేసులు నమోదైనట్లు తెలిపారు. హత్యాచారాల సంఖ్య తగ్గిందన్నారు.
దొంగతనం కేసుల సంఖ్య పెరుగగా, ఆస్తి రికవరీని గతేడాది కంటే ఎక్కువగా రాబట్టినట్లు వివరించారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య 277 ఉండగా, ఈ ఏడాది 259కి తగ్గిందన్నారు. రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య కూడా తగ్గిందని తెలిపారు. 8,369 మంది మద్యం తాగి వాహనాలు నడుపగా, వీరి నుంచి రూ.79,80,319 జరిమానా వసూలు చేసి, 38 మందికి జైలు శిక్ష విధించినట్లు వెల్లడించారు. మహిళలపై నేరాల సంఖ్య పెరిగిందని, గతేడాది 67 నమోదవగా.. ఈ ఏడాది వీటి సంఖ్య 113కు చేరిందని వివరించారు. గంజాయి కేసుల సంఖ్య తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. గతేడాది 11 కేసులు నమోదవగా, ఈ ఏడాది 5 నమోదయ్యాయని తెలిపారు. 24 పోక్సో కేసులు నమోదైనట్లు చెప్పారు. పేకాట, గుట్కా అక్రమ మద్యం కేసుల సంఖ్య తగ్గగా, మట్కా కేసులు 8 నుంచి 12కు పెరిగిందని వివరించారు. గతేడాది 47 కార్డన్ సెర్చ్లు చేపట్టగా, వాటి సంఖ్య 71 పెంచి.. 6,131 వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. సైబర్ క్రైమ్ల సంఖ్య గతేడాది 16 కాగా, వీటి సంఖ్య 32కు పెరిగిందని తెలిపారు. భైంసా పట్టణానికి చెందిన ఓ వ్యక్తిపై పీడీ యాక్టు నమోదు చేశామని, 8 మందికి యావజ్జీవ కారాగార, నలుగురికి 10 ఏండ్లు, 11 మందికి 5 ఏండ్లు, 16 మందికి ఐదేండలోపు జైలు శిక్ష విధించినట్లు వివరించారు. డీజీపీ ఆదేశాల మేరకు కాగిత రహిత సేవలను పోలీసు శాఖలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. పోలీసు శాఖ ముందస్తు చర్యలతో కడెం వరద ప్రాంతాల్లోని 12 గ్రామాల ప్రజలను 5 గంటల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగామని చెప్పారు.
ఉత్తమ పోలీస్ స్టేషన్లుగా కడెం, నిర్మల్ రూరల్..
రాష్ట్ర వ్యాప్తంగా అతి తక్కువ నేరాలు నమోదైన పోలీస్ స్టేషన్లలో కడెం, నిర్మల్ రూరల్ స్థానాలు సాధించాయని ఎస్పీ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 213 పోలీస్ స్టేషన్లు ఉండగా (0-150 కేసుల లోపు) కడెం పోలీస్స్టేషన్ 36వ ర్యాంకును సాధించింది. అలాగే కేటగిరి-2లో 242 పోలీస్ స్టేషన్లలో (151-250 కేసుల లోపు) నిర్మల్ పోలీస్స్టేషన్ 33వ ర్యాంక్ దక్కించుకున్నది. అలాగే ఉత్తమ సేవలు అందించిన స్టేషన్ హౌస్ అధికారులకు ఎస్పీ ప్రశంసా పత్రాలు అందించి, అభినందించారు. ఈ సమావేవంలో భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారే, ఏఆర్ అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, నిర్మల్ డీఎస్పీ జీవన్ రెడ్డి, సోన్ సీఐ రాంనర్సింహా రెడ్డి, నిర్మల్ సీఐ శ్రీనివాస్, రూరల్ సీఐ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.