ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు సాధించేలా ఇన్చార్జి పీవో వరుణ్రెడ్డి ఆధ్వర్యంలో సరికొత్త ప్రణాళికను అమలు చేస్తున్నది. గతేడాది డిసెంబర్లోనే మిషన్ లక్ష్యం పేరిటా ‘100 రోజులు- 100 శాతం ఉత్తీర్ణత’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ప్రతిభ గల విద్యార్థులతో పాటు వెనుకబడిన విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నది. వారికి పౌష్టికాహారం అందించడంతో పాటు మానసికంగా సన్నద్ధం చేసేందుకు నిపుణులతో ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహిస్తున్నది.
– ఉట్నూర్, మార్చి 9
ఉట్నూర్, మార్చి 9: ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా యంత్రాగం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ఇందులో భాగంగా విద్యార్థులను మానసికంగా, శారీరకంగా సన్నద్ధం చేయడంతో పాటు నిపుణులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం ఆరు పేపర్లుగానే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐటీడీఏ డిసెంబర్లో ‘100 రోజులు.. 100 శాతం’ ఉత్తీర్ణత అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ‘మిషన్ లక్ష్యం’ పేరిట విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 3, 901 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. గత డిసెంబర్ నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు వీరికి నెలనెలా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతి విద్యార్థి పాసయ్యేలా వారికి సబ్జెక్టుల వారీగా ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.
శతశాతం లక్ష్యంగా..
ప్రతి విద్యార్థి పాసయ్యేలా రూపొందించిన పథకమే ‘మిషన్ లక్ష్యం’. గతేడాది డిసెంబర్లో ఈ కార్యక్రమాన్ని అప్పటి పీవో వరుణ్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పదోతరగతి విద్యార్థులకు నిత్యం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 8.30 నుంచి 9.30 వరకు క్యాట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాఠ్యంశాల వారీగా ప్రశ్నపత్రాలను ముద్రించి సరఫరా చేయడం. ఇందులో విద్యార్థులకు వచ్చిన మార్కులకు తగ్గట్టు విద్యాబోధనకు గ్రేడ్లుగా ఏర్పాటు చేసి గ్రాండ్ టెస్ట్ పెడుతారు. ఉపాధ్యాయులను గ్రూపులుగా ఏర్పాటు చేసి విద్యార్థులను దత్తత ఇచ్చారు. రోజువారీ పరీక్షలు రాయడానికి కార్పొరేట్ పాఠశాలల మాదిరిగా ఆన్సర్ బుక్లెట్లను ప్రతి విద్యార్థికి అందించారు.
అభ్యాస దీపికల అందజేత
గిరిజన విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో ఎస్సీఈఆర్టీ ద్వారా రూపొందించిన పుస్తకాలే అభ్యాస దీపికలు. వీటిని ఇప్పటికే విద్యార్థులకు అందించారు. దీంతో పాటు ఈసారి 6 పేపర్లుగానే పరీక్షలు నిర్వహిస్తుండడంతో, కొత్త పరీక్షా విధానం, ఉత్తమ మార్కుల సాధనకు చిట్కాల వివరణ, విద్యార్థులకు ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేయడానికి నిష్టాతులైన ఉపాధ్యాయులతో 14 కాంప్లిమెంట్ బృందాలను ఏర్పాటు చేశారు. కొత్త ప్రశ్నాపత్రం, పరీక్షల విధానంపై పూర్తి స్థాయి అవగాహన కల్పించడం ఈ బృందాల పని.
పరీక్ష సామగ్రి, ప్రత్యేక మెనూ
విద్యార్థులకు ఉపయోగపడేలా పరీక్షా సామగ్రిని అందించారు. ఇందులో చేతి గడియారం, జామెట్రీ బాక్స్, పరీక్ష ప్యాడ్, రెడ్, బ్లూ, బ్లాక్ పెన్నులు, పెన్సిల్, లాంగ్ స్కేల్తో కూడిన కిట్ను అందించారు. మరోవైపు ప్రత్యేక మెనూను అందిస్తున్నారు. ఒత్తిడి తగ్గించడంతో పాటు ఆరోగ్యవంతమైన శరీరానికి గాను అలసిపోకుండా ఉండేందుకు ప్రతిరోజు మెనూతో పాటు రాత్రి స్టడీ అవర్స్లో పాలు, స్నాక్స్, టీ, పోషకాహారం ఉండేలా చర్యలు తీసుకున్నారు.
భవిష్యత్ కోర్సులపై అవగాహన
పదోతరగతి అనంతరం పై చదువుల కోసం వివిధ కోర్సులపై అవగాహన కల్పించేందుకు నిర్మాణ్ సంస్థతో అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ఆత్మవిశ్వాసం అందించడంతో పాటు రానున్న రోజుల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఏఏ కోర్సులు తీసుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకు నిర్మాణ్ సంస్థతో ఐటీడీఏ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటికే ప్రొజెక్టర్ ద్వారా ఇందుకు సంబంధించిన వివరాలను ప్రత్యేక తరగతుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు
‘మిషన్ లక్ష్యం’ సమర్థవంతంగా నిర్వహించేందుకు పర్యవేక్షణ టీంను అధికారులు నియమించారు. అన్ని కార్యక్రమాలు సమయానుకూలంగా నిర్వహిస్తున్నారా లేదా చూసేందుకు పర్యవేక్షణ టీం ఎప్పటికప్పుడు ఆశ్రమ పాఠశాలలను సందర్శించి వాట్సప్ గ్రూప్ల ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులు, వార్డెన్లు, ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకునేందుకు మానిటరింగ్ చేస్తున్నారు.
పకడ్బందీగా అమలు చేస్తున్నాం..
పదోతరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఐటీడీఏ ఆధ్వర్యంలో ఇన్చార్జి పీవో వరుణ్రెడ్డి ఆదేశాల మేరకు నిత్యం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. మిషన్ లక్ష్యం 100 రోజుల ప్రణాళిక. ఇందులో ప్రతి విద్యార్థిపై దృష్టి సారించాం. మంచి ఫలితాలు వస్తున్నాయి. దానికి తగ్గట్టు ఉపాధ్యాయలు కూడా కృషి చేస్తున్నారు. దాదాపు లక్ష్యాలను సాధిస్తాం.
-జగన్(ఐటీడీఏ అకాడమిక్ మానిటరింగ్ అధికారి)
ప్రతి విద్యార్థిపై దృష్టి
ఉమ్మడి జిల్లాలో ఐటీడీఏ పరిధిలోని పాఠశాలల్లో 3901 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 1776, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 1250, మంచిర్యాల్ జిల్లాలో 460, నిర్మల్లో 415 మంది ఈ ఏడాది పరీక్షలు రాయనున్నారు. వారికి ప్రత్యేక శిక్షణతో పాటు రానున్న రోజుల్లో ఏ కోర్సులు తీసుకోవాలనే దానిపై అవగాహన కల్పిస్తున్నాం. అలాగే మిషన్ లక్ష్యంతో 100 రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మంచి ఫలితాలు సాధిస్తాం. రాష్ట్రంలోని ఇతర ఐటీడీఏతో పోటీ పడేలా విద్యార్థులను సిద్ధం చేస్తున్నాం.
-దిలీప్, డీడీ, ఉట్నూర్ ఐటీడీఏ