మంచిర్యాల, జనవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీఎన్టీవో) ఎన్నికల వ్యవహారం వివాదానికి దారితీస్తున్నది. యూనియన్ బై-లా నిబంధనలకు విరుద్ధంగా ఎలక్షన్స్కు వెళ్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూనియన్కు పునాదులు పడినప్పటి నుంచి అందులోనే పాతుకుపోయిన కొందరు లీడర్ల ఇష్టారాజ్యం.. ఇప్పుడు పరవు పోయేదాకా తీసుకువచ్చింది. యూనియన్ బై-లాకు.. మంచిర్యాల టీఎన్జీవో సంఘానికి ఏ మాత్రం సంబంధం లేదన్నట్లు కొందరు వ్యవహరిస్తున్న తీరుపై టీఎన్జీవోలోని ఇతర ఉద్యోగులే పెదవి విరుస్తున్నారు.
మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, లక్షెట్టిపేట, మందమర్రి, కన్నేపల్లి యూనిట్ల పదవీకాలం గతేడాది నవంబర్లో ముగిసింది. జిల్లా కమిటీ కాలపరిమితి డిసెంబర్ చివరివారంతో అయిపోయింది. వెంటనే యూనిట్లకు ఎన్నికలు నిర్వహించి జిల్లా బాడీని ఎన్నుకోవాల్సి ఉన్నా.. వివిధ కారణాల దృష్ట్యా అది ఆలస్యమైంది. దీనిపై టీఎన్జీవోలోని మిగిలిన ఉద్యోగుల్లో అసమ్మతి పెరగడంతో హడావుడిగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఆరు యూనిట్లకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. యూనియన్ బై-లాలోని నియమాలేవీ పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికలకు వెళ్లడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
నిబంధనల ప్రకారం ఆరు యూనిట్లకు సంబంధించిన ఓటర్ల జాబితాను వారం ముందే ఎన్నికల అధికారులు ప్రచురించాల్సి ఉంది. ఈ లెక్కన 28వ తేదీన ఎన్నికలు జరిగే చెన్నూర్, లక్షెట్టిపేట, బెల్లంపల్లి యూనిట్ల ఓటర్ల జాబితా ఇప్పటికే విడుదల కావాలి. కానీ జాబితాపై స్పష్టత లేదు. అసలు జిల్లాలో మొత్తం ఆరు యూనిట్లలో కలిపి 800 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటి వరకు యూనియన్లో 450 మంది మాత్రమే సభ్యత్వం నమోదు చేసుకున్నారు. మిగిలిన వారి సభ్యత్వ నమోదు పూర్తి కాకముందే.. ఓటర్ల జాబితా లేకుండానే ఎన్నికలకు వెళ్లాల్సిన అత్యవసరం ఏమొచ్చిందనే ప్రశ్న తలెత్తుతున్నది.
యూనియన్ బై-లా రూల్-9 ప్రకారం జనవరి 1వ తేదీలోగా సభత్వ నమోదును పూర్తి చేసి మెంబర్షిప్ లిస్టును బహిర్గత పరచాలి. కానీ ఈ ఆరు యూనిట్ల పరిధిలో అది జరగలేదు. బై-లాకు వ్యతిరేకంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఎన్నికల ముందు రోజు వరకు సభ్యత్వం పొందేందుకు ఛాన్స్ ఉందని పత్రికా ప్రకటన విడుదల చేయడం కొసమెరుపు. దీనిపై ఆయనను వివరణ కోరగా ఎన్నికలకు మూడు రోజుల ముందు వరకు సభ్యత్వం పొందవచ్చని చెప్పారు. యూనియన్ బై-లాలో అలాగే ఉందన్నారు. అందుకు సంబంధించి ప్రతిని కోరగా అది ప్రస్తుతం అందుబాటులో లేదన్నారు. నేను తెప్పించుకొని మీకు ఇస్తామంటూ దాటవేసే ధోరణిలో సమాధానం చెప్పారు.
కాగా నోటిఫికేషన్లో ఎన్నికల తేదీలు, ఎన్నికల అధికారుల వివరాలను మాత్రమే పేర్కొన్నారు. ఎన్నిక నిర్వహించే సమయం, కౌంటింగ్ సమయం ఇవేవీ అందులో ఇవ్వలేదు. చెన్నూర్, లక్షెట్టిపేట, బెల్లంపల్లి మూడు యూనిట్ల ఎన్నికలు ఓకే రోజు నిర్వహించడం వెనుక మతలబు ఏమిటోనన్న ప్రశ్న తలెత్తుతున్నది. మంచిర్యాలలో టీఎన్జీవో సంఘం ఎన్నిక ఇప్పటి వరకు ఏకగ్రీవంగానే జరిగింది.
ఇప్పుడు టీఎన్జీవోల్లో అవగాహన పెరగడం, ఉద్యోగుల్లో ప్రశ్నించే వారు ఎక్కువవడంతో ఎన్నికల నిర్వహణ అనివార్యమైంది. ఆ ఒత్తిడితోనే ఏదో నామమాత్రంగా నోటిఫికేషన్ ఇచ్చి, ఎన్నికల జాబితా లేకుండానే, సభ్యత్వ నమోదు చేయకుండానే, ఎవరికీ సమాచారం లేకుండానే ఎన్నికలు నిర్వహించి తిరిగి పదవులను దక్కించుకోవాలని పలువురు కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏం లేకుండానే పోటీ అని చెప్పి ఉద్యోగులను పిచ్చోళ్లను చేయాలని చూస్తున్నారంటూ మండి పడుతున్నారు.
మంచిర్యాల జిల్లాలని టీఎన్జీవో సంఘంలో ప్రస్తుతం పదవుల్లో ఉన్న నలుగురు చెప్పిందే వేదం అన్నట్లుగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాళ్లకే అన్ని పదవులు దక్కాలనే కుట్రలో భాగంగానే పావులు కదుపుతున్నట్లు ఎన్నికల హడావుడి బట్టి చూస్తే అర్థం అవుతున్నది. మంచిర్యాల జిల్లా కార్యవర్గంలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న పొన్న మల్లయ్యకు మరో మూడు పదవులు ఉన్నాయి. ఆయనే స్టేట్ యూనియన్లో సెక్రటరీ, టీఎన్జీవోకు అనుబంధంగా ఉన్న స్టేట్ ఫారెస్ట్ ఎంప్లాయీస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా, టీఎన్జీవో జిల్లా ట్రెజరర్గా పదవుల్లో ఉన్నారు.
ఇక్కడ కొస మెరుపు ఏమిటంటే ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే ఆరు యూనిట్లలో చెన్నూర్, మంచిర్యాల యూనిట్ల ఎన్నికల అధికారిగా ఉండటం గమనార్హం. మిగిలిన నలుగురిలో ముగ్గురు డిప్యూటీ తహసీల్దార్లు ఉండటం, ఇతర డిపార్ట్మెంట్ వాళ్లకు అవకావం ఇవ్వకపోడంతో ఎన్నికల విశ్వసనీయతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం అధ్యక్షుడైన గడియారం శ్రీహరి సైతం డిప్యూటీ తహసీల్దార్ కావడంతో ఆయనకు దగ్గరగా ఉన్న వారినే ఎన్నికల అధికారులుగా నియమించారని చెబుతున్నారు.
ఓటర్ల జాబితా లేకుండా ఎన్నికలకు వెళ్లి ఎలాగోలా జిల్లా బాడీ పగ్గాలు తిరిగి దక్కించుకోవాలనే కుట్రల్లో భాగంగానే బై-లాను పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా ఎన్నికలు నిర్వహిస్తున్న తీరుపై టీఎన్జీవో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్రస్థాయి నాయకత్వం చొరవ తీసుకొని, నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.