తెలంగాణ సర్కారు.. ప్రభుత్వ బడుల్లో ప్రైవేటుకు దీటుగా నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నది. అందుకు తగ్గట్టుగానే పౌష్ఠికాహారం, కార్పొరేట్ వసతులు కల్పిస్తున్నది. అందులో భాగంగానే ‘మన ఊరు-మన బడి’కి శ్రీకారం చుట్టింది. వీటన్నింటిపై విస్తృత ప్రచారం చేసేందుకు యేటా ఆచార్య జయశంకర్ బడిబాట పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నది. ప్రభుత్వ విద్యను పేదలకు చేరువ చేస్తున్నది. ఈ ఏడాది నుంచి నోటు పుస్తకాలూ పంపిణీ చేయనుండగా, తాంసి మండలంలో 2,148 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన కార్యక్రమం.. 17వ తేదీ వరకు కొనసాగనున్నది. – తాంసి, జూన్ 8
తాంసి మండలంలో 7 ఎంపీపీఎస్ ప్రైమరీ, 4 టీడబ్ల్యూ పీఎస్ ప్రైమరీ, 5 యూపీయూపీఎస్, 4 హైస్కూళ్లు, కేజీబీవీ, ఏహెచ్ఎస్, ఎంజేపీటీబీసీడబ్ల్యూర్ఐఎస్ (గర్ల్స్) ఉన్నాయి. వీటిల్లో 2,548 మంది విద్యార్థులు చదువుకుటున్నారు. వేసవి సెలవులు ముగించుకొని ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఉన్నతాధికారులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు.
మండలంలో ఈ నెల 3 నుంచి ఎంఈవో శ్రీకాంత్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. బడీడు పిల్లలు, బాల కార్మికులున్న ఇం టికి, ప్రదేశాలకు బ్యానర్లు పట్టుకొని ర్యాలీగా వెళ్తున్నారు. కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు, భవనాలు, మైదానాలు, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, బట్టలు తదితరాలు అందిస్తున్నామని వివరిస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా గొప్పగా తీర్చిదిద్దుతామని చెప్తుండడంతో తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకు వస్తున్నారు. మండలంలో అన్ని పాఠశాల్లో కలిపి 114 అడ్మిషన్లు తీసుకున్నట్లు ఎంఈవో తెలిపారు.
ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లలో వి ద్యార్థులకు వర్క్ బుక్స్, నోట్ బుక్స్ అందజేస్తామని ప్రకటించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులకు భారం తగ్గించారు. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వర్క్స్ బుక్స్, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు నోటు పుస్తకాలను ఉచితంగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మండలంలోని 2,148 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగనున్నది.
నేను పొన్నారి పెద్ద బడిలో టెన్త్క్లాస్ సదువుతున్నా. పుస్తకాలతోపాటు ఈసారి నోట్బుక్స్ ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులు ఇస్తారని మా సార్ చెప్పిండు. ఇప్పటికే ఒక్క రూపాయి తీసుకోకుండా సర్కారు చదువు చెబుతున్నది. నోట్ బుక్స్ ఇవ్వడంతో మా లాంటి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పైసలు ఖర్చు తగ్గి, మా తల్లిదండ్రులకు భారం తగ్గుతది.
– శివరాం, పదో తరగతి, జడ్పీ ఉన్నత పాఠశాల పొన్నారి
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఉచితంగా వర్క్ బుక్స్, నోట్ బుక్స్ అందజేస్తామని ప్రకటించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులకు భారం తగ్గించేలా చర్యలు చేపట్టారు. ఈ మేరకు విద్యార్థులకు అందజేస్తాం. చాలామందికి ప్రయోజనం కలుగుతుంది.
– డీ శ్రీకాంత్, ఎంఈవో, తాంసి