పెంబి, మార్చి 19 : మండలంలోని గుమ్మెన కోలాంగూడ, ఎంగ్లాపూర్ గ్రామాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఐదో తరగతి వరకు బోధిస్తున్నారు. గుమ్మెన కోలాంగూడ బడిలో 10 మంది, ఎంగ్లాపూర్ పాఠశాలలో 12 విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు శ్రీకాంత్, శంకర్లు వారానికి రెండు రోజులు పాఠశాలకు వస్తున్నారు. కాగా.. మంగళవారం ఈ రెండు పాఠశాలలను ‘నమస్తే’ సందర్శించగా.. బడులకు తాళం వేసి ఉంది. అలాగే దోందారి నాయకపుగూడ ప్రాథమిక పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు దివ్యశ్రీ దూరభారం అవుతుందని, డిప్యూటేషన్పై దస్తురాబాద్ మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈమె స్థానంలో ఇదే గ్రామానికి చెందిన ఇంటర్ చదువుకున్న ఓ ప్రైవేట్ ఉపాధ్యాయురాలికి వేతనం ఇచ్చి బోధింప చేస్తున్నారు. ఈ విషయాలపై ఎంఈవో మధుసూదన్ను వివరణ కోరగా.. శ్రీకాంత్, శంకర్లు డిప్యూటేషన్పై విధులు నిర్వహిస్తున్నారు. వీరు సక్రమంగా విధులకు వెళ్ళడంలేదని తమ దృష్టికి వచ్చింది. డీఈవోకి రిపోర్టు చేసి వారి డిప్యూటేషన్ను రద్దుచేస్తాం. వారి పోస్టింగ్ స్థానాలకు పంపించి ఈ పాఠశాలలో నూతన ఉపాధ్యాయులను నియమిస్తాం. దోందారి నాయకపుగూడ పాఠశాలలో విద్యార్థులు తక్కువగా ఉండడంతో దివ్యశ్రీని డిప్యూటేషన్పై దస్తురాబాద్ మండలానికి పంపాం. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.