ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)-2023 శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1(డీఈడీ), మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2(బీఈడీ) పరీక్షలు నిర్వహించగా, ఆయా కేంద్రాలను ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 15 : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరిగిందని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ పీఎస్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని భుక్తాపూర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న టెట్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టెట్ మొదటి పేపర్కు 33 పరీక్షా కేంద్రాల్లో 7716 మందికి 7221 , రెండో పేపర్కు 14 కేంద్రాల్లో 3124 మందికి గాను 2955 మంది అభ్యర్థులు హాజరయ్యారని వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్షలను అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఇక్కడ ఆర్డీవో స్రవంతి, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని టీఎస్ టెట్ కేంద్రాలను అదనపు కలెక్టర్ శ్యామలాదేవి శుక్రవారం సందర్శించి అధికారులతో మాట్లాడారు. ప్రశాంతంగా పరీక్ష నిర్వహించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా మైనార్టీ శాఖ అధికారి రమేశ్రాథోడ్ సైతం పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.