బెల్లంపల్లి మండలంలోని తాళ్లగురిజాల.. అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి కనిపించని ఈ గ్రామం.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఒడిసిపట్టుకొని ముందడుగు వేసింది. ‘పల్లె ప్రగతి’ కార్యాక్రమాలతో ఏండ్ల నాటి సమస్యలను పరిష్కరించుకున్నది. అంతర్గత రోడ్లున్న ఈ పల్లె.. ప్రస్తుతం సీసీ రోడ్లతో శుభ్రంగా మారింది. నిధులను సక్రమంగా వినియోగించుకుంటూ అన్ని రకాల అభివృద్ధి పనులను పూర్తిచేసుకొని ఆదర్శంగా నిలుస్తున్నది. వందశాతం ఇంకుడుగుంతల నిర్మాణంతో అధికారుల మన్ననలు పొందింది. – బెల్లంపల్లి రూరల్, డిసెంబర్ 18
తాళ్లగురిజాల గ్రామపంచాయతీలో 320 కుటుంబాలున్నాయి. 1250 జనాభా ఉంది. 948 మంది ఓటర్లున్నారు. గ్రామానికి మంజూరైన 197 ఇంకుడు గుంతలను పూర్తిచేసి, వంద శాతం నిర్మాణాన్ని పూర్తిచేసిన గ్రామంగా అధికారుల మన్ననలను చురగొంది. ప్రభుత్వం ఇంకుడు గుంతల నిర్మాణానికి రూ.8,27,400 ఖర్చు చేసింది. అలాగే గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద 200 మంది మరుగుదొడ్లను నిర్మించుకున్నారు. ఒక్కొక్కరికి రూ.12 వేల చొప్పున రూ.24 లక్షలు అందజేసింది.
మట్టిరోడ్లతో ఇబ్బందులను చవి చూసిన ఇక్కడి ప్రజలు సమస్యలను అధిగమిస్తున్నారు. నిధులను సక్రమంగా వినియోగింకుంటూ అభివృద్ధి వైపుదృష్టి పెడుతున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అందిస్తున్న సహకారంతో డీఎంఎఫ్టీ ద్వారా మంజూరైన రూ.12 లక్షలతో గ్రామంలో 5 సిమెంటు రోడ్లు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద మంజూరైన రూ.4.50 లక్షలతో మరో సీసీ రోడ్డు నిర్మించుకున్నారు. ఈజీఎస్ నుంచి మరో రూ.5 లక్షలతో పంచాయతీలోని ఎస్టీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీంతో అధ్వానమైన అంతర్గత రోడ్లున్న ఈ గ్రామం.. ప్రస్తుతం సీసీ రోడ్లతో శుభ్రంగా మారింది.
తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంప్యార్డుల నిర్మాణాలకు భారీగా నిధులు విడుదల చేస్తూ పల్లెల సర్వతోముఖాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నది. ప్రభుత్వం అందిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకొని ఈ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసింది. గ్రామాభివృద్ధికి ఈ పంచాయతీ రూ.47.60 లక్షలకు వరకు ఖర్చు చేసింది. సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.21 లక్షలు, వైకుంఠధామం నిర్మాణానికి రూ.12 లక్షలు, కంపోస్ట్షెడ్డు నిర్మాణానికి రూ.2.50 లక్షలు, నర్సరీ పనులకు రూ.1.60 లక్షలు, కిచెన్షెడ్డు నిర్మాణానికి రూ.2.50 లక్షలు ఖర్చు చేయగా, పంచాయతీలో తడి-పొడి చెత్త సేకరణ కోసం రూ.7.50 లక్షలతో ట్రాక్టర్ కొలుగోలు చేశారు. ఎప్పటికప్పుడు గ్రామంలో పారిశుధ్య సమస్య తలెత్తకుండా చెత్త తరలించేందుకు వినియోగిస్తున్నారు.
పంచాయతీలో అన్ని హంగులతో నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. వైకుంఠధామంలో దహన సంస్కారాలు చేసేందుకు రెండు బర్నింగ్ పాయింట్లు, అక్కడికి వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా వెయిటింగ్ హాల్, స్నానాలు చేసేందుకు ప్రత్యేకంగా షవర్లు, పురుషులకు, మహిళలకు వేర్వేరుగా డ్రెస్సింగ్ రూమ్లను నిర్మించారు. గ్రామంలోని చెత్తను వేరు చేసేందుకు, తడి-పొడి చెత్త వేరు చేసేలా డంప్యార్డులో ఫ్లాట్ఫాంలను నిర్మించారు. ఇక్కడ వివిధ రకాల చెత్తను వేరు చేసి, వర్మీకంపోస్ట్ ఎరువు తయారు చేసేలా ఏర్పాట్లు చేపట్టారు. ఆహ్లాదకరమైన తాటి వనంలో పల్లె ప్రకృతివనాన్ని ఏర్పాటు చేసి, అక్కడికి వచ్చే వారి కోసం అన్ని వసతులు కల్పించారు.
2019 నాటి నుంచి గ్రామపంచాయతీలో అభివృద్ధికే ప్రాధాన్యమిచ్చాం. నిధులను సక్రమంగా వినియోగించడం వల్లే మూడేళ్లలో ఈ అభివృద్ధి సాధ్యమైంది. ప్రభుత్వ పథకాలపై ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వ నిధులతో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, కంపోస్ట్షెడ్డు, రైతు వేదిక భవనాలను నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చాం. ట్రాక్టర్ను పారిశుధ్య పనులతో పాటు గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనులకు వినియోగిస్తున్నాం.
– గాజుల రంజిత, సర్పంచ్, తాళ్లగురిజాల
అందరి సహకారంతో పంచాయతీలో అభివృద్ధి సాధ్యమైంది. ఈ అభివృద్ధిలో ప్రజల సహకారం మరువలేనిది. పంచాయతీలో డెయిలీ లేబర్ నుంచి సర్పంచ్ వరకు అందరు పనులు పూర్తిచేసేందుకు చాలా శ్రమించారు. అన్ని రకాల నిర్మాణాలను పూర్తిచేసుకున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎప్పటికప్పుడు దశల వారీగా పనులను జరిపిస్తూ ఇచ్చిన గడువులోగా పూర్తి చేశాం. ఇదే స్ఫూర్తితో అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేసేలా పని చేస్తున్నాం.
– ఎదుల లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి